రంగారెడ్డి, సెప్టెంబర్ 27, (నమస్తే తెలంగాణ), పరిగి: గులాబ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లా కలెక్టరేట్ మొదలుకొని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేక కంట్రో ల్ రూంను ఏర్పాటు చేశామన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో 24 గంటల ప్రత్యేక కంట్రోల్ రూమ్ (6305954956 ) ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.పురాతన ఇండ్లు, భవనాల్లో నివాసం ఉండే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చెరువులు నిండి ఉప్పొంగి ప్రవహిస్తున్న దృష్ట్యా ఎవరూ చేపలు పట్టేందుకు చెరువులు, వాగుల వద్దకు వెళ్లొద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కింద నిలబడవద్దన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద నీరు వస్తే సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని గమనిస్తూ ప్రజలకు అండగా ఉండాలన్నారు. మరోవైపు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకుగానూ 24 గంటలపాటు అందుబాటులో ఉండే మాన్సూన్ ఎమర్జన్సీ బృందాలతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల చైర్మన్లు, మేయర్లు, కమిషనర్లు, జడ్పీటీసీలు, సర్పంచ్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని గమనిస్తూ ప్రజలకు అండగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు, రెవెన్యూశాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
సమీక్షించిన మంత్రి
వికారాబాద్ జిల్లాలోని వర్షం పరిస్థితులపై కలెక్టర్ నిఖిలతో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సమీక్షించారు. పెద్దేముల్ మండలం కందనెల్లితండాలో చోటు చేసుకున్న ఘటనపై ఫోన్లో కలెక్టర్తో మంత్రి ఆరా తీశారు. అకస్మాత్తుగా గాలి, వానతో ప్రజలు ఆందోళనకు గురయ్యారని, అధికారులు వెళ్లి పరిస్థితిని తెలుసుకొని ప్రజలకు ధైర్యం కల్పించా లన్నారు. జిల్లాలోని వాగులు, కాల్వలు, చెరువుల వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించి, తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.