పుట్టినగడ్డ మీద బతుకు దుర్భరమై, బతకడానికే బలైన పాలమూరు లేబరుకు… అత్యాచారాలు, హత్యాచారాలకు బలైన పాలమూరు తల్లులకు… అసహజ మరణాల కొలిమైన పాలమూరులో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, నేత కార్మికులు, పేదలకు… పీడనకు, వ్యధాభరిత జీవనానికి సాక్ష్యంగా నిస్సహాయంగా ఆకలిచావుల పాలైన వారికి… పుట్టిన గడ్డకు, కన్నబిడ్డలకు కాకుండా కనిపించకుండా పోయినవారికి…ఈ లోకం ప్రజలదే, ప్రజలకే చెందాలని ఆశలు పల్లవించే పోరాటంలో అమరులైన వారికి…వినమ్రంగా…అంకితం. – 2004 జూలైలో వెలువడిన పాలమూరు కరువు గోస పుస్తకంలో సంపాదకవర్గం నివాళి ఇది.
2003 మార్చి 2న మహబూబ్నగర్ పట్టణంలోని టౌన్హాలులో పాలమూరు కరువుపై జిల్లాకు చెందిన కరువు వ్యతిరేక పోరాట కమిటీ ఒక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 160 మంది కవులు, రచయితలు, చిత్రకారులు, కళాకారులు హాజరయ్యారు. కరువుపై నాటి సభలో వారు పాటలు, కవితలు గానం చేశారు. కళారూపాలు ప్రదర్శించారు. సభ జరిగిన సంవత్సరం తర్వాత వాటన్నింటికి పుస్తక రూపమిస్తూ, కరువు వ్యతిరేక పోరాట కమిటీ, మహబూబ్నగర్ జిల్లా వారు 2004 జూలైలో ‘పాలమూరు గోస’ పేరిట పుస్తకాన్ని తీసుకువచ్చారు.
పాలమూరు వలసలు సమైక్య రాష్ట్రంలో ప్రపంచంలోని కవులను, కళాకారులను కదిలించగలిగాయేమో గానీ పాషాణ హృదయాలు గల సమైక్య పాలకులను, ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను కదిలించలేకపోయాయి. వెన్నెముక లేని నాయకత్వాలు, ప్రజలపట్ల బాధ్యతలేని నాయకుల నిర్లక్ష్యం ఫలితంగానే కాలక్రమంలో తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర కాంక్ష రణన్నినాదం అయ్యింది. ప్రజల ఆర్తి, ఆవేదన, బాధ, దుఖం అంతా చెవిటివాని ముందు శంఖం ఊదినట్టే అయింది. ఒకటా? రెండా? ఆరు దశాబ్దాల అన్యాయానికి తెలంగాణ రెండుతరాలు శాశ్వతంగా నష్టపోయాయి. ఆకలిచావులు, ఆత్మహత్యలు, కరెంటు చావులు, వలసలు ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు పాలకులు ఇచ్చిన వరాలు. ఆరు దశాబ్దాల పాలనలో ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేని పాలకుల కాఠిన్యానికి నల్లగొండ ఫ్లోరోసిస్ మూలంగా బొక్కలొంగిన తరం ఇంకా కండ్లముందు కదలాడుతూనే ఉన్నది. ఒక్క పాలమూరు జిల్లా నుంచే 14 లక్షల మంది ఉపాధి లేక బతుకుదెరువు కోసం వలసలు పోయారంటే అప్పటి దుస్థితిని అర్థం చేసుకోవచ్చు.
తమ రెక్కలు డొక్కలు క్రుంగిపోవగా దేబెలుగాక యుండి, తమ దేశముకై తనువొంచు పాలమూరు లేబరు మించు వారలిల లేరు” అని ప్రముఖ కవి గంగాపురం హనుమశ్చర్మ ఆవేదన వ్యక్తం చేస్తే, మేం మనుషులం.. మీరంతా మరిచిపోయిన మనుషులం.. మేం పాలమూరు కూలీలం.. మేం మీలా.. ఏసీ గదులు కోరడం లేదు.. నిలువనీడ కోరుతున్నాం.. మేం మీలా.. నోట్ల కట్టలు కోరడం లేదు.. నోటి ముద్ద కోరుతున్నాం” అంటూ ప్రముఖ రచయిత భారతి ఆక్రందన వెలిబుచ్చారు.
2000 సంవత్సరంలో 400 మంది పాలమూరు జిల్లా స్వాతంత్య్ర సమరయోధులు జిల్లా కేంద్రంలో నోటికి నల్లబట్టలు కట్టుకొని పాలమూరు ప్రాజెక్టులు చేపట్టాలి .. లేకుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే శరణ్యం” అని నిరసన తెలిపి అప్పటి ప్రభుత్వానికి లేఖలు రాశారు. పాలమూరు కరువు, వలసలు, కరువు, వివక్ష, ఆత్మహత్యలపై 2007 డర్బన్ ఆసియా సదస్సు వంటి అంతర్జాతీయ వేదికల మీద ప్రజాకవి గోరటి వెంకన్న, ప్రముఖ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య నినదించి పాలమూరు దుస్థితిని ప్రపంచానికి చాటారు. కాలక్రమంలో కరువు వ్యతిరేక పోరాట కమిటీ మీద పాలకులు ఉక్కుపాదం మోపారు. పాలమూరు కోసం నినదిస్తున్న గొంతులను నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. పాలకుల ప్రేరేపిత ముఠాలు హక్కుల నేతలు కనకాచారి, పురుషోత్తం వంటి వారిని బహిరంగంగా హత్యచేశాయి. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల హయాంలో తెలంగాణలో జరిగిన అణచివేత ఒక రక్తచరిత్ర.
కలాలు ఝళిపించినా, గళాలు నినదించినా, ప్రజలు ఉద్యమించినా పాలకులు ఉక్కుపాదం మోపారు తప్పితే పాలమూరు కన్నీళ్లు తుడిచేందుకు ముందుకురాలేదు. తలపెట్టిన ప్రాజెక్టులు, ప్రతిపాదించిన ఎత్తిపోతలు అన్నీ ఎన్నికల హామీలే తప్ప ఎక్కడా కూడా అణువంత చిత్తశుద్ధి, బాధ్యత కనిపించదు. 2001లో తెలంగాణ కోసం గులాబీ జెండా అందుకుని అప్పటి ఉద్యమనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్డీఎస్ కోసం పాదయాత్ర చేసిన తర్వాత పాలకులలో పాలమూరు ప్రాజెక్టుల పట్ల కదలిక మొదలైంది.
దశాబ్దాల పాటు కొనసాగిన జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వకోసం కర్ణాటకకు అందించాల్సిన పరిహారం ఇవ్వకుండా వివక్ష చూపారు. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర నినాదం ఎత్తుకోవడంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత పరిహారం చెల్లించారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటుకు ముందు కిరణ్కుమార్రెడ్డి హయాంలో మిగిలిన మొత్తం చెల్లించారు. అది కూడా తెలంగాణ ఉద్యమం నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తప్పితే ప్రేమ, బాధ్యతతో మాత్రం కాదు. 1981 జనవరి 5న జూరాల ప్రాజెక్టుకు అప్పటి సీఎం అంజయ్య శంకుస్థాపన చేస్తే దానిని 1996 ఆగస్టు 5న చంద్రబాబు ప్రారంభించారు. కానీ తెలంగాణ ఏర్పడేంత వరకు ఎప్పుడూ దాని కింద ప్రతిపాదించిన లక్ష ఎకరాలకు సాగునీరు అందిన దాఖలాలు లేవు.
1930లలో నిజాం రాష్ట్రంలో అప్పటి గుల్బర్గ్గా జిల్లా యాద్గిర్ తాలూకా తంగిడి వద్ద భీమా నదిపై రిజర్వాయర్ నిర్మించాలని భావించారు. ఆ వెంటనే భాషాప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటు, హైదరాబాద్ రాష్ట్రంలో గల తంగిడి ప్రాంతం కర్ణాటకలో కలవడంతో ఆ ప్రాజెక్టు అటకెక్కింది. అయినప్పటికీ కృష్ణా జలాల పంపిణీ కోసం కేంద్రం ఏర్పాటు చేసిన బచావత్ ట్రిబ్యునల్ ముందు భీమా రిజర్వాయర్ నిర్మాణం చేయాలని వాదించారు. కానీ పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణవాదాన్ని తెరమరుగు చేసే ప్రయత్నంలో భాగంగా జలయజ్ఞం పేరిట జరిగిన ప్రహసనంలో 2004లో దీనిని వైఎస్ చేపట్టారు. ఈ కోవకు చెందినదే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం. 1984లో మొదలుపెట్టిన ఈ పథకం సర్వే పనులు చేపట్టడానికి 1991 వరకు కాలయాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ నేపథ్యంలో 2004 ఫిబ్రవరి 18న సాధారణ శాసనసభ ఎన్నికలకు ముందు పనులు మొదలు పెట్టారు. తిరిగి వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా మళ్లీ పనులు మొదలుపెట్టారు. ఇక మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కథ ఎంత చెప్పినా ఒడువనిది. 1984లో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు సర్వే పనులు మొదలుపెట్టడానికి 1991 వరకు సాగదీశారు. 1999 ఎన్నికల ముందు జూలై 5న ప్రాజెక్టు పనులకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
తిరిగి 2004 ఎన్నికలకు ముందు 2003లో మొక్కుబడిగా పనులు మొదలుపెట్టి వదిలేశారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి 2004 ఎన్నికలలో అధికారంలోకి రావడంకోసం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు శంకుస్థాపన చేసిన పథకాల వద్ద చెట్లు నాటి నమ్మకం చూరగొనే ప్రయత్నం చేశారు. 2004లో వైఎస్ అధికారం దక్కించుకుని మొక్కుబడిగా పాలమూరు ప్రాజెక్టులను ప్రారంభించి పాలమూరును నష్టపరిచి రాయలసీమకు అక్రమంగా నీటిని తరలించే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 55 వేల క్యూసెక్కులకు పెంచుతూ మూడు షిఫ్టులలో యుద్ధప్రాతిపదికన పనులు చేయించారు. రాయలసీమలో అక్రమంగా అనేక రిజర్వాయర్లు నిర్మించారు. కానీ పాలమూరు ప్రాజెక్టులను ఎప్పటి మాదిరిగానే సాగదీశారు. కాల్వలు తవ్వి ప్రధాన పనులు గాలికి వదిలేశారు. వైఎస్ అనంతరం తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు కిరణ్కుమార్రెడ్డి హయాంలో ఎటువంటి నీటిలభ్యతలేని కేవలం ఆరున్నర టీఎంసీల సామర్థ్యంగల జూరాల బ్యాక్వాటర్ నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలన్న జీవోను విడుదల చేసి మరో పచ్చిమోసానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం కాంగ్రెస్ నాయకులు చేశారు.
జీవో విడుదల చేయడం తప్ప కనీసం సర్వే కూడా ముందుకు సాగనీయని కాంగ్రెస్ నేతలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జీవో మేమే ఇచ్చాం అని చెప్పుకోవడం గమనార్హం. మొత్తం 60 ఏండ్ల పాలనలో 35 లక్షల ఎకరాల సాగుభూమి ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాకు జూరాల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఆర్డీఎస్, సుంకేశుల ద్వారా సాగుజలాలు అందింది కేవలం రెండు లక్షల ఎకరాలకు మాత్రమే. తెలంగాణ ఏర్పడే నాటికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద సాగు నీరు అందింది కేవలం 13 వేల ఎకరాలకు మాత్రమే.
తెలంగాణ ఏర్పడిన వెంటనే పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల మీద దృష్టిసారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధప్రాతిపదికన నిధులు కేటాయించి కల్వకుర్తి ఎత్తిపోతల, భీమా, నెట్టెంపాడు పనులను పూర్తి చేయించారు. జూరాల కింద ప్రతిపాదించిన మొత్తానికి సాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో గరిష్ఠంగా 2 లక్షల ఎకరాలకు పరిమితమైన సాగునీరు, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది.
దీంతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన మాట ప్రకారం పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకమే శరణ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చొరవ తీసుకుని ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకానికి 2015 జూన్ 11న శ్రీకారం చుట్టారు. ఇంటిదొంగలు, బయటిదొంగల కుట్రలు, కేసులను ఛేదించుకుని పూర్తవుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తుదిదశకు చేరుకున్నది. ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా నార్లాపూర్ పంప్హౌజ్లో వెట్న్ జరుగనున్నది. సమైక్య పాలకుల పాపాలకు బీడువడ్డ పాలమూరు పొలాలు, పాలమూరు పల్లెలు ఇప్పుడిప్పుడే పచ్చదనం పరుచుకుని పిల్లాపాపలతో కళకళలాడుతున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల రాకతో దినదిన ప్రవర్ధమానమై భవిష్యత్తులో దేశంలోనే ఒక అగ్రశ్రేణి వ్యవసాయిక ప్రాంతంగా పాలమూరు విరాజిల్లుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తన పట్టుదల, చిత్తశుద్ధితో పాలమూరు కష్టాలకు చరమగీతం పలుకుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.
-సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు