రెండు దశాబ్దాలకుపైగా మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభల్లో పెండింగ్లో ఉన్నది. 1996లో మొదటిసారి పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు నేటికీ మోక్షం లభించలేదు. 2010లో ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. అయితే దిగువ సభలో ఆమోదం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. లోక్సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్న బీజేపీ తన బలాన్ని ఆర్టికల్-370 రద్దు వంటి సంక్లిష్ట చట్టాలకే వినియోగిస్తున్నది. మరోవైపు ఉమ్మడి పౌరస్మృతి అమలు వంటి అంశాలపై చొరవ చూపుతున్నది. ఇందులో సగమైనా మహిళా రిజర్వేషన్ బిల్లుపై చూపి ఉంటే మహిళా బిల్లు ఇప్పటికే చట్టరూపం దాల్చేది!
బీజేపీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి గొప్పగా ప్రస్తావించింది. అయితే ఈ బిల్లుకు మద్దతు కోసం ఏ ఒక్క రాజకీయ పార్టీని సంప్రదించిన దాఖలాలు లేవు. ఇదీ ఆ పార్టీకి మహి ళా సాధికారత పట్ల ఉన్న చిత్తశుద్ధి. దేశ జనాభా లో సగభాగం ఉన్న మహిళల పట్ల అధికార బీజే పీ చూపుతున్న ఈ ఉదాసీన వైఖరిపై ఆ పార్టీ నాయకులు సంజాయిషీ ఇవ్వాలి. అవకాశం ఉన్నా మహిళా బిల్లును చట్టం కాకుండా తొక్కిపెడుతుండటంలోని మతలబు ఏమిటో ప్రజలు గ్రహించాలి.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా తీర్మానం చేసి పంపారు. బీఆర్ఎస్, బీజేడీ లాంటి ఎన్నో పార్టీలు మద్దతు ప్రకటించాయి. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత వివిధ పార్టీల నాయకులతో కలసి ఢిల్లీలో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. అయినప్పటికీ కేంద్రంలోని అధికార బీజేపీలో ఏ మాత్రం చలనం లేదు.
సమాజ పురోగమనంలో మహిళలు ప్రధానపాత్ర పోషిస్తున్నారు. అలాగే రాజకీయ ప్రాధాన్యం కూడా ఉంటే, చట్టాలు చేసే సమయంలో మహిళల శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మహిళల రాజకీయ భాగస్వామ్యం పెరిగితే వారు ఎదుర్కొంటున్న వేధింపులు, వివక్ష, అసమానతల వంటివి తొలగించుకునేందుకు అవసరమైన చట్టాలు చేసుకునే వీలు కలుగుతుంది. స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం వల్ల మహిళల ప్రాతిని ధ్యం పెరిగి సమాజంలో గణనీయమైన మార్పు లు వచ్చాయి. అలాగే చట్టసభల్లో కూడా మహిళలకు రిజర్వేషన్ అమలుచేస్తే సమాజంలో, రాజకీయాల్లోనూ మంచి మార్పులొస్తాయి.
రోజురోజుకు చట్టసభల్లో క్రిమినల్ చరిత్ర ఉన్న నాయకులు ఎక్కువవుతున్నారు. ఒకవేళ మహిళా రిజర్వేషన్ గనుక అమలైతే, చట్టసభల్లో క్రిమినల్ చరిత్ర గల సభ్యుల సంఖ్య తగ్గుతుంది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాజకీయ విలువలకు ఇది మంచి పరిణామం
అవుతుంది.
మణిపూర్లో మహిళలపై జరిగిన అమానుషంపై పార్లమెంట్లో చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలకు చాలా తక్కువ సమయమే ఉం టుంది. కనుక ఎంతో ప్రాధాన్యం ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదించి చట్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఒక మహిళ రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనైనా చరిత్రాత్మకమైన ఈ మహిళా బిల్లును ఆమోదించి ఈ దేశ మహిళలకు కానుకగా ఇవ్వాలి.
(వ్యాసకర్త: రాష్ట్ర సరోగసి బోర్డు సభ్యురాలు)
డాక్టర్ హరి రమాదేవి
90322 33390