వరంగల్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. పీవీ గొప్పతనాన్ని ఇప్పటి, భవిష్యత్తు తరాలకు తెలిసేలా చేస్తున్నది. ఈ ఉత్సవాల్లో భాగంగా పీవీ సొంతూరు వంగరను గొప్పపర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నది. వందేండ్ల క్రితం కట్టిన వంగరలోని ఆయన సొంతింటిని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘పీవీ నర్సింహారావు మెమోరియల్ మ్యూజియం’గా అభివృద్ధి చేసే పనులను ప్రభుత్వం మొదలు పెట్టింది. పీవీ ఏ స్థాయిలో ఉన్నా వంగరలోని సొంతింట్లో ఉండేందుకే ఇష్టపడేవారు. ఆయన వాడిన వస్తువులు, అరుదైన ఫొటోలు, రచనలు, ఆయన ఇష్టపడి తెచ్చుకున్న ప్రత్యేకమైన వస్తువులన్నింటినీ మ్యూజియం లో పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వయస్సుతో నిమిత్తం లేకుండా అన్ని విషయాలను తెలుసుకునేవారు. చదువు, రాత, టెక్నాలజీ వినియోగం, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ వస్తువు ఏదైనా వాటి గురించి బాగా తెలుసుకునే వారు. ఇలా జీవితకాలంలో ఆయన వినియోగించిన వస్తువులను ఒక్క చోట చేర్చే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. పీవీకి సంబంధించి అరుదైన వస్తువులను ఇప్పటికే గుర్తించారు. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, దాని ప్రాముఖ్యత ఏమిటనేది వివరించేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్తుతరాలకు పీవీ గొప్పదనాన్ని చాటేలా ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడికి వచ్చే వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కెఫెటేరియా, టాయిలెట్లు, గార్డెన్, పిల్లల ఆట స్థలం వంటివి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.