ఏప్రిల్ 2న పిల్లల అద్భుత ప్రపంచమైన ‘ఫెయిరీ టేల్స్’ సృష్టికర్త, డానిష్ రచయిత హన్స్ క్రిస్టియన్ అండర్సన్ పుట్టిన రోజు. ఆ రోజునే 1965 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ ‘అంతర్జాతీయ పిల్లల పుస్తకాల పండుగ’ను జరుపుకొంటున్నాం. నిజానికి ‘ప్రపంచ పుస్తక దినోత్సవం’తో పాటు రేపటి ప్రపంచానికి వారసులైన పిల్లల పుస్తకాల కోసం కూడా ఒక పండుగను జరపడాన్ని మించిన ‘పండుగ’ లేదు.
పుస్తక సంస్కృతి విశ్వవ్యాప్తమై వర్ధ్దిల్లాలని, పుస్తకం పిల్లలకు అందాలని ప్రతి యేటా ఈ పండుగను జరుపుతారు. ఈ
సందర్భంగా పిల్లలు తమకు తాము రూపొందించిన గోడ పత్రికలను, ఆ ఏడాదికి ఖరారు చేసిన సందేశంతో ప్రపంచ
వ్యాప్తంగా ప్రచారం చేసి పుస్తకం పిల్లల నేస్తమయ్యేలా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
బాలల సర్వతోముఖాభివృద్ధికి ఎటువంటి బౌద్ధిక ప్రపంచానికి వాళ్ళను తీసుకెళుతున్నాం అనే విషయాన్ని ఆలోచించుకున్నప్పుడు ఈ అంతర్జాతీయ పిల్లల పుస్తక దినోత్సవం, దాని విశిష్ట త తెలుస్తుంది. మనం ఎంతగా అభివృద్ధి చెందినా, కలం, కాగితం లేకుండా కార్యాలయాల్లో పనులు చే స్తున్నా, పుస్తకాలు లేని లోకాన్ని, సమాజాన్ని ఊహించలేం. మనిషిని మహోన్నతునిగా మార్చగలిగే మహిమ ఉన్న ఏకైక మంత్రదండం పుస్తకం ఒక్కటే.
ఏ దేశంలోనైతే సమృద్ధిగా బాల సాహిత్యం వర్ధిల్లదో ఆ దేశ ఉజ్జ్వల భవిష్యత్తును కలగనటం వ్యర్థమే. పిల్లలు లేని ప్రపంచాన్ని మనం ఊహించలేనట్లే, పిల్లలకు పుస్తకాలు అందని లోకాన్ని కూడా ఊహించలేం. పిల్లలకు బాల్యం నుంచే మంచి సాహిత్యాన్ని అందిస్తే ఆ బాల్యం భవిష్యత్తులో చక్కని దేశాన్ని, భవిష్యత్తును నిర్మిస్తుంది. బాల సాహిత్య వికాసం, ప్రచారాల్లో తొలి పాత్ర పత్రికలదైతే తరువాత స్థానం సాహిత్య సాంస్కృతిక సంస్థలు, బాలల వికాస కేంద్రాలది.
బడి, గుడి, చర్చి, మసీదు ఏదైనా కావచ్చు అక్కడికి వచ్చే బాల బాలికల కోసం సాహిత్యాన్ని అందుబాటులో ఉంచితే అది ఉత్తమ సమాజ నిర్మాణానికి దోహదపడుతుంది. పిల్లలకు సమృద్ధిగా పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించేందుకు డాక్టర్లను సంప్రదిస్తాం. అదేవిధంగా పుస్తకాలను అందించాల్సిన బాధ్యత తల్లితండ్రులుగా, సామాజికులుగా మనపైనా ఉన్నది. అప్పుడే శారీరకంగానే కాక మానసికంగా పిల్లల ఎదుగుదల సాధ్యం.
బాల సాహితీ వికాసం, విస్తారం, ప్రచారాల విషయంలో తెలంగాణ పరుగులు పెడుతున్నది. నేటి బాలలే రేపటి పౌరులు. వాళ్ళకు సరైన దిశానిర్దేశం కోసం సంస్కారంతో పాటు సాహి త్యం దోహదపడుతుంది. పిల్లల కోసం తొలినాళ్ళ నుంచి పెద్దవాళ్ళమే సాహిత్య సృజన చేసి అందిస్తూ వస్తున్నాం. ఇటీవల చూసినట్లయితే అన్ని అస్తిత్వ ఉద్యమాలలాగే బాల బాలికలు కూడా తమకు కావాల్సింది తామే రాసుకుంటున్నారు. తమకు నచ్చిన దానిని తామే సృష్టించుకుంటున్నారు. ఇవ్వాళ్ళ ఇది రెండు తెలుగు రాష్ర్టాల్లో జరుగుతున్న గొప్ప విప్లవాత్మకమైన పరిణామం. ప్రభుత్వ పాఠశాలల పిల్లలు రచయితలుగా, కవులుగా పరిచయం కావడమే కాక పుస్తకాల రూపంలో అచ్చవుతున్నారు. అయితే ఇందులో తెలంగాణ బడి పిల్లలు ఇతరుల కంటె మరో నాలుగు అడుగులు ముందే ఉన్నారు.
బాల వికాస కార్యకర్త గరిపెల్లి అశోక్ రికార్డు చేసిన దాని ప్రకారం ఇప్పటిదాకా తెలుగు పిల్లల పుస్తకాలు నాలుగు వందల వర కు వస్తే అందులో అగ్రస్థానం తెలంగాణ బడి పిల్లలదే. దాదాపు మూడు వందల అరవై దాకా తెలంగాణ నుంచే వచ్చాయి. ముస్తాబాద్కు చెందిన భాను ప్రసాద్ రాసిన కథ మహారాష్ట్ర తెలుగు పాఠ్యపుస్తకంలో కొలువుదీరింది. పాఠశాలలే కాక వివిధ సంస్థ లు, వ్యక్తులు పిల్లల పుస్తకాలను తెస్తున్నారు. వారిలో జహీరాబాద్ నుంచి డా.విజయలక్ష్మి, హైదరాబాద్కు చెందిన మాడభూషి లలితాదేవి, బాలల కథలను ‘తెలంగాణ బడి పిల్లల కథలు’ పేర తెచ్చిన మణికొండ వేదకుమార్ ఉన్నారు. గోదావరిఖనికి చెందిన వసుంధర విజ్ఞాన వికాస మండలి గత కొన్ని సంవత్సరాలుగా బడి పిల్లలకు కవితల పోటీలు నిర్వహిస్తున్నది. బాలసాహిత్య వికాసానికి వీరు చేస్తున్న సేవలు ప్రశంసనీయం.
వీటికి తోడు రాష్ట్రం ఏర్పడ్డాక నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా, సాహిత్య అకాడమీల వంటి జాతీయ సంస్థలు తెలంగాణలో నాలుగు కార్యశాలలు నిర్వహించాయి. రంగినేని ట్రస్ట్, చింతోజు బ్రహ్మయ్య ట్రస్టు వంటి స్వచ్ఛంద సంస్థలు వీటిల్లో భాగస్వామ్యమయ్యాయి. 2016 మార్చిలో నిజామాబాద్, నేటి రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కార్యశాలలు జరిగాయి. సిరిసిల్లలో రంగినేని ఛారిటబుల్ ట్రస్ట్, కేంద్ర సాహిత్య అకాడమి అతి పెద్ద ‘సృజనాత్మక రచన కార్యశాల’ను నిర్వహించాయి. మార్చి 2017లో రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతికశాఖ సహకారంతో నేషనల్ బుక్ ట్రస్ట్ జంటనగరాల కళాశాల, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ‘పుస్తక సమీక్ష కార్యశాల’ను జరిపింది. 2016లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ – రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ డిగ్రీ కళాశాల విద్యార్థులకు కార్యశాల నిర్వహించి, ఆ రచనలను ప్రకటించింది. గతంలో రెండు రాష్ర్టాల్లోని అన్ని జిల్లాల నుంచి ఎస్.ఈ.ఆర్.టీ విద్యార్థుల రచనల సంకలనాలు తెచ్చింది.
తెలంగాణమంతా ఇవ్వాళ బాలల రచనా విప్లవం ఉద్ధృతంగా సాగుతోంది. దీనికి తోడు జూలూరు గౌరీశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమి ‘మన ఊరు-మన చెట్టు’ పేరుతో నిర్వహించిన రచనా యజ్ఞంలో అయిదు లక్షల మంది పిల్లలు పాల్గొనడం శుభ పరిణామం. బాలల కోసం సృష్టిస్తున్న సాహిత్యం ‘క్షమతా పూర్ణంగా, స్వభావ పూర్ణంగా ఉండాలి. బాలల ఆకాంక్షలకు అనుగుణంగా, సమస్యలకు సమాధానంగా ఉండాలి’ అప్పుడే ఆ సాహిత్యం వాళ్ళకు నచ్చుతుంది.
యూరోపియన్ దేశాల్లోని పాఠశాలల్లో తప్పని సరిగా పిల్లల చేత గ్రంథాలయాలను వినియోగింప జేస్తున్నట్టు మనం మన వీధుల్లో, ధార్మిక కేంద్రాల్లో, పాఠశాలల్లో బాలల గ్రంథాలయాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే కొత్త తరం సమున్నతంగా ఎదుగుతుంది. పండుగలకు కొత్తబట్టలు, పుట్టిన రోజులకు బొమ్మ లు ఇచ్చినట్టే పిల్లలకు ప్రతి సందర్భం లో పుస్తకాలను అందించినప్పుడు పుస్తక దినోత్సవాలు ఫలవంతమవుతాయి. పుస్తకం మన చిరునామాగా ఎలా నిలుస్తుందో అలాగే బాలల సాహిత్యం రేపటి దస్తావేజు కూడా!
-డా.పత్తిపాక మోహన్
99662 29548