భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ గారికి…
Human Rights | ప్రజాస్వామ్య నైతికత, పౌర, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం పోరాడే భావాలు కలిగిన పౌరహక్కుల కార్యకర్తలుగా మేము ఈ లేఖను రాస్తున్నాం. ఈ లేఖ ద్వారా మీకు ఓ విజ్ఞప్తి చేయదలచుకున్నాం. మన దేశంలో ప్రశ్నార్థకంగా మారిన ప్రజల వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి ఈ లేఖలో ప్రస్తావిస్తున్నాం. రాజ్యాంగం ద్వారా రక్షణ పొందిన ఈ హక్కుల క్షీణతను మనం చూస్తునే ఉన్నాం.
మన దేశంలో కొంతకాలంగా వింత ధోరణి కనిపిస్తున్నది. ప్రజల వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛలకు సంబంధించిన ర్యాలీలు, శాంతియుత నిరసనలు, సమావేశాల అనుమతి నిరాకరణ ట్రెండ్ దేశంలో నడుస్తున్నది. గతేడాది డిసెంబర్ 10న ఇటువంటి తాజా ఘటన జరిగింది. ఆ రోజు ప్రపంచమంతా ఐరాస 75వ ‘మానవ హక్కుల దినోత్సవం’ జరుపుకొన్నది. కానీ, మన దేశ రాజధాని ఢిల్లీ పోలీసులు ఈ కార్యక్రమ నిర్వహణకు అనుమతిని నిరాకరించారు. కొన్నిరోజుల ముందుగానే అనుమతి తీసుకున్నప్పటికీ, క్యాంపెయిన్ ఎగెనెస్ట్ స్టేట్ రిప్రెషన్ (సీఏఎస్ఆర్) తదితర 40 సంస్థలకు డిసెంబర్ 9న రాత్రి 9.15 గంటలకు సంబంధిత సమాచారం ఇచ్చారు. గతేడాది మార్చి 15న కశ్మీర్లో జరగాల్సిన ‘కశ్మీర్లో మీడియాపై అణచివేత’ కార్యక్రమం విషయంలోనూ ఇలాగే జరిగింది. కార్యక్రమానికి 2 గంటల ముందు నోటీసులిచ్చి.. సదస్సు జరగాల్సిన గాంధీ పీస్ ఫౌండేషన్ వేదికను బారికేడ్లతో దిగ్బంధించారు. జమ్మూకశ్మీర్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ హుస్సేన్ మసూదీ సహా అనేకమంది మాజీ ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, మానవ హక్కుల కార్యకర్తలు ఈ సదస్సులో ప్రసంగించాల్సి ఉన్నది. మార్చిలో ఢిల్లీలోని హెచ్కేఎస్ సుర్జీత్ భవన్లో నిర్వహించతలపెట్టిన ‘భారత్ బచావో జాతీయ సదస్సు’కు ఇదే సమస్య ఎదురైంది. శాంతిభద్రతలు సాకుగా చూపి ఇలా అనేక సమావేశాలకు పోలీసులు అనుమతులు నిరాకరిస్తున్నారు.
‘స్వేచ్ఛను త్యజించటం అంటే మనిషిగా ఉండటాన్ని త్యజించటం, మానవత్వపు విధులు, హక్కులను అప్పగించటం’ అని ఫ్రెంచ్ తత్వవేత్త, ప్రజాస్వామ్యవాది జీన్ జాక్వెస్ రూసో చెప్పారు. ‘శాంతియుతంగా నిరసనలు తెలపడం ప్రజల ప్రాథమిక హక్కు. దాన్ని ఏకపక్ష కార్య నిర్వాహకులు లేదా శాసన చర్యల ద్వారా ప్రజల నుంచి దూరం చేయలేరు’ అని గతంలో ఓ కేసు విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా చెప్పింది. కానీ, పౌరహక్కుల అణచివేతపై నిరసన తెలిపేందుకు పూనుకున్న సీఏఎస్ఆర్, అనుబంధ సంస్థల కార్యకర్తలు, నిరసనకారులపై సాయుధ దళాలు, పోలీసులు దాడులకు పాల్పడ్డారు. కాల్పులు జరుపుతామని మహిళలు, ఎల్జీబీటీ కార్యకర్తలను రాష్ట్రపతి భవన్ ఎదుటే బెదిరించారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ జర్నలిజం విద్యార్థిని పోలీసులు కిరాతకంగా చితకబాదారు. ప్రైవేటు వేదికల్లో శాంతియుత నిరసన, సమావేశాలు నిర్వహించాలనుకుంటే.. బారికేడ్లు ఏర్పాటుచేసి ఆ వేదికల యజమానులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. జంతర్ మంతర్ తరహా ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటే.. ఏమీ చేయలేని విధంగా చివరి నిమిషంలో అనుమతులు రద్దు చేస్తున్నారు. నిరసనల్లో పాల్గొంటున్న కార్యకర్తల కుటుంబసభ్యులకు ఫోన్లు చేసి మరోసారి నిరసనల్లో భాగం కాకుండా చూడాలని హెచ్చరిస్తున్నారు.
మాతో పాటు దేశంలోని పలు వర్గాలను ప్రభావితం చేస్తున్న అనేక అంశాలివీ. తమ సమస్యలు, ఆందోళనలు, అసమ్మతులను లేవనెత్తడానికి ప్రజలను అనుమతించకపోతే.. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఎలా అవుతుంది? ఒక సమావేశంలో రిటైర్డ్ హైకోర్టు జడ్జికి మాట్లాడే అవకాశం లేకపోతే, మాజీ ప్రజాప్రతినిధులకు ప్రసంగించే హక్కు లేకపోతే, దేశంలోని సామాన్యులైన పేద ప్రజలకు వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ ఎలా ఉన్నట్టు? మన దేశంలో ఆందోళనకరంగా పరిణమిస్తున్న ప్రస్తుత పరిస్థితులను ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకురాదలచుకున్నాం. కాబట్టి దీన్ని సుమోటోగా స్వీకరించి ప్రజా హక్కులను పరిరక్షించాలని వేడుకుంటున్నాం. ఈ లేఖ పట్ల సానుకూలంగా స్పందించి.. శాంతిభద్రతల పేరిట హక్కుల అణచివేతకు పాల్పడుతున్న పోలీసులు, పరిపాలనా యంత్రాంగాలను ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తుందని ఆశిస్తున్నాం.
– సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్కు 135 మంది పౌరహక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలు,మేధావులు రాసిన బహిరంగ లేఖ సారాంశం