ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం అనూహ్యం, దిగ్భ్రాంతికరం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు, సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
బీఆర్ఎస్ పరాజయం పాలైనప్పటికీ 39 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పరాజయం పాలు కావడమనేది జీర్ణించుకోలేని వాస్తవం. ఇప్పటికీ ప్రజలు కేసీఆర్ పట్ల అభిమానంతో ఉన్నారు. పోలింగ్కు ముందు ప్రముఖ జాతీయ మీడి యా జరిపిన సర్వేలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని అధిక శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్టు వెల్లడైంది. అయినా ప్రజలు బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయలేదనేది చర్చనీయాంశం. దీనిపై పార్టీలో అంతర్మథనం జరుగుతున్నది. ప్రజాతీర్పును విశ్లేషించి, అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఇతరుల కన్నా కేసీఆర్కే ఎక్కువగా ఉన్నాయనేది వాస్తవం.
కారణాలు ఏమైనప్పటికీ బీఆర్ఎస్ పరాజయం పాలైంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు పరమోన్నతమైనది. చరిత్రలో ఎందరో మహామహులు ఓటమిపాలైన సందర్భాలున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాలను విజయం వైపు నడిపించి, ఫాసిస్టులను మట్టి కరిపించిన ఘనత చర్చిల్కు దక్కుతుంది. కానీ, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బ్రిటన్ ప్రజలు కన్జర్వేటివ్ పార్టీని ఓడించారు. 83 శాతం ప్రజలు చర్చిల్ అంటే అపారమైన అభిమానం ఉన్నదని వెల్లడించారు. ఆయన పట్ల గౌరవం ఏ మాత్రం చెదిరిపోలేదు.
కానీ, ఎన్నికల్లో మాత్రం కన్జర్వేటివ్ పార్టీని దించి లేబర్ పార్టీకి పట్టం గట్టారు. లేబర్ పార్టీకి 18 శాతం ఆధిక్యం లభించింది. నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామంటూ మరికొన్ని పథకాలతో లేబర్ పార్టీ వెల్లడించిన ప్రణాళిక ప్రజలను ఆకట్టుకున్నది. అమెరికాకు చెందిన ప్రముఖ సంపాదకుడు 1940లో వెలువరించిన వార్తా కథనంలో… ‘నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు చర్చిల్ శక్తిని, సాహసాన్ని ప్రశంసించారు. ఆయన లేకుండా బ్రిటన్ ఏమవుతుందో అనుకున్నారు. ఆయన పట్ల అపారమైన గౌరవం ఉంది.’ అని పేర్కొన్నారు. ప్రజలు ఓటు వేయడానికి అనేక కారణాలుంటాయి. వాటిపై అధ్యయనం చేయవలసి ఉంటుంది.
1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. ఇందిరాగాంధీ స్వయంగా రాయబరేలీలో పరాజయం పొందడం ఆశ్చర్యకరం. ఆమెపై రాజ్నారాయణ్ గెలువడం అనూహ్యం. కానీ, ఎమర్జెన్సీ విధింపు తర్వాత పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీకి పరాజయం ఎదురైనప్పటికీ, దేశానికి ఆమె నాయకత్వం అవసరమనడంలో ప్రజల్లో ఏ మాత్రం సందేహం లేదు. అనతికాలంలోనే ఆమెకు భారీ మెజారిటీ కట్టబెట్టి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్కు తగినన్ని సీట్లు రాకపోవడానికి అనేక కారణాలు పనిచేసి ఉంటాయి. ప్రధానమైనది, ప్రచారరంగంలో కాంగ్రెస్ పైచేయి సాధించడం. రెండవది కేసీఆర్ పట్ల ఉన్నంత అభిమానం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల ఉండకపోవడం. అలాగని ఎమ్మెల్యేలను తప్పుబట్టలేం. కొన్ని స్థానాలలో ఇతర కారణాలు పనిచేశాయి. వీటిపై ఇంకా అధ్యయనం సాగిస్తే కానీ వాస్తవాలు బయటకు రావు.
బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఓటమికి అధైర్య పడవద్దు. పోరాటాలు మనకు కొత్త కాదు. ఉద్యమకాలంలో ఉమ్మడి రాష్ట్రంలో పరాయి పాలకులతో ఎదురొడ్డి పోరాడాం. అనేక అణచివేతలను ఎదుర్కొన్న చరిత్ర మనది. మనం అనేక త్యాగాలు చేసిన మాట నిజం. ఆనాడు ఎంత ధైర్యంతో పోరాడామో ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. ఈ ఒక్కసారి ప్రజలు ఓటు వేయకపోయినా కేసీఆర్ పట్ల ప్రజలకు అపారమైన అభిమానం ఉన్నది. ఆయన నాయకత్వం లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేరు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది కేసీఆర్ మాత్రమే అని ప్రజలు భావిస్తున్నారు.
ఒకవైపు పోతిరెడ్డిపాడు దగ్గర ఏపీ ప్రభుత్వం అహోరాత్రులు నీటి చౌర్యానికి శాశ్వత ఏర్పాట్లు చేసుకుంటున్నది. అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నది. మరోవైపు నాగార్జునసాగర్ ఎడమ కాలువను ఏపీ ఆక్రమించుకుంటున్నది. ఇప్పటికీ దానిని తొలగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించడం లేదు. కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం ఈ వైపు కన్నెత్తి చూడటానికి భయపడిన పొరుగు రాష్ట్రం ఇప్పుడు మన వైపు చొచ్చుకువస్తున్నది. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ ఎంతో శ్రమకోర్చి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును కూడా నిలబెట్టుకునే సూచనలు కనిపించడం లేదు. రాష్ట్ర భవిష్యత్తు ఆగమ్యగోచరంగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో రాష్ర్టాన్ని కాపాడటం కేసీఆర్కు మాత్రమే సాధ్యం. కేసీఆర్కు అండగా నిలబడటం ద్వారానే తెలంగాణను కాపాడుకోగలమని ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు గ్రహించాలి.
రాష్ట్రం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని గ్రహించినప్పుడు, బీఆర్ఎస్ శ్రేణులకు తమ కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది. కర్తవ్య పాలనలో నిమగ్నమైనప్పుడు, నైరాశ్యం ఉండదు. అందువల్ల ఉద్యమ చైతన్యంతో తెలంగాణ సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు కృషిచేయాలి. అధైర్యపడవద్దు. మన నాయకుడు కేసీఆర్కు అండగా ఉండి ముందుకు నడవాలి.
(వ్యాసకర్త: డైరెక్టర్ టీ కేసీఆర్ సెంటర్)
గోసుల శ్రీనివాస్ యాదవ్
98498 16817