తాండూరు, అక్టోబర్ 10 : తాండూరు నియోజకవర్గానికి హైదరాబాద్లోని చార్మినార్కు ఉన్న ఘన చరిత్ర ఉన్నది. నాలుగు వందల ఏండ్ల క్రితమే నియోజకవర్గంలో పలు గ్రామాలు ఏర్పాటయ్యాయి. అయితే వందేండ్ల క్రితం వరకు అంతగా ఎదగని పల్లెలు ఆ తర్వాత అభివృద్ధికి నోచుకున్నాయి. నిజాం నవాబుల కాలంలో ఓ వెలుగు వెలిగిన గ్రామాల్లోని పలు చారిత్రక కట్టడాలు నేటికీ అప్పటి చరిత్రను చాటుతున్నాయి. నిజాం కాలంలో పలువురు జాగిర్దార్లు నియోజకవర్గంలోని పలు గ్రామాలను తమ ఆధీనంలో ఉంచుకుని అధికారం(పరిపాలన) సాగించేవారు. తాండూరు మండలంలోని కరన్కోట, బషీరాబాద్, పెద్దేముల్, యాలాల తదితర గ్రామాలు పెద్ద గ్రామాలుగా కొనసాగాయి. బషీరాబాద్ ఏకంగా అప్పటి మైసూర్ రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాకు కేంద్రంగా కొనసాగడం విశేషం. 1948లో భాషా ప్రయుక్త రాష్ర్టాలు ఏర్పాటయ్యే వరకు బషీరాబాద్ గుల్బర్గా జిల్లాకు కేంద్రంగానే ఉన్నది. అప్పుడే బషీరాబాద్లో ఆధునిక విధానంలో రోడ్డు మార్గాలతోపాటు ఓ ప్రధాన జైలు, జిల్లా కోర్టుల భవనాలను నిర్మించారు.
ఈ రెండు భవనాలు ప్రస్తుతం పాఠశాల భవనాలుగా కొనసాగుతుండడం విశేషం. ప్రస్తుతం అమలు చేస్తున్న టౌన్ ప్లానింగ్, లేఅవుట్ విధానాన్ని వందేండ్ల క్రితమే బషీరాబాద్లో నిజాం నవాబులు అమలు చేయడం గమనార్హం. బషీరుదౌలా అనే జాగిర్దారు బషీరాబాద్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని 1940 వరకు ఈ ప్రాంతంలో పన్నులను వసూలు చేసి నిజాం నవాబులకు వాటిని చెల్లించేవారట. ఆయన పేరిటే బషీరాబాద్ ఏర్పాటైనట్లు సమాచారం. అప్పటివరకు పక్కన ఉన్న నవాంద్గి గ్రామమే బషీరాబాద్కు ప్రధాన గ్రా మం. అయితే కాలక్రమంలో నవాంద్గి గ్రామం బషీరాబాద్కు అనుబంధ గ్రామంగా మారింది. బషీరాబాద్ గ్రామం ఏర్పాటు కాకముందే నవాంద్గి గ్రామం పేరిట బషీరాబాద్లో 1918 రైల్వే స్టేషన్ను కూడా ఏర్పాటు చేశారు. 1924-28 మధ్య బషీరాబాద్లో గుల్బర్గా జిల్లాకు కేంద్రమైన జిల్లా కేంద్ర కర్మాగారాన్ని, జిల్లా కోర్టుల సముదాయాన్ని ఏర్పాటు చేశారు. మండలంలోని జీవన్గి, కంసాన్పల్లి(ఎం), కొర్విచేడ్, మాసన్పల్లి, ఎక్మాయి, దామర్చేడ్ గ్రామాలు దొరల ఆవాసాలుగా ఉండేవి. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇప్పటికీ పెద్ద కోట బుర్జులు అలనాటి చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయి. ఆ కాలంలో శత్రువులు, క్రూరమృగాలు, దొంగల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు కోట బుర్జులను జాగీర్దార్లు ఏర్పాటు చేయించేవారు.
‘తాండ్ర’ పేరిట తాండూరు..
నిజాంకాలం(1920 ప్రాంతం)లో తాండూరు ప్రాంతం అభివృద్ధి చెందింది. మొదట పాత తాండూరు పట్టణం మాత్రమే ఉండేది. అక్కడ ప్రస్తుతం ఉన్న భావిగి భద్రేశ్వరస్వామి ప్రధాన ఆలయమే కనిపించేది. ఆ సమయంలో భద్రేశ్వరస్వామి ఆలయ పరిసరాలు పొలాలు, అడవులతో నిండి ఉండేది. తాండూరు పరిసరాల్లోని పాత తాండూరు, కోకట్, రసూల్పూర్ తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున మామిడి తోటలు పెంచేవారని పూర్వీకుల కథనం. ఆ పండ్లను ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేసేవారు. అలాగే మామిడి పండ్ల నుంచి రసాన్ని (తాండ్ర)ను తీసి విక్రయించేవారు. ఈ తాండ్ర అనే పదం పేరుతోనే 1870లో పాత తాండూరు పట్టణం ఏర్పాటైంది. ఈ పట్టణానికి ప్రస్తుత కోటేశ్వరాలయం ఆనుకొని పెద్ద కోట గోడ ఉండేది. 1990లో తాండూరు-వాడి డబుల్ రైల్వేలైన్ నిర్మాణం కోసం ఈ మట్టి కోట గోడ మట్టిని వినియోగించారు. దీంతో పాత తాండూరు కోట బుర్జు ఆనవాళ్లు పూర్తిగా కనుమరుగైనవి.
యాలాలకు 200 ఏండ్ల్ల చరిత్ర
నియోజకవర్గంలోని యాలాల మండల కేంద్రానికి 200 ఏండ్ల ఘన చరిత్ర ఉన్నది. వందలాది చేనేత కుటుంబాలు యాలాల గ్రామాన్ని స్థావరంగా చేసుకొని చేనేత వ్యాపారాన్ని చేశారు. ఆ సమయంలో ఇక్కడ జరిగే సంతల్లో రతనాలను అమ్మేవారట. యాలాల చరిత్రకు సాక్ష్యంగా వందకు పైగా నేత కుటుంబాల గృహాలు నేడు శిథిలావస్థకు చేరాయి. తాండూరు పరిసరాల్లోని ప్రజలు కూడా యాలాల సంతకు వెళ్లి సరుకులు, రత్నాలు కొనుగోలు చేసేవారని పూర్వీకులు చెబుతున్నారు. 1930 వరకు యాలాల ఈ ప్రాంతంలో ప్రధాన పట్టణంగా పేరొందింది.
1952లో తాండూరు నియోజకవర్గం ఏర్పాటు..
నిజాం రాష్ట్రంలో భాగంగా ఉన్న తాండూరు 1952లో నియోజక వర్గంగా ఏర్పాటైంది. 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుతో హైదరాబాద్ జిల్లాలో కలిసింది. 1956లో భాషాప్రయుక్త రాష్ర్టాల విభజన ఫలితంగా తెలంగాణలో భాగమై 1978 వరకు హైదరాబాద్ జిల్లాలోనే కొనసాగింది. 1978 మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయడంతో ఈ జిల్లాలో భాగమైంది. 1986లో మండల వ్యవస్థ ప్రారంభం కావడంతో తాండూరు మండల కేంద్రంగా మారింది. 1953లోనే పట్టణ పాలన కోసం పురపాలక సంఘం ఏర్పడింది. 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొత్త జిల్లా ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపడంతో 11 అక్టోబర్ 2016లో వికారాబాద్ను ప్రత్యేక జిల్లాగా ఏర్పడడంతో వికారాబాద్ జిల్లాలో భాగమై కొనసాగుతున్నది. దీంతో తాండూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రగతిలో మేటిగా నిలిచింది.
తాండూరు నియోజకవర్గం వివరాలు
తాండూరు నియోజకవర్గంలో 4 మండలాలు, 143 గ్రామ పంచాయతీలు, 1 మున్సిపాలిటీ ఉన్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య : 2,28,495, స్త్రీలు : 1,17,243, పురుషులు: 1,11,242, ట్రాన్జెండర్స్: 10 మంది ఉన్నారు.