తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు ప్రసరణ వ్యవస్థను నిర్వహిస్తున్న ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ సంస్థ రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్నది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఈ సంస్థ ప్రసరణ ఒప్పందిత సామర్థ్యం: 22,510.68 మెగావాట్లు. రాష్ట్రంలోని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నుంచి పంపిణీ సంస్థలకు విద్యుత్తును సురక్షితంగా, నిరంతరంగా సరఫరా చేస్తూ కీలక బాధ్యతను నిర్వహిస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్తు, సాగునీటి పథకాలు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా వంటి కార్యక్రమాలన్నీ ఈ సంస్థ పనితీరుపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ సంస్థ గతంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచింది. కానీ నేడు సంక్షోభంలో చిక్కుకున్నది.
ఈ సంస్థ 2024లో దేశంలోనే ఉత్తమ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ)గా అవార్డు అందుకోవడం, 2018లో స్కోచ్ కార్పొరేట్ ఎక్స్లెన్స్ అవార్డు సాధించడం సంస్థ సామర్థ్యాన్ని చాటుతున్నాయి. అలాగే 2026 మార్చి 27 న తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 18548 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ను విజయవంతంగా నిర్వహించడం కూడా ఈ సంస్థ శక్తిని తెలియజేస్తున్నది. సాంకేతిక పనితీరు పరంగా పరిశీలిస్తే 202425 ఆర్థిక సంవత్సరంలో ప్రసరణ నష్టాలు అనుమతించిన స్థాయి 2.48 శాతం ఉండగా, వాస్తవంగా అవి 2.19 శాతానికి మాత్రమే పరిమితమయ్యాయి. అలాగే ప్రసరణ వ్యవస్థ అందుబాటు శాతం రెండేండ్లలోనూ అనుమతించిన 99.9 శాతానికే సమానంగా 99.9 శాతంగా కొనసాగింది. ఈ గణాంకాలు సాంకేతికంగా సంస్థ అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తూ, రాష్ర్టానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్తు సరఫరాను అందిస్తున్నదని నిరూపిస్తున్నాయి.
విస్తరణకు సరిపడా మానవ వనరులు లేకపోతే, వ్యవస్థ నిర్వహణ, భద్రత, పనితీరు వంటి అంశాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉన్నది. ఈ పరిస్థితుల్లో మానవ వనరుల ప్రాముఖ్యతను విస్మరించడం తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తున్నది. ఉన్న సిబ్బందితోనే ఎక్కువ పనులు చేయించడం లేదా సిబ్బంది సంఖ్యను తగ్గించడం వల్ల ఉద్యోగులపై పని భారం పెరగడం, ప్రమాదాల అవకాశాలు అధికమవడం, భవిష్యత్తులో నైపుణ్య లోటు ఏర్పడే పరిస్థితులు తలెత్తవచ్చు. ముఖ్యంగా సహాయక ఇంజినీర్ స్థాయి ఉద్యోగులు సంస్థకు ప్రధాన స్తంభాలుగా ఉంటారు. ఫీల్డ్ స్థాయిలో నిర్వహణ, లోపాల నివారణ, వ్యవస్థ స్థిరత్వం వంటి పనులన్నీ వీరిపైనే ఆధారపడి ఉంటాయి. వీరి లోటు ఏర్పడితే వ్యవస్థ పనితీరు క్రమంగా క్షీణించే అవకాశం ఉన్నది.
తాత్కాలికంగా ఖర్చులను తగ్గించడం ద్వారా లాభాలను చూపించడం కన్నా, సమయానుకూలంగా అన్ని స్థాయుల్లో నియామకాలు చేపట్టడం అత్యవసరం. సహాయక ఇంజినీర్ స్థాయిలో నియామకాలు చేపట్టడం కీలకం. లేకపోతే భవిష్యత్తులో పనితీరు క్షీణత, ఆర్థిక ఒత్తిడి, సేవల నాణ్యత తగ్గుదల వంటి సమస్యలు తలెత్తి సంస్థ స్థిరత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది. ఇది క్రమంగా ప్రైవేటీకరణకు దారితీసే పరిస్థితులను సృష్టించవచ్చనే ఆందోళన వ్యక్తమవుతున్నది. విద్యుత్తు అనేది పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాల అభివృద్ధికి ప్రాథమిక ఆధారం.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వృద్ధి మొత్తం విద్యుత్తు రంగంపైనే ఆధారపడి ఉన్నది. ముఖ్యంగా పంపిణీ సంస్థలకు విద్యుత్తు నిరంతర సరఫరా కొనసాగాలంటే ప్రసరణ వ్యవస్థ బలంగా ఉండటం అత్యవసరం. ఈ నేపథ్యంలో సంస్థ స్థిరత్వం కేవలం ఒక సంస్థ ప్రయోజనం కాకుండా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అవసరమైన అంశం. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కీలక సంస్థ బలోపేతం కోసం మానవ వనరులపై దృష్టి పెట్టి, సమగ్ర నియామకాలు చేపట్టడం తక్షణ అవసరం.
– (వ్యాసకర్త: తెలంగాణ ఏఈల సంఘం అధ్యక్షుడు)
గువ్వల పవన్కుమార్