బీజేపీ కల్చర్
బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయంటే ఇదేనేమో! బీజేపీ నాయకులు కొందరు కాంగ్రెస్లో చేరేందుకు సంప్రదిస్తే ‘ఇక్కడ బీజేపీ కల్చర్ నడవదు, ముందే ఆలోచించుకొండ’ని ఒక సీనియర్ నాయకుడు హెచ్చరించినట్టు సమాచారం. ఇప్పుడిది ఇరు పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదివరకు కాంగ్రెస్ కల్చర్ అని విమర్శించేవారు. ఇప్పుడేమో బీజేపీ కల్చర్ అని విమర్శించే స్థాయికి రావడమంటే రాష్ట్ర బీజేపీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలకు అద్దం పడుతున్నది. ‘హమ్మయ్యా.. తమ పార్టీ మీద ఇంతకాలం పడిన ముద్ర పోయినట్టే’నని కాంగ్రెస్ నాయకులు ఊపిరి పీల్చుకుంటుండగా.. సంబురపడొద్దు.. బీజేపీలో కాంగ్రెస్ కల్చర్ తీసుకొచ్చిన నాయకులే గాంధీభవన్కు క్యూ కడుతున్నారు, అలాంటివాళ్లు పోవడమే బెటరని బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
ఔటాఫ్ కవరేజ్ ఏరియా
ఏక్ నిరంజన్
ఏపీ మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి బీజేపీలో చేరినప్పుడు, ఆయన వెంట ఒక్క ఓటు లేదు, ఇలాంటి ఏక్నిరంజన్ల వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువని తెలంగాణ కమలనాథులు పెదవి విరిచారు. ఒక్క ఓటు లేదనేది తప్పు, మై హూనా అంటూ మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి ముందుకువచ్చాడు. కిరణ్కుమార్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆ పార్టీలో ఎక్క డా కనిపించని, వినిపించని మాగం రంగారెడ్డి అనే అతనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆ విధేయతతో కిరణ్కుమార్రెడ్డి బీజేపీలో చేరడంతో మాగం రంగారెడ్డి చేరనున్నట్టు ప్రకటించారు. అయితే ఒక్క ఓటు ఉన్నదని బీజేపీ స్టేట్ ఆఫీస్లో జోకులేసుకుంటున్నారు.