బొంరాస్పేట, డిసెంబర్ 1 : మనిషికి అంగవైకల్యం విధి రాసిన వింతరాత. పోటీ ప్రపంచంలో సకలాంగులతో పోటీపడి ఎదుగాలంటే అపసోపాలు పడాల్సి వస్తుంది. అందునా విద్యార్థులైతే మరీ కష్టం. దివ్యాంగ విద్యార్థులు సాధారణ విద్యార్థులతో పోటీపడి పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాలంటే కష్టం. అలాంటి విద్యార్థులకు ప్రభుత్వం పరీక్షల్లో కొన్ని మినహాయింపులు కల్పించింది. పాఠశాలల్లో చదివే దివ్యాంగ విద్యార్థులకు(సీడబ్ల్యూఎస్ఎన్) పరీక్షల్లో మినహాయింపులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మానసిక దివ్యాంగులు, ఆటిజం, కుష్టు వ్యాధిగ్రస్తులు, మరుగుజ్జులు, కండరాల క్షీణత గలవారు, యాసిడ్ దాడి బాధితులు, అభ్యసన లోపాలు ఉన్నవారు, సిరిబ్రల్ పాలసీ బాధితులు ఇలా ఎనిమిది విభాగాలకు చెందిన 6 నుంచి 10వ తరగతి దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులను తగ్గిస్తూ వెసులుబాటు కల్పించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేసింది.
ఉపయోగాలు ఇవి..
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు సాధారణ విద్యార్థులతో కలిసి పోటీపడి పరీక్షలు రాయడం, ఉత్తీర్ణతకు కావలసిన మార్కులు సాధించడం కష్టమని భావించిన విద్యాశాఖ వారికి ఉత్తీర్ణత మార్కుల్లో మినహాయింపులు ఇచ్చింది. దివ్యాంగ విద్యార్థులు పరీక్ష రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. సాధారణ విద్యార్థులకు పరీక్ష సమయం 3 గంటలు ఉంటే దివ్యాంగులకు 4 గంటలు ఇస్తారు. సాధారణంగా విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో 100కు 35 మార్కులు వస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. మానసిక దివ్యాంగులు, ఆటిజంతో బాధపడే విద్యార్థులకు పాస్ మార్కులను 35 నుంచి 10 మార్కులకు.. కుష్టు వ్యాధిగ్రస్తులు, మరుగుజ్జులు, కండరాల క్షీణత ఉన్నవారు, యాసిడ్ బాధితులు, అభ్యసన లోపాలు ఉన్నవారు, సెరిబ్రల్ పాలసీ బాధిత విద్యార్థులకు 20 మార్కులు వస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. గ్రాఫ్లు, జామెట్రీ మ్యాప్లు, వ్యాకరణ సంబంధిత అంశాలను లెక్కల్లోకి తీసుకోకుండా వీరి జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలి. భాష ఉచ్ఛారణ సంబంధిత వైకల్యం ఉన్నవారి జవాబు పత్రాలను ఆయా విభాగాల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాత్రమే మూల్యాంకనం చేయాలి.
తీవ్ర చెవుడు ఉన్నవారికి చేతి సైగలతో అన్వయం చేసేవారు పరీక్షల్లో సహకరిస్తారు. పరీక్ష సమయంలో వీరు వినికిడి యంత్రాలను కూడా ఉపయోగించుకోవచ్చు. అవసరమైన వారు సహాయకులను కూడా ఉపయోగించుకోవచ్చు. అన్ని విభాగాల వారికి జంబ్లింగ్ నుంచి మినహాయింపు ఉంటుంది. దివ్యాంగ విద్యార్థులకు విద్యాశాఖ ఇచ్చిన ఈ వెసులుబాటు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నారు. ఈ నిర్ణయం 10వ తరగతి చదివే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది.
జిల్లాలో 427 మంది దివ్యాంగ విద్యార్థులు
వికారాబాద్ జిల్లాలో 6 నుంచి 10వ తరగతి వరకు 427 మంది దివ్యాంగ విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. 6వ తరగతిలో 94 మంది, 7వ తరగతిలో 23, 8వ తరగతిలో 80, 9వ తరగతిలో 60, 10వ తరగతిలో 60 మంది చదువుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న పాస్ మార్కుల తగ్గింపు నిర్ణయంతో వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షలు రాసే 60 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వ నిర్ణయంపై దివ్యాంగ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నత స్థానాలకు ఎదుగడానికి మంచి అవకాశం – రవికుమార్, ఏఎంవో
దివ్యాంగ విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదుగడానికి ఇది మంచి అవకాశం. చదువుల్లో దివ్యాంగులు సాధారణ విద్యార్థులతో పోటీ పడాలంటే కష్టం. దీనిని ప్రభుత్వం గుర్తించి వారిని ప్రోత్సహించడానికి పాస్ మార్కులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమలవుతుంది. దివ్యాంగ విద్యార్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలి.