పద్మనగర్లో వేగంగా సాగుతున్న 132కేవీ సబ్స్టేషన్ నిర్మాణ పనులు
వావిలాలపల్లె 132కేవీపై తగ్గనున్న భారం
ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక తయారీ
ముకరంపుర, నవంబర్ 24: స్మార్ట్సిటీగా ఎంపికైన కరీం‘నగర’ం దినదినం వేగంగా విస్తరిస్తున్నది.. ముఖ్యంగా వ్యవసాయ, నిర్మాణ రంగాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తున్నది. వ్యాపార, వాణిజ్య, వినోద, ఐటీ, అతిథ్య రంగాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కరీంనగర్ బల్దియా.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన కరంట్ సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ దిశగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా
నగరానికి వావిలాలపల్లె, వాటర్వర్క్స్ (హౌసింగ్ బోర్డు కాలనీ)లోని 132కేవీ సబ్స్టేషన్లు ప్రధాన ఆధారం. వీటి నుంచే విద్యుత్ సరఫరా జరుగుతున్నది. నగరం విస్తరిస్తున్న కొద్ది సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త ఫీడర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. యేటా డొమెస్టిక్తో పాటు వాణిజ్య కనెక్షన్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సింగిల్విండో విధానంతో కొత్త పరిశ్రమల స్థాపన జరుగుతున్నది. వినియోగం పెరిగిన కొద్ది ఓవర్లోడ్ సమస్య వేధిస్తున్నది. వేసవిలో ఈ సమస్య జఠిలమవుతున్నది. ఈ పరిస్థితుల్లో కరీంనగర్ అవసరాలకు అనుగుణంగా మరో 132కేవీ సబ్స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టారు. పద్మనగర్ బైపాస్ రోడ్డులో సుమారు రెండెకరాల విస్తీర్ణంలో రూ.20కోట్లతో పనులు మొదలయ్యాయి. సాధ్యమైనంత తొందరలో అందుబాటులోకి తీసుకువచ్చేలా ట్రాన్స్కో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 40 శాతం వరకు స్ట్రక్చర్ ఎరక్షన్ పని పూర్తయింది. పద్మనగర్ 132కేవీ సబ్స్టేషన్ను మల్కాపూర్ శివారులోని 220కేవీ దుర్శేడ్-సిరిసిల్ల లైన్తో అనుసంధానించనున్నారు. ఇందుకు సంబంధించిన టవర్ల నిర్మాణ పనులు 70 శాతం మేర పూర్తయ్యాయి. కంట్రోల్ రూంతో పాటు ప్రహరీ పనులు ప్రారంభమయ్యాయి.
కొత్త ఫీడర్లతో నాణ్యమైన కరెంట్
కొత్తగా నిర్మిస్తున్న 132కేవీతో గ్రానైట్ పరిశ్రమకు సుమారు నాలుగు ఫీడర్లు, నగరానికి మరో నాలుగు ఫీడర్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో ఉన్న ఇబ్బందులు తీరనున్నాయి. గ్రానైట్కు అనుబంధంగా మరిన్ని కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇండస్ట్రియల్ ఏరియాలో ఔత్సాహికులు కొత్తగా పరిశ్రమల ఏర్పాటు చేసుకునే వీలున్నది. కొత్త సబ్స్టేషన్తో ఐటీ పరిశ్రమ అవసరాలు తీరనున్నాయి. ఇప్పటికే ఎల్ఎండీ వద్ద ఐటీ టవర్ ఉండగా, భవిష్యత్లో మరిన్ని ఏర్పాటు చేసినా నాణ్యమైన విద్యుత్ అందించే విధంగా నిర్మిస్తున్నారు. స్మార్ట్ సిటీ అవసరాలు తీర్చడంతో పాటు మానేరు రివర్ఫ్రంట్ ప్రాంతానికి సైతం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించే ప్రణాళికతో నిర్మాణం చేపడుతున్నారు.
ప్రత్యామ్నాయ సరఫరా..
ప్రస్తుతం నగరానికి హౌసింగ్బోర్డుకాలనీ, వావిలాలపల్లె 132కేవీ సబ్స్టేషన్లే కీలకం. ఏ ఒక్కదానిలో సమస్య వచ్చినా నగరంలోని పలు ప్రాంతాలకు సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నది. పద్మనగర్ 132కేవీ నిర్మాణం పూర్తయితే ఈ సమస్య తీరనున్నది. ఎక్కడ సమస్య వచ్చినా సరఫరాలో రెప్పపాటు కూడా విద్యుత్ అంతరాయం లేకుండా పద్మనగర్ నుంచి ప్రత్యామ్నాయ సరఫరా ఇచ్చేలా ఫీడర్లను అనుసంధానం చేయనున్నారు. గత కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ ప్రతిపాదన పద్మనగర్ 132కేవీ నిర్మాణంతో కార్యరూపం దాల్చనుంది.