పల్లె తల్లి వంటిది. పట్టణం ప్రియురాలు వంటిది. అన్నం పెట్టడం, చల్లని అంకం మీద పవళింప జేసుకోవడం గారంగా పెంచుతుంది పల్లె. ఆకర్షించడం, ఎప్పటికప్పుడు ఆవేశాలతో కదిలించి వేయడం గాఢంగా ఊపేస్తుంది పట్టణం. “నీకేం గావాలి?” అంటుంది పలె “నాకేమిస్తావు?” అంటుంది పట్టణం.అంతేగాదు, పల్లె కుటుంబంలాగ, సంసారంలాగ ఉంటుంది. పట్టణం సంతలాగ, విపణిలాగ ఉంటుంది.
గ్రామంలో కాలాలు తెలిసిపోతాయి ఎండా, వానా, వెన్నెలా, వీటితో స్పష్టంగా. పట్టణానికి రుతువులు లేవు. అందువల్ల, పట్టణంలో ఉన్న చెట్లూ, చేమలూ, లతలూ, పువ్వులూ, పక్షులూ బిక్కచచ్చి ఉంటాయి, దిగులుగా ప్రవాసంలో ఉన్నట్టు. పట్టణంలో పదిమందిలో ఒకరిగా ఉంటాం. పల్లెలో మనిషీ, చెట్టూ, చేమా, పిట్టా, జంతువూ కలిసి ఒకే ఒక కుటుంబం.
ఈ సందర్భంలో నాకొకటి వింతగా కనబడుతుంది. ఇళ్ళల్లోనూ, ఇళ్ళు కట్టడంలోనూ. పట్టణాల్లో కొత్తరకపు ఇళ్ళు లేస్తున్నాయి. ఇవి దాదాపు ఒకే రకంగా ఉంటాయి. కొన్నింటికి చుట్టూ గోడలు ఉంటాయి, లోపలికి రావడానికి వీలులేదన్నట్టు. ఎన్నిటికో గోడలు లేకపోయినా వీధి అరుగులు ఉండవు. ఇలాంటి ఇళ్ళు గ్రామాల్లోకి చొరబడుతున్నాయి ఇప్పుడు. ఈ ఇళ్ళు ధుమధుమలాడుతూ, మొహం చిట్లించుకొని, వీధివైపు వీపు తిప్పినట్లుంటాయి.
గ్రామాల్లో ఇళ్ళకు వీధి అరుగులు ఉండేవి. పెద్దవాళ్ళ ఇంటికి మరీ పెద్ద అరుగులు ఉండేవి. వీధి అరుగు ఆహ్వానం వంటిది. మొదటి ఆతిథ్యం వీధి అరుగే ఇస్తుంది. అతిథులో, అభ్యాగతులో, బాటసారులో, అందరినీ ఇలా దయచేయండి అంటుంది వీధి అరుగు. వీధి అరుగు స్వాగత వచనం వంటిది.
గ్రామంలో వీధి అరుగు గొప్ప సంస్థ. ఇంటికి తగిన అరుగు ఉండేది మునుపు. ఇప్పుడు అరుగు హరించుకుపోతూ ఉంది క్రమంగా. మా ఊళ్ళో చెప్పుకోదగ్గ అరుగులు నాలుగు ఉండేవి కరణం జగ్గరాజు మావయ్యగారిదీ, మునసబు శేషాద్రిగారిదీ, దివాణందీ అంటే వెలమ దొరగారు వెంకట్రాయణిం గారిదీ, మరీ మాదీ అంటే శాస్ర్తులు గారిదీని. ఇవే, సమయాన్ని బట్టి, చేరిన జనాన్ని బట్టి, కచేరీలయ్యేవి; క్లబ్బులయ్యేవి; సభా స్థలాలు అయ్యేవి.
– దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి (‘మా ఊళ్ళో వీధి అరుగు’ వ్యాసం నుంచి)