జీడిమెట్ల, మే 4 : జీడిమెట్ల టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ ఓ గుట్కా వ్యాపారిని బెదిరించి రూ.50 వేలు డిమాండ్ చేసిన ముగ్గురు వ్యక్తులను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ కె.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. వారసిగూడకు చెందిన గాయిని శ్రీకాంత్, ఘట్కేసర్కు చెందిన చిదిరి అమర్నాథ్, మల్కాజిగిరికి చెందిన ఎండీ.ఇమ్రాన్ షాపూర్నగర్ మార్కెట్లోని దినేష్ హోల్ సేల్ కిరాణం దుకాణం వద్దకు వెళ్లి గుట్కా ప్యాకెట్లు కావాలని అడిగారు. సదరు వ్యాపారి గుట్కా ప్యాకెట్లు ఉన్నాయని బదులివ్వడంతో తాము జీడిమెట్ల టాస్క్ ఫోర్స్ పోలీసులమని బెదిరించారు. రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో దినేశ్కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
వారసిగూడకు చెందిన గాయిని శ్రీకాంత్ నిజామాబాద్ జైల్లో వార్డర్గా పనిచేస్తుండగా., ఘట్కేసర్కు చెందిన చిదిరి అమర్నాథ్ అంబర్పేట్ పోలీస్ క్యాంపులో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరూ మల్కాజిగిరికి చెందిన ఇమ్రాన్తో కలిసి ఎలాగైనా డబ్బులు సంపాదించాలని పథకం వేశారు. గుట్కా వ్యాపారిని టార్గెట్ చేసి చివరకు కటకటాలపాలయ్యారు.