షాబాద్, అక్టోబర్ 1: మామిడి పంట సాగు చేసే రైతులందరూ సంఘటితమై రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడాలని రాష్ట్ర ఉద్యానవన అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ డీడీహెచ్ బాబు అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి డాక్టర్ సునందారెడ్డితో కలిసి నగరంలో మామిడి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో రాయితీలు, పథకాలు, ప్రోత్సహకాలు అన్ని రైతు ఉత్పత్తిదారుల సంఘాల్లో ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వనున్నట్లు చెప్పారు. అన్నదాతల ఆదాయం పెంచడానికి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఎంతో దోహదపడుతాయన్నారు. పెట్టుబడుల కోసం తక్కువ వడ్డీకి రుణాలు, నాణ్యమైన విత్తనాలు అందజేయనున్నట్లు తెలిపారు. కస్టమ్స్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు, ప్రత్యేకంగా ఎరువుల దుకాణం, ఔట్లెట్లకు కూరగాయలు విక్రయిస్తూ పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా ఈ సంఘాలు కృషి చేస్తూ, మన్ననలు పొందుతున్నట్లు వివరించారు. జిల్లాలో మామిడి రైతు ఉత్పత్తిదారుల సంస్థను ఎలా ఏర్పాటు చేయాలి, చేసిన సంఘాల్లో రైతులు ఎలా సభ్యత్వం పొందాలి, సంస్థను ఎలా బలోపేతం చేసుకోవాలి, రిజిస్ట్రర్ అయిన సంస్థ చట్టబద్దంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సంస్థలోని డైరెక్టర్ల విధి విధానాలు గురించి రైతులకు అర్థమయ్యేలా జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి డాక్టర్ సునందారెడ్డి వివరించారు.
ప్రస్తుతం జిల్లాలోని పండ్ల తోటల్లో అధికంగా మామిడి 22,083 ఎకరాల్లో సాగులో ఉన్నట్లు తెలిపారు. మామిడి పంటకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మామిడి ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నూతనంగా నాలుగు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మామిడి పండించే రైతులు పది మందితో ఒక్కో సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాచకొండ, తలకొండపల్లి, కందుకూరు, మహేశ్వరం, షాద్నగర్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు కెపాసిటీ బిల్టింగ్ శిక్షణా కార్యక్రమం నిర్వహించిన్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 5వేల నుంచి 6వేల వరకు మామిడి రైతులు ఉన్నారన్నారు. ఇందులో ఆసక్తి ఉన్న మామిడి రైతులను నాలుగు గ్రూపుల కింద తయారు చేసి, ఈ రైతుల సంఘం మామిడి ఎగుమతి చేసుకునేలా, ప్రాసెసింగ్ చేసేలా, వాల్యూ ఎడిషన్ చేసేవిధంగా వ్యవసాయం చేసుకోవడానికి ఏవైనా కొనుక్కోవడానికి, ఫర్టిలైజర్లు విత్తనాలను కొనుక్కోవడానికి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఈ సంఘాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మామిడి పంట సాగు చేస్తున్న ప్రతి రైతు ఉత్పత్తిదారుల సంఘాల్లో చేరాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో మాస్ సంస్థ ప్రతినిధి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.