Free Schemes | ఎన్నికలప్పుడు నెరవేర్చనలవి కాని హామీలను రెండు కారణాలతో ఇస్తారు. ఎలాగూ గెలిచేదీ లేదు కదా ఒక మాట అంటే పోయేదేముందిలే అనేది ఒకటి, బీజేపీ గనక బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామన్నట్టు! రెండవది ఎలాగైనా గెలవాలన్న డెస్పరేషన్ ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్ద హామీలు గుప్పిస్తారు. గెలిచాక ఉంటుంది ముసళ్ల పండుగ! కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలను అమలుచేస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన విషయం కూడా ఇలాంటిదే! ఒక్క మహాలక్ష్మి పథకం కిందే మూడు హామీలున్నాయి.
నెలనెలా రూ.2500 నగదు, రూ.500కే గ్యాస్ బండ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజునుంచే ఒక ప్రణాళిక లేకుండా ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణ సదుపాయం అమలుచేసింది. ప్రభుత్వం సహజంగానే చాలా ఆర్భాటం చేసింది ఈ సందర్భంగా. ఇది ప్రజలను ప్రత్యక్షంగా తాకే విషయం. మొదట మహిళలందరికీ అని, ఆ తర్వాత తెలంగాణలో నివాసం ఉంటున్నవారికే అని ఒక కండిషన్ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో ‘కండిషన్స్ ఐప్లె’ అనలేదు. మహిళలందరికీ అని చెప్పారు!
ఈ పథకం ప్రకారం.. అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణమైతే ఏడాదికి ఆర్టీసీ మీద పడే భారం రూ.2,200 కోట్లు. మహిళలకు ఉచిత ప్రయాణం కోసం ఏడాదికి రూ2,200 కోట్ల చొప్పున ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాలి. అంటే ఐదేండ్లకు రూ.11,000 కోట్లు. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవలసిన విషయం ఏమంటే ఒక్క ఉచిత ప్రయాణానికే రూ.11,000 కోట్ల భారం ప్రభుత్వం మీద పడితే, ఈ పథకంలోని మిగిలిన రెండు అంశాల మీద ఇంకా ఎంత భారం పడుతుందనేది.
ఇక్కడ అందరూ అడిగే ప్రశ్న ఏమంటే ‘ఎవరు అడిగారు ఉచిత ప్రయాణ సౌకర్యం కావాలని?’ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా పైసా ఖర్చులేకుండా అనేది ఊహకు అందని పరిస్థితి. దీన్ని ఎంతకాలం కొనసాగిస్తారు? దీని ప్రభావం ఇతర రంగాల మీద ఏ మేరకు ఉంటుంది? ఈ అంశాలను చూడాలి హామీలిచ్చేముందు. నది లేకపోయినా వంతెన కడతామన్నట్టు ఉండకూడదు కదా హామీలు!
ఏదీ ఉచితంగా రాదనేది మనిషికి తెలిసిన సత్యం. దేనికోసమైనా కష్టపడాలి. ‘కష్టేఫలి’ అనేది ప్రతి మనిషి నేర్చుకున్న నీతి. మరి ఎటువంటి ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం అంటే ఇది ఏ విధమైన అర్థశాస్త్రం అనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఎక్కువమంది ప్రయాణం చేసేది డబ్బు సంపాయించుకునే పని మీదనే కదా! ఉద్యోగస్థులు, వ్యాపారస్థులు గట్రా సంపాయించుకునేటప్పుడు ప్రయాణం ఖర్చు భరించలేరా? ఇలా ఎన్నాళ్లు ఉచితాలు ఇవ్వటం సాధ్యం? ఏదైనా ఉచితంగా ఇవ్వటమనేది అనుచితం కాదా? మనిషి సంపాయించేది ఖర్చుపెట్టడానికే కదా! ఖర్చుపెట్టవలసిన అవసరం లేకుండానే బతుకగలిగితే ఇహ పని చెయ్యాలనే ఉద్దేశం ఎందుకు కలుగుతుంది? ప్రభుత్వానికి సొంత డబ్బు అంటూ ఏదీ ఉండదు. ప్రభుత్వం దగ్గరుండే డబ్బు అంతా ప్రజలదే కదా? అందువల్ల ప్రభుత్వం ఏదైనా ఉచితంగా ఇస్తుందనేది ఒక భ్రమ. ఏదైనా ఒకటి ఉచితం అంటే ఆ మేరకు మరొకదానిపై పన్ను భారం పెరుగుతుంది. అంటే ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకోవటమే కదా! ఈ విషయం ప్రజలకు తెలియదా? తెలియజేసేది ఎలా? ప్రజలకు, పాలకులకు మధ్య ఉన్న డిస్కనెక్ట్ ఓ అవరోధం. ప్రజల అవసరాలేమిటి, ఖజానా స్థితిగతులేమిటి అన్న ఆలోచన చెయ్యాలి.
ప్రపంచంలో ఏ సమాజమైనా కాలం గడిచేకొద్దీ ముందుకుపోవాలని, అభివృద్ధి సాధించాలని, ప్రగతిపథంలో పయనించాలని కోరుకుంటుంది. అంటే మనుషులు స్వతహాగా ఎదగాలి. వారి కాళ్లమీద వారు నిలబడాలి. సంపాదనాపరులవ్వాలి. ఇదే కదా ప్రతి మనిషి కోరుకునేది. ‘కోటి విద్యలు కూటి కొరకే’ అంటే అర్థం పొట్టనింపుకోవటానికి పనిచెయ్యాలనే కదా! అలాంటి పరిస్థితి రావటానికి ప్రభుత్వం నుంచి చేయూత కావాలని ముఖ్యంగా పేద వర్గాలు కోరుకుంటాయి. తగిన చేయూత అందితే అభివృద్ధి పథంలో నడుస్తామన్నది నమ్మకం.
ఆ విధంగానే కదా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయి. కానీ, మన దేశంలో కాలం గడిచేకొద్దీ అనేక కులాలు తమను వెనుకబడినవిగా గుర్తించమని, రిజర్వేషన్ సదుపాయం తమకు కలిపించమనీ కోరుతున్నాయి. ప్రభుత్వవర్గాలూ, మేధావులు ఈ ధోరణిని తప్పు పడుతున్నారు. మరోవైపు రాజకీయనేతల ధోరణితో ఎవరూ అడగకుండానే ఇది ఉచితం, అది ఉచితం అని హామీలు ఇచ్చి ప్రజలను బిచ్చగాళ్లుగా మారుస్తున్నది రాజకీయం. ఒకసారి ఉచితంగా ఇచ్చినదాన్ని తీసేస్తే ప్రజలు ఊరుకోరు. కానీ, ఏ ప్రభుత్వమూ ఉచితాలను ఎక్కువకాలం కొనసాగించలేదు. ఇదొకరి కడుపు కొట్టి మరొకరి కడుపు నింపటం లాంటి పనే కదా. ఈ ఉచితాల వల్ల అయ్యే ఖర్చును భర్తీ చేసుకోవటానికి వస్తువులు సేవల మీద పన్ను భారం పెరుగుతుంది.
అది మద్యం అవ్వనివ్వండి, పెట్రోల్ అవ్వనివ్వండి, మరేదైనా అవ్వనివ్వండి. కొందరికి ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కలిగించి, మరికొందరికి పన్నులరూపంలో ప్రయాణ భారాన్ని పెంచటం ఏ విధంగా సమర్థనీయం? పెంచే పన్నుల వలన వచ్చే ఆదాయం సరిపోక మార్కెట్ నుంచి కొత్త అప్పు తీసుకురావాలి. అలా చేసిన అప్పును ఉత్పాదక అంశాల మీద ఖర్చు చేస్తే, దానివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా ప్రజల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కానీ, అప్పు సొమ్మును అనుత్పాదక అంశాల కోసం వినియోగిస్తే, అదే కదా అప్పుచేసి పప్పుకూడు అంటే! అప్పు సంక్షేమం కోసమా లేక సంపదను పెంచటానికా?
ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునేది జీవన ప్రమాణాలు మెరుగుపడాలని కదా! ఇది జరగాలంటే ఏయే రంగాల్లో ప్రభుత్వ ప్రమేయం ప్రత్యక్షంగా ఉండాలనేది ఒకసారి చూద్దాం. ప్రతి మనిషీ విద్య, వైద్యం, రవాణా, విద్యుత్తు అనే అంశాల్లో ప్రభుత్వ ప్రమేయాన్ని కోరుకుంటారు. ఎందుకంటే ఈ రంగాల్లో ఉండే ప్రైవేటు సంస్థలు వారి సేవలను వ్యాపార దృక్పథంతోనే చూస్తాయి గానీ, సమాజ సేవా దృక్పథంతో చూడవు. వ్యాపారం అనేది లాభ నష్టాలు అనే ప్రాతిపదిక మీద నడుస్తుంది. అది సహజం. దాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. అయితే మన దేశంలో ప్రైవేటురంగం దౌర్భాగ్యం ఏమంటే కేవలం లాభార్జన కోణంలోనే సాగుతుంది వ్యాపార వ్యవహారం అంతా కూడానూ. సమాజానికి ఏ మేరకు మేలు చేస్తున్నామనేది ప్రధానం కాదు. లాభార్జన, వ్యాపార విస్తరణ, అక్కడ సంపాదించిన దానితో రాజకీయ ప్రాబల్యం సంపాదించుకోవటం మన ప్రైవేటురంగం తీరు.
ఈ సంస్కృతి ముఖ్యంగా విద్య, వైద్యరంగాల్లో ప్రబలంగా కనిపిస్తుంది. అందుకే ప్రైవేటు స్కూళ్లు, ప్రైవేటు ఆసుపత్రుల సేవలు ఎంతో ఖరీదులో కూడుకొని ఉంటాయి. సామాన్య మనిషికి అందుబాటులో ఉండవు ప్రైవేటు రంగంలోని విద్య, వైద్యసేవలు. ఈ రంగాల్లో ప్రభుత్వ జోక్యం సామాన్య మనిషికి ఎంతో ఉపయోగపడుతుంది. అది అభివృద్ధి, సంక్షేమం అనే రెండింటికీ వర్తిస్తుంది.
ప్రభుత్వ స్కూళ్లలో, ప్రభుత్వ దవాఖానల్లో సరైన వసతులు కల్పించాలంటే భారీగా నిధులు వెచ్చించాలి. ఎప్పుడైతే మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయో, ప్రజలకు ప్రత్యక్ష మేలు జరుగుతుంది. పిల్లల చదువులు భారం కావు. మెరుగైన వైద్యం ఉచితంగా అందుబాటులో ఉంటే, దాని ఫలితం అనుభవించేది పేద ప్రజలు. తద్వారా, పేదల చేతిలో డబ్బు మిగులుతుంది. దానితో మెరుగైన ఆహారం, ఒంటి నిండా బట్ట కొనుక్కోగలుగుతారు. అన్నిటికన్నా మించి ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగుతారు. ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదన్న నమ్మకంతో బతుకుతారు సామాన్య ప్రజలు. అదే కదా అందరూ కోరుకునేది!
ఈ రంగాల్లో ప్రభుత్వం చేసే ఖర్చు ప్రతి మనిషికీ ప్రత్యక్షంగా మేలు చెయ్యకపోవచ్చుగానీ మెరుగైన జీవన ప్రమాణాలను పెంపొందిస్తుంది. ఇక్కడ మెరుగైన సేవలు అందితే ప్రజలు దాన్ని సంక్షేమంగానే చూస్తారు. అయితే ఇది అనుకున్న వెంటనే జరిగేది కాదు. బస్సు ప్రయాణం ఉచితం అంటే అది వెంటనే అందుబాటులోకి వస్తుంది. కానీ మెరుగైన పాఠశాల, మెరుగైన వైద్యశాల అందుబాటులోకి రావటానికి సమయం పడుతుంది. ఫలాలు అందాలంటే సంయమనం కావాలి. ఇది దీర్ఘకాల ప్రయోజనం ఒనగూర్చే పని. కానీ నాయకులు త్వరితగతిన ప్రజల మెప్పు పొందాలనుకుంటారు. అందుకే డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) అంటే ప్రత్యక్ష ప్రయోజనం పొందటం, అంటే ప్రజల చేతిలో డబ్బు పెట్టటం అనే వ్యసనానికి ప్రజలను అలవాటు చేస్తున్నారు.
ఒక విధంగా ప్రజలను బిచ్చగాళ్లుగా మారుస్తున్నారు ఈ తాయిలాలనే వ్యసనంతో. మన దేశంలో దక్షిణాది రాష్ర్టాలు అభివృద్ధి చెందినవిగా చూస్తుంది దేశం. కానీ ఆశ్చర్యంగా ఉచితాలనే వ్యసనాన్ని దక్షిణాది రాష్ర్టాలే పెంచి పోషిస్తున్నాయి ఎక్కువగా. దీనికి కారణం సినిమా ప్రభావం రాజకీయాల మీద ఉండటమే. ముందు తమిళనాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్, ఆపైన కర్ణాటక, మరి నేడు తెలంగాణ. ఇది పెద్ద పులి మీద స్వారీ లాంటిది. పెద్దపులి మీద కూర్చోవటమంటే చాలా భయం. దాని మీదినుంచి దిగితే అది తినేస్తుందని మరో భయం.
ఈ సంస్కృతికి అలవాటు పడకూడదు. అలవాటు పడితే బయట పడటం చాలాకష్టం. ఇది మత్తుకు బానిసలవ్వటం లాంటిదే. దీంతో అభివృద్ధి జరగటం లేదనే హక్కును ప్రజలు కోల్పోతారు. టికెట్ లేని డొక్కు బస్సుల్లో గతుకుల రోడ్ల మీద తిరగటానికి ప్రజలు ఇష్టపడతారా, లేక మంచి బస్సు, మంచి రోడ్డు మీద టికెట్ కొని ప్రయాణం చెయ్యటానికి ఇష్టపడతారా అనేదానికి సమాధానం ఏమిటో అందరికీ తెలుసు. డీబీటీ అనే వ్యసనంతో అభివృద్ధికి సూచికలైన రవాణా, విద్యుత్తు, మౌలిక వసతుల కల్పన అనే అంశాల మీద ఖర్చు పెట్టడానికి నిధుల కొరత ఏర్పడుతుంది.
ఈ రంగాలు అభివృద్ధి చెందకపోతే పెట్టుబడులు రావు. పెట్టుబడులు రాకపోతే పరిశ్రమలు రావు, పరిశ్రమలు రాకపోతే ఉపాధి అవకాశాలు మెరుగుపడవు. ఉపాధి అవకాశాలు మెరుగైతేనే ప్రజల చేతిలోకి సంపాదన వస్తుంది. తద్వారా మెరుగైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. ఒకదానికి మరొకటి ముడిపడి ఉన్న అంశాలు ఇవన్నీ కూడా. దీన్నిబట్టి రాజకీయాన్ని, అభివృద్ధిని విడదీసి చూడవలసిన పని లేదన్న విషయాన్ని ప్రజలు, పాలకులు గుర్తించాలి. రెండింటికీ దగ్గర సంబంధం ఉన్నది. అర్థశాస్త్రం రాజకీయాన్ని నడపాలి. అర్థశాస్త్రం హేతుబద్ధమైన ప్రక్రియ. అర్థం పర్థం లేని హామీలను ఇవ్వటం రాజకీయ శాస్త్రం. ఈ రాజకీయశాస్ర్తాన్ని అర్థశాస్త్రం ఇముడ్చుకోలేదు. మనం రాజకీయ శాస్త్రం నుంచి రాజనీతి శాస్త్రం వైపు నడవాలి. రాబోయేతరాల భవిష్యత్తు గురించి ఆలోచించేదే రాజనీతి శాస్త్రం.
ఈ రోజు ప్రజలకు సంక్షేమ పథకాలు అవసరం లేదనేది కాదు ఇక్కడ వాదన. సమాజంలో ఎక్కువగా నిరాదరణకు గురయ్యేవారు వృద్ధులు, ఒంటరి మహిళలు, అంగవైకల్యం కలవారు, విద్యార్థులు. వీరు ఆర్థికంగా మరొకరి మీద ఆధారపడవలసిన పరిస్థితిని చూస్తుంటాం. ఈ వర్గాలకు ఆర్థిక చేయూతనివ్వటం అభిలషణీయం. వృద్ధులకు, వితంతువులకు, వైకల్యానికి గురైనవారికి పింఛన్ పెంచాలి. అలాగే విద్యార్థులకు సరైన చేయూతనివ్వాలి. మిగిలిన విషయాల్లో డీబీటీ అనే వ్యసనం పనికిరాదు. వ్యక్తుల చేతుల్లోకి పోయే ధనం అభివృద్ధికి సూచిక కాదు.
మెరుగైన రోడ్లు, మెరుగైన, బస్సులు, కోతల్లేని విద్యుత్తు లాంటివి అభివృద్ధికి సూచికలు. మహిళలకు గౌరవసూచకంగా మహిళా దినోత్సవం, మదర్స్ డే, స్వతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే లాంటి సందర్భాల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించవచ్చు. అంతేకానీ, విచక్షణా రహితంగా, అడుగకపోయినా ఉచితాల సంస్కృతికి అలవాటు చెయ్యటం సమంజసం కాదు. ఉచితం అంటే వద్దు అనేవారు ఉండరు. ఒకసారి అలవాటు చేశాక, తీసెయ్యటం అసాధ్యం. కానీ, ఎవరికి ఉచితం అవసరమనేది గుర్తించాలి. బాగా పుష్టిగా ఉన్నవాడికి హార్లిక్స్ అవసరమా లేక బలహీనంగా ఉన్న వారికా? ప్రభుత్వం తొందరపడినట్టు అనిపిస్తుంది చాలామందికి. ముందు ముందు ఇంకా ఎన్ని ఉచితాలు, తాయిలాలు చూస్తామో కదా! కానీ ప్రజలు ఇది కోరుకుంటున్నారా?
ఈ విషయం సమాజం గమనించాలి.ఉచితాలు మాకు అవసరం లేదని చెప్పేస్థాయికి ఎదగాలి. మత్తు మందులు వద్దు అన్నట్టే ఉచితాలూ మాకొద్దు అనే స్థాయికి ఎదగాలి.ఆరోజు ఎప్పుడొస్తుందో ఎవరు చెప్పగలరు?
గుమ్మడిదల రంగారావు