దేశంలోని ఆడబిడ్డల వెంట నడుద్దాం! వారిపై దాష్టీకాలకు అడ్డుకట్ట వేద్దాం! వారికి మనోధైర్యాన్నిద్దాం! ఢిల్లీలోని జంతర్-మంతర్ వద్ద మన అంతర్జాతీయ మహిళా కుస్తీ బిడ్డలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని న్యాయం కోరుతూ 26 రోజులుగా సత్యాగ్రహం చేస్తున్నారు! కేంద్రంలో అధికారంలో ఉన్న వారెవ్వరూ కనీసం మానవత్వం ఉన్న మనుషులగా నైనా వారి దిక్కు చూడడం లేదు!
మహిళల రక్షణ, సాధికారత అంటూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే స్మృతీ ఇరానీ, నిర్మలా సీతారామన్ వంటి మహిళా కేంద్రమంత్రులు సైతం నోరెత్తడం లేదు. అయినప్పటికీ కుస్తీ బిడ్డల న్యాయ పోరాటానికి దేశంలోనే కాదు అంతర్జాతీయంగాను మద్దతు లభిస్తున్నది! ఈనెల 21 తర్వాత దేశంలోని సంయుక్త కిసాన్ మోర్చా వారికి మద్దతుగా ఆందోళనకు సిద్ధం కానున్నది! దేశంలో నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 378 రోజులు ఆందోళన చేసిన రైతాంగం,అదే స్ఫూర్తితో కుస్తీ బిడ్డల న్యాయపోరుకు మద్దతుగా నిలవాలని నిర్ణయించింది.
మహిళా రెజ్లర్లు 26 రోజులకు పైగా ఎండ, వానలతో పాటు పోలీస్ల దాష్టీకానికి వెరవక మొక్కవోని పట్టుదలతో దీక్షలు చేస్తున్నారు. పాలకులు విద్యుత్ తీసేసి, నీళ్లు దొరకకుండా చేసినప్పటికీ పట్టు సడలించడం లేదు. రెజ్లర్ల సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా అతన్ని అరెస్టు చేయాలనే డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అగ్రశ్రేణి రెజ్లర్లు, మన దేశం ముద్దు బిడ్డలు ఆందోళనను కొనసాగిస్తున్నారు. వారి పోరాటం బలోపేతానికి, వారికి మేమున్నామనే మనోధైర్యాన్నివ్వాల్సిన అవసరం ఉన్నది. దాని కోసం..90539 03100కు మిస్డ్ కాల్ ఇవ్వండి… మన భారత కుమార్తెల ఉద్యమానికి మద్దతు తెలపండి.
మరోవైపు రెజ్లర్లు తమ నిరసనను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. మద్దతు కోసం ఇతర దేశాలలోని ఒలింపియన్ రెజ్లర్లను సంప్రదిస్తున్నట్టు రెజ్లర్ సాక్షి మాలిక్ తెలిపారు.
బేటీ బడావో బేటీ పడావో అని నినదించడం కాదు ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించాలని ఆందోళన కారులు కోరుతున్నారు. నిజంగా ఈ దేశ ఆడబిడ్డల మీద ప్రధాని నరేంద్రమోదీకి ఏమాత్రం గౌరవం, ప్రేమ లేదు! దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలు దీన్ని నిరూపిస్తున్నాయి కూడా.
ఇది ఒక కుస్తీ బిడ్డల సమస్య మాత్రమే కాదు. దేశంలో ఇంటా, బయట, ప్రతిచోట ఏమాత్రం సురక్షితంగా లేని ప్రతి బిడ్డ సమస్య అని గుర్తించాలి! పీఎం మోదీజీ ఇప్పటికైనా నోరు తెరిచి మాట్లాడాలి. బిడ్డల రక్షణ మీద మీరు ఇచ్చిన హామీలకు ఆచరణ రూపం ఇవ్వండి! మోదీజీ ప్రతీ విషయం, ఆందోళన మీకు రాజకీయంలా కనిపిస్తుందా? లకిమ్పూర్ఖేరిలో మీ కేబినెట్ మంత్రి అజయ్ మిశ్రా ఆదేశం మేరకు ఆయన కొడుకు నలుగురు రైతులను, ఒక జర్నలిస్ట్ను కారుతో ఢీ కొట్టి తొక్కి చంపుతాడు. అయినా ఆ విషయం మీద మీరు మాట్లాడరు! యూపీలో ఓ యువతిపై లైంగికదాడి చేసి చంపేస్తారు. కనీసం శవాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా పోలీస్లే కాల్చేస్తారు! ఆ వార్త కవర్ చేయడానికి వెళ్తున్న జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్ను అన్యాయంగా అరెస్ట్ చేసి సంవత్సరాల తరబడి జైలులో పెడతారు! ఉన్నావ్ లైంగికదాడి సంఘటన మీద కూడా ఏం మాట్లాడరు! నల్ల చట్టాల రద్దు కోసం ఆందోళన సందర్బంగా రైతులు ఊపిరి వదులుతా ఉంటే, వారేమైనా నా కోసం చస్తున్నారా? అని నిర్దయగా మాట్లాడుతారు.
కుస్తీ బిడ్డల న్యాయమైన డిమాండ్ల ఆందోళనను పట్టించుకోండి మోదీజీ! ఓట్ల కోసం, అధికారం కోసం క్రిమినల్ బ్రిజ్ భూషణ్ను కాపాడడం మంచిది కాదు! భారతదేశంలోని ఆడబిడ్డలు లైంగిక వేధింపుల విషయంలో అబద్ధం చెప్పరు మోదీజీ! మన దేశంలో స్త్రీని దేవతగా పూజిస్తారు! మన దేవతలను అవమానించడం మంచిది కాదు! బ్రిజ్ భూషణ్ను అరెస్ట్ చేయండి! బేటీయోంకే సాత్ పూరా భారత్ హై! బేటీయా జిందాబాద్! (బిడ్డల వెంట మొత్తం భారతదేశం ఉంది! బిడ్డలూ జిందాబాద్) బేటీయోంకే ఆగే గలత్ కర్నె వాలేకో.. జుఖ్నహి పడిగే! (తప్పు చేసే వాడికి ఆ బిడ్డల ముందు తల దించుకోక తప్పదు). ఇది అక్షర సత్యం! దేర్ హై అందేర్ నహీ! బ్రిజ్ భూషణ్ తప్పించుకోలేడు!
చట్టం నుంచి ఎంతటి వారైనా తప్పించుకోలేరు. నేడు ప్రభుత్వం అండతో అరాచకాలకు పాల్పడుతున్న వారంతా రేపటి రోజున జైలుకు వెళ్లి, ఊచలు లెక్కపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు)
-ఎండీ మునీర్
9951865223