తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అక్కసు వెళ్లగక్కుతూ చంద్ర(ఆంధ్ర)జ్యోతి పత్రికలో ఆర్కే కొత్తపలుకు పేరుతో చెత్తను పోగేసి రాసిన సంపాదకీయం గురువిందగింజ సామెతను గుర్తు చేస్తున్నది. రాజకీయ నేతలు ఇష్టానుసారం ప్రత్యర్థులపై విమర్శలు చేసినా జనం పట్టించుకోరు కానీ, పత్రికా సంపాదకీయంలో చేసే విమర్శల్లో కసి ఉండకూడదు, కంటెంట్కి ప్రాధాన్యమివ్వాలనే లాజిక్ను మరచిపోయి ఆర్కే చెత్తపలుకులతో కేసీఆర్పై దుమ్మెత్తి పోశారు.
కేసీఆర్ను ఉద్దేశించి ఆర్కే వండివార్చిన సంపాదకీయంలో ప్రస్తావించిన అంశాలన్నీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి వర్తిస్తాయన్న నగ్నసత్యం రెండు రోజులుగా నారావారి జిమ్మిక్కుల్ని చూసిన వారికి అర్థమైపోయింది. ఢిల్లీ వేదికగా చంద్రబాబు నాయుడు చేస్తున్న అవకాశవాద రాజకీయాలను చూసినవారు ఊసరవెల్లి ఈ మాయగాడిని చూసి సిగ్గుపడుతుందో లేదో చెబుతారు.
మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టులతో అవగాహన కుదుర్చుకున్న బీఆర్ఎస్ పార్టీ… అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదంటూ బోడిగుండుకి మోకాలికి ముడిపెడుతూ ఆర్కే చెత్తవాదన వినిపించారు. మునుగోడు ఉపఎన్నిక అనేది కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్ధ రాజకీయాలను నిలదీసే నినాదంతో జరిగింది. బీజేపీ అభ్యర్థిగా ఉన్న రాజగోపాల్రెడ్డిని ఓడించాలంటే… బీఆర్ఎస్ అభ్యర్థిని బలపరచడమే మంచి నిర్ణయమని అప్పట్లో లెఫ్ట్ పార్టీలు భావించాయి. ఎందుకంటే బీజేపీని ఓడించగల సత్తా బీఆర్ఎస్కే ఉందని కమ్యూనిస్టులు నమ్మారు. అందుకే జాతీయస్థాయిలో కాంగ్రెస్తో కలసి పనిచేస్తున్నా మునుగోడు ఉపఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకే మద్దతివ్వాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయానికి వచ్చిన కారణం కూడా ఇదే.
ఉపఎన్నికతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో సమీకరణాలు మారుతాయి. దానికి అనుగుణంగా అభ్యర్థుల బలం, బలహీనతల్ని అంచనా వేసుకుని కేసీఆర్ జాబితాను ప్రకటించడం జరిగింది. కమ్యూనిస్టులను అవమానించారని కేసీఆర్పై విమర్శ చేసేముందు, తాను ఆరాధించే, అభిమానించే, అడుగులకు మడుగులొత్తే నారావారి నీచరాజకీయంపై కూడా తన మార్కు విశ్లేషణ చేసే దమ్ము ఆర్కేకు ఉందా?
కేవలం మునుగోడు ఉపఎన్నికలో మద్దతిచ్చిన లెఫ్ట్ పార్టీల విషయంలో కపటప్రేమను కనబరుస్తూ శాపనార్థాలు పెడుతున్న ఆర్కే… గతంలో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉంటూ 1998లో వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీయేకు అధిక సీట్లు వచ్చిన వెంటనే చెప్పా పెట్టకుండా కాడిని పడేసి బీజేపీ కూటమిలో చేరిన చంద్రబాబు అవకాశవాద రాజకీయాన్ని ఏ రకంగా సమర్థించగలరు? అప్పట్లో లెఫ్ట్ పార్టీలకు చెందిన కురువృద్ధులు ఏబీ బర్దన్, హరికిషన్సింగ్ సూర్జీత్లు చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలను ఎలా ఏకిపారేశారో జాతీయ పత్రికలను తిరగేసి చూస్తే తెలుస్తుంది. 1998లో చంద్రబాబు రాత్రికి రాత్రి ప్లేటు ఫిరాయించిన తీరును చూసినవారంతా రాజకీయాల్లో ‘యూజ్ అండ్ త్రో’ అనే పదానికి పేటెంట్ హక్కు నారావారికే దక్కుతుందని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ క్రెడిట్ ఏ మాత్రం తగ్గకూడదన్న రీతిలోనే గత పాతికేండ్లుగా ప్రతి ఎన్నికల సమయంలోనూ అవకాశవాద పొత్తులు పెట్టుకుని, షర్టులను మార్చినట్టు ఎప్పటికప్పుడు పొత్తులను మార్చుతూ తన బ్రాండ్ ఇమేజిని బాబు కాపాడుకుంటున్నారు.
చెత్త పలుకులతో ఆర్కే రాసిన చాంతాడంత సంపాదకీయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తమను కేసీఆర్ మోసగించారని తన వద్ద వాపోయినట్టు ఒక కథ అల్లారు. నిజానికి తెలంగాణ ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పినా, ఆయన పార్టీలోకి వస్తే తమకు ఉనికి ఉండదన్న భయంతో సీనియర్ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీపై ఒత్తిడి తెచ్చి అడ్డుకున్న విషయం వాస్తవం కాదా? కాంగ్రెస్ చేసిన స్వయంకృతాపరాధానికి కేసీఆర్ని తప్పుబట్టడం ఆర్కే అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. కేసీఆర్ను ఈ విషయంలో తప్పుబడుతున్న రాధాకృష్ణ… గత ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగి, నరేంద్ర మోదీ తల్లిని, భార్యను సైతం రాజకీయ విమర్శలకు వాడుకున్న చంద్రబాబు ఇప్పుడు యూ-టర్న్ తీసుకోవడాన్ని దుయ్యబట్టడం లేదు. చంద్రబాబు చేస్తే పవిత్రం… ఇతరులు చేస్తే అపవిత్రం.
తెలంగాణ కాంగ్రెస్కు తన అనుంగు అనుచరుడైన రేవంత్రెడ్డిని అధ్యక్షుడిగా చేసి, మరోవైపు కేంద్రంలో బీజేపీతో అంటకాగాలనుకుంటున్న చంద్రబాబు కుటిల, సంకుచిత రాజకీయాన్ని ఆర్కే ఏ నోటితో సమర్థించగలుగుతున్నారన్న విషయం తెలంగాణ ప్రజానీకానికి అంతు చిక్కడం లేదు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఏర్పడిన ఇండియా కూటమిలో నాయకత్వ లోపం కనిపించడం పెద్ద మైనస్ పాయింట్… అంటూ చంద్రబాబు సెలవిచ్చారు. మరి 2019 ఎన్నికల సమయంలో కూడా ప్రధాని అభ్యర్థి ఎవరో ప్రకటించకుండా యూపిఏ కూటమి ఎన్నికల బరిలోకి దిగింది. ఆ రోజున ఈ కూటమికి నాయకత్వ లోపం ఉందన్న విషయం చంద్రబాబుకు కనిపించలేదా? ఈ విషయాన్ని ఆర్కే తన కొత్తపలుకు ద్వారా చంద్రబాబును నిలదీయగలుగుతారా?
చంద్రబాబు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అంశాల్లో అన్నింటి కన్నా హైలైట్గా చెప్పుకోవలసిన రెండు విషయాలున్నాయి. ఒకటి… ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కారణం చేతనే ఎన్డీయే నుంచి వైదొలిగామన్నది చంద్రబాబు వివరణ. అసలు ప్రత్యేక హోదా వద్దు… ప్యాకేజీయే ముద్దు… అని మోదీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను గుడ్డిగా సమర్థించింది ఈ స్వయంప్రకటిత మేధావి చంద్రబాబే. దాన్ని అప్పట్లో ఆర్కే తన కొత్త పలుకు ద్వారా ఆహా.. ఓహో.. అంటూ సమర్థించిన విషయం అందరికీ గుర్తుంది.
చివరికి ప్యాకేజీ అంశం బెడిసికొట్టి, కథ అడ్డం తిరగడంతో… అమ్మో! ఈ పాపం అంతా మోదీదే అని చంద్రబాబు చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. మళ్లీ యథావిధిగా తన బిగ్బాస్ చంద్రబాబు మాటలకు ఎస్ బాస్ అంటూ ఆర్కే సంపాదకీయంలో తన అడ్డగోలు వాదన వినిపించారు. తీరా ఎన్నికల్లో టీడీపీ బొక్కబోర్లా పడేసరికి ఆర్కేతో పాటు ‘హిజ్ మాస్టర్స్ వాయిస్’ నాయుడుగారి తల బొప్పికట్టింది. డామిట్ కథ అడ్డం తిరిగిందని భావించి వీరిద్దరూ రూటు మార్చారు.
ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి చదివే పాఠకులకు చంద్రబాబు తరఫున ఆర్కే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. 2019 ఎన్నికల సమయంలో మోదీ సర్కారు ప్రత్యేక హోదా ఇవ్వలేదని తెగదెంపులు చేసుకున్న చంద్రబాబు, ఇప్పుడు ఏ కారణం చూపి బీజేపీకి దగ్గరవ్వాలని ఆపసోపాలు పడుతున్నారు? ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వైఖరి మారకున్నా ఫర్వాలేదా? ఒకవేళ దేనికైనా ఓకే అని చంద్రబాబు డిసైడ్ అయితే… మరి అది పచ్చి అవకాశవాదం కాదా? అనే విషయంలో ఆర్కే క్లారిటీ ఇవ్వాలి. ఢిల్లీ ప్రెస్ మీట్లో చంద్రబాబు ప్రస్తావించిన వాటిలో రెండో హైలైట్ అంశం ఏమిటంటే… దివంగత ప్రధాని వాజ్పేయిని తనతో కలసి దావోస్కి రమ్మని ఆహ్వానిస్తే ఆయన పెద్దగా శ్రద్ధ చూపలేదని… అదే నరేంద్ర మోదీ విషయానికి వస్తే, విదేశీ పర్యటనలు చేస్తూ భారత్కు ప్రపంచదేశాల్లో గుర్తింపు తెస్తున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విన్నవారు అవాక్కయ్యారు.
ఎందుకంటే, 2019 ఎన్నికల ప్రచార సమయంలో జాతీయ చానెల్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీని ఉద్దేశించి చంద్రబాబు చేసిన ఆరోపణలు, విమర్శలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. మోదీ తనలాగా ఉన్నత చదువులు చదవలేదని, ఆయనకు విద్యార్హతలు లేవని, భార్యను దూరం పెట్టిన మోదీపై ట్రిపుల్ తలాక్ నిరోధక చట్టం కింద చర్య తీసుకోవాలని, రాజకీయ భిక్షపెట్టిన అద్వానీని మోదీ అవమానించారని నోటికొచ్చినట్టు అప్పుడు చంద్రబాబు పేలిన అవాకులు చవాకులు యూట్యూబ్లో పదిలంగానే ఉన్నాయి. నాడు అలా విమర్శించిన చంద్రబాబు సడెన్గా మాట మార్చేశారు, మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. మరి ఈ నాలుగేండ్లలో నరేంద్ర మోదీ వైఖరిలో మార్పు వచ్చేసిందని చంద్రబాబు నమ్ముతున్నారా? లేక తన విమర్శల్లో వాస్తవం లేదని అంగీకరిస్తారా? ఈ ప్రశ్నలతో ఆంధ్రజ్యోతి ఆర్కే సంపాదకీయం ద్వారా నారావారిని నిలదీస్తే బాగుంటుంది.
రాజు మెచ్చిందే రంభ అన్న చందంగా… తను అభిమానించే చంద్రబాబు ఆర్కే దృష్టిలో అపర చాణక్యుడు, అనన్య సామాన్యుడు, అపార మేధావి అయి ఉండవచ్చు.
2019లో ఎన్నికల్లో చిత్తుగా ఓడినప్పుడు, అంతకు ముందు ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, చావుతప్పి కన్నులొట్టపోయినట్టు ఆంధ్రకు పారిపోయినప్పుడు ఈ చాణక్యనీతి, మేధావి వ్యూహం ఎందుకు బెడిసికొట్టాయో ఆర్కే విశ్లేషిస్తే బాగుంటుంది.
అలా కాకుండా రెండు తెలుగు రాష్ర్టాలు చంద్రబాబు కబంధహస్తాల్లో ఉండాలి, అన్ని పార్టీలూ ఆయన ముందు సాగిలపడాలి, దీన్ని అడ్డం పెట్టుకుని జాతీయ రాజకీయాల్లో బాబుగారు అడ్డగోలు పనులు చెయ్యాలన్నది ఆంధ్రజ్యోతి ఆర్కే ఆశయం కావచ్చు. బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ఉన్నంతకాలం తెలంగాణలో వీరి పప్పులు ఉడకవని ఈ పాటికే అర్థమై ఉంటుంది. అందుకే చంద్రబాబు ఆత్మగా చెప్పుకునే రేవంత్రెడ్డిని తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చోబెట్టి, దాని ద్వారా బాబుగారి కండ్లల్లో ఆనందం చూడాలన్నది ఆర్కే తాపత్రయం. అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్పై చెత్తపలుకులతో పిల్లిశాపనార్థాలు పెట్టడం ఆనవాయితీగా మారింది. పిల్లి శాపనార్థాలకు ఉట్టి ఎలా ఊడిపడదో, కేసీఆర్పై చేసే విమర్శల వల్ల కాంగ్రెస్కి ఓట్లు కూడా రాలిపడవనే విషయాన్ని ఆర్కే ఇప్పటికైనా గుర్తిస్తే మేలు.
– డీఆర్సీ రావు
(వ్యాసకర్త: సీనియర్ పాత్రికేయులు)