తాండూరు, మే 24 : తెలంగాణలో కరెంట్ కష్టాలు ఉండరాదని సీఎం కేసీఆర్ విద్యుత్ రంగంలో పూర్తిస్థాయి సంస్కరణలను తీసుకువచ్చారు. దీంతో వ్యవసాయం మొదలుకొని అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ అందించేలా కావాల్సిన సదుపాయాలను అభివృద్ధి చేశారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో నిరంతర కరెంటుతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రంగాల్లో వెలుగులు నిండుతున్నాయి. ఆసియా ఖండంలోనే నాపరాతికి ప్రసిద్ధిగాంచిన తాండూరులో 24 గంటల విద్యుత్తో నాపరాళ్ల పరిశ్రమలు లాభాలతో కొసాగుతున్నాయి.
పవర్ హాలిడేతో మూతపడ్డ పరిశ్రమలు
2012లో ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలకు ఏకంగా వారంలో మూడు రోజుల పాటు పవర్ హాలిడేను ప్రకటించడంతో తీవ్ర ఇబ్బందులు పడిన అనేకమంది నాపరాళ్ల పరిశ్రమల యజమానులు తమ వ్యాపారాలను మానుకున్నారు. ఆ తర్వాత కూడా వారంలో ఒక రోజు పవర్ హాలిడే ఉండడంతో నియోజకవర్గంలోని నాపరాళ్ల క్వారీలు, పాలిషింగ్ పరిశ్రమల యజమానులు కరెంటు కోతల కారణంగా రోజుకు సగటున కనీసం రూ.15లక్షల ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితులు ఉండేవి. కార్మికులకు కూడా ఇదే రీతిలో కష్టకాలం దాపురించేది.
రోజుకు 16 నుంచి 18 గంటల పనులు
నీళ్లు, నిధులు, నియామకం అనే నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చక్కటి ప్రణాళికలతో నిరంతరం విద్యుత్ అందుతున్నది. దీంతో తాండూరులో నాపరాతి పరిశ్రమలు ఊపందుకున్నాయి. కార్మికులు 16 నుంచి 18 గంటల పాటు పాలిషింగ్ యూనిట్లలో, నాపరాళ్ల క్వారీల్లో పనులు చేసుకుంటున్నారు. ఒక్కో పాలిషింగ్ యూనిట్ ద్వారా సగటున 4 మిషన్లకు వెయ్యి నుంచి 12 వందల చదరపు అడుగుల నాపరాళ్లు పాలిషింగ్ చేస్తున్నారు. ఒక్కో మిషన్ ద్వారా ఒక కార్మికుడు 300 నుంచి 500 చదరపు అడుగుల నాపరాళ్లను పాలిష్ చేస్తూ రూ.600 నుంచి రూ.900 వరకు దినసరి కూలీ తీసుకుంటున్నారు. సీమాంధ్ర పాలనలో వారంలో మూడు రోజుల పాటు పవర్ హాలిడే అమలు చేస్తే ఒక్కో కూలీకి వారంలో వచ్చే కూలీ ఆదాయం రూ.1800 నుంచి రూ.2400 ఉండేది. ప్రస్తుతం నిరంతరం కరెంటు ఉండడంతో కార్మికులతో పాటు ఒక్కో పాలిషింగ్ యూనిట్ ద్వారా యజమానికి కూడా ఒక రోజుకు రూ.2 వేల నుంచి 10 వేల వరకు ఆదాయం సమకూరుతున్నది. ఈ లెక్కన 800 పాలిషింగ్ యూనిట్ల యజమానులు ఒక రోజులో కనీసం రూ.16 లక్షల నుంచి రూ.80 లక్షల ఆదాయాన్ని పొందుతున్నారు.
విదేశాలకు ఎగుమతులు
తాండూరు ప్రాంతం నుంచి దేశంలోని మహారాష్ట్ర నాగ్పూర్, పుణె, ముంబయి, గోవా, కర్ణాటక, బెంగుళూరు, హుబ్లీ, దార్వాడ్, బీదర్, తమిళనాడు సేలం, గుజరాత్, అహ్మదాబాద్, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తదితర ప్రాంతాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు. అంతేకాకుండా తాండూరు నాపరాయిని యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థలో తాండూరు ప్రాంత నాపరాయికి భాగస్వామ్యం లభిస్తున్నది. స్విమ్మింగ్పూల్, ప్రహరీల నిర్మాణం, పార్కులు వంటి స్థలాల్లో కూడా తాండూరు నాపరాయిని వాడుతున్నారు.
నాపరాతి పరిశ్రమలే జీవం పోస్తున్నాయి
– ప్రమీల, కార్మికురాలు, తాండూరు
మాది ధారూర్ మండలం గట్టెపల్లి గ్రామం. అక్కడ సరైన ఉపాధి లభించకపోవడంతో తాండూరుకు వచ్చి పదిహేనేండ్లుగా నాపరాళ్ల పరిశ్రమలో నేను నా భర్త పనిచేస్తున్నాం. గతంలో సరైన విధంగా విద్యుత్ లేకపోవడంతో సరిగా పనులు దొరికేవి కావు. ఇప్పుడు 24 గంటలు కరెంటు ఉండడంతో ఇద్దరం కలిసి రోజుకు రూ.1200 నుంచి రూ.1600 సంపాదిస్తున్నాం. నాపరాళ్ల యూనిట్లో పనిచేస్తూనే పిల్లలను ఉన్నత చదువులు చదివించాం. నాపరాళ్ల పరిశ్రమ మాకు ఉపాధిని కల్పించడంతోనే ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉంటున్నాం.
సంతోషంగా పనులు చేసుకుంటున్నాం
– భగవంతు, కార్మికుడు, తాండూరు
నాది నాగర్కర్నూల్ జిల్లా, పెద్ద కొత్తపల్లి మండలం, దేదినేనిపల్లి గ్రామం. స్వగ్రామంలో ఉపాధి లేకపోవడంతో 13 సంవత్సరాల క్రితం కుటుంబంతో కలిసి తాండూరుకు వచ్చి నాపరాత్రి పాలిషింగ్ మిషన్లలో పనులు చేసుకుంటు న్నాం. భూములు, ఉద్యోగాలు లేని మాలాంటి కుటుంబాలకు నాపరాతి గనులు, పాలిషింగ్ మిషన్లు ఉపాధి కల్పిస్తూ మా జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. 24 గంటల కరెంటు ఉండడంతో 12 నుంచి 16 గంటలు పనులు చేసుకుంటున్నాం. రాతి పనులు కష్టమైనప్పటికీ ఇష్టంతో పనిచేస్తూ సంతోషంగా జీవిస్తున్నాం.
నిరంతర విద్యుత్తో వేగంగా పనులు
– నయీం, స్టోన్ మర్చంట్ వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షుడు
24 గంటలు కరెంట్ ఉండడంతో తాండూరులో నాపరాతి పరిశ్రమల్లో పనులను వేగంగా చేపడుతున్నాం. దీంతో గతంలో కంటే ఎక్కువగా నాపరాతి విక్రయాలు జరుగుతున్నాయి. కూలీలకు కూడా మంచిగా పనులు దొరుకుతున్నాయి. ఒకప్పుడు కరెంటు కోతలతో నాపరాత్రి వ్యాపారం చాలా నష్టాల్లో ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వ్యాపారం మంచిగా నడుస్తున్నది. నిరంతర విద్యుత్ ఇస్తున్న తెలం గాణ సర్కార్కు కృతజ్ఞతలు. నాపరాతిపై పెంచిన రాయల్టీని తగ్గిస్తే మరింత మేలు జరుగుతుంది.