కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతుల, పేదల వ్యతిరేక బడ్జెట్. అందమైన మాటలు తప్ప.. నిధుల కేటాయింపులో డొల్లతనమే కనిపిస్తున్నది. ఏడు ప్రాధాన్యత రంగాలని చెప్పి అసలు రంగాలను గాలికి వదిలివేశారు. దేశ రైతాంగాన్ని, అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాలను బడ్జెట్ నిరుత్సాహపరిచింది. అంతేకాదు తెలంగాణ రాష్ర్టానికి మరోసారి తీవ్ర అన్యాయం చేసిన బడ్జెట్ ఇది.
ఎనిమిదిన్నరేండ్లుగా తెలంగాణ అడుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు ఈ బడ్జెట్లో. గిరిజన యూనివర్సిటీకి ఇచ్చిన నిధులు తూతూమంత్రమే. విభజన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదు. కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వలేదు. రాష్ట్రంలోని నేతన్నలకు జీఎస్టీ రాయితీలు కానీ, ప్రత్యేక ప్రోత్సాహకాలుగానీ ఇవ్వలేదు. తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి కూడా పారిశ్రామికవాడను ఇవ్వలేదు. మరోవైపు, బడ్జెట్లో రైతులకు సంబంధించిన కేటాయింపుల్లో భారీగా కోత పెట్టారు. ఎరువుల సబ్సిడీలు తగ్గించడంతోపాటు గ్రామీణ ఉపాధి హామీ నిధుల్లో కోత పెట్టారు. ఆహార సబ్సిడీలు తగ్గించారు. కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల అమలు ఊసే లేదు. ఉద్యోగులకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన పన్ను మినహాయింపులు ఉద్యోగులను భ్రమల్లో పెట్టేలా ఉన్నాయి తప్ప ఆశాజనకంగా లేవు. పన్నుల భారం నుంచి సామాన్యులకు లభించిన ఉపశమనం ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా భ్రమల బడ్జెట్. పేదల వ్యతిరేక బడ్జెట్. తెలంగాణకు మొండిచేయి చూపిన బడ్జెట్.
ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధుల కోత విధించింది. గత బడ్జెట్లో రూ.89,400 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.60 వేల కోట్లకు కుదించింది. తద్వారా ఉపాధి హామీ కూలీల ఉసురు తీసే చర్యలకు పాల్పడింది. పేదల ఆహార భద్రతకు గతేడాది రూ.2,87,194 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.1,97,350 కోట్లకు తగ్గించింది.
ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ.. బడ్జెట్లో మాత్రం దాని గురించి ఏమీ ప్రస్తావించకపోవటం శోచనీయం. గతంలో దేశంలోని వివిధ రాష్ర్టాలకు 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే, తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు నర్సింగ్ కాలేజీలను ఆ ప్రాంతాలకే ఇస్తున్నట్లు ప్రకటించింది. అంటే తెలంగాణకు నర్సింగ్ కాలేజీల విషయంలోనూ మొండిచేయి చూపి మరోసారి తీవ్ర అన్యాయం చేసింది. ప్రస్తుత బడ్జెట్లో, మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలోని కరువు, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.5,300 కోట్లను కేటాయించింది. అదే సమయంలో విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా తెలంగాణకు వెనుకబడ్డ ప్రాంతాల నిధిగా మూడేండ్ల నుంచి హక్కుగా రావాల్సిన రూ.1350 కోట్లు ఇవ్వకుండా మొండి చేయి చూపించింది. ఇది పక్షపాత వైఖరి కాక మరెమిటి?
పీఎం కిసాన్ నిధి కోసం గతేడాది రూ.68 వేల కోట్లు కేటాయించగా, ఈసారి 60 వేల కోట్లకు తగ్గించడంతో పాటు లబ్ధి పొందే రైతుల సంఖ్యను సైతం కుదించింది. గతంలో కిసాన్ నిధితో 11.27 కోట్ల మంది రైతులు లబ్ధి పొందగా, ఇప్పుడు ఆ రైతుల సంఖ్యను 8.99 కోట్లకు తగ్గించింది. మరోవైపు రైతులకిచ్చే ఎరువుల సబ్సిడీలో రూ.50,120 కోట్ల కోత విధించింది. రైతులు పండించే పత్తిని కొనుగోలు చేసి మద్ధతు ధర కల్పించేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు గతంలో రూ.9243 కోట్లు కేటాయిస్తే ఈసారి బడ్జెట్లో కేవలం ఒక లక్ష రూపాయలే కేటాయించారు. ఇది రైతులకు నష్టం చేయడంతోపాటు కాటన్ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసే కుట్ర. ఇక రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు గతేడాది బడ్జెట్లో రూ.10,433 కోట్లు కేటాయించిన కేంద్రం ఈసారి రూ.3,283 కోట్లు కోత విధించి రూ.7,150 కోట్లకు తగ్గించింది. దీన్ని బట్టి కేంద్రానికి రైతుల మీదున్న ప్రేమ ఏపాటిదో అర్థమవుతున్నది. మరోవైపు విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే, 0.5 శాతం ఎఫ్ఆర్బీఎం అనుమతిస్తామని షరతు పెట్టింది. అంటే బోరు బాయిల కాడ మీటర్లు పెట్టి, రైతుల ఇంటికి బిల్లు పంపించాలని చెప్పకనే చెప్పింది. ఈ నిబంధన వల్ల మన రాష్ర్టానికి మరో రూ.6 వేల కోట్లు రాకుండా పోతాయి.
మైనారిటీల సంక్షేమానికి గతంలో రూ.5,020 కోట్లు కేటాయించిన కేంద్రం ఈసారి రూ.3,097 కోట్లకు కుదించింది. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నిధులు కచ్చితంగా విడుదల చేయాలి. కానీ వాటిలో కూడా కేంద్రం కోత విధించి గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలకు తీవ్ర అన్యాయం చేసింది. పట్టణ స్థానిక సంస్థలకు 2022-23లో రూ.22,908 కోట్లు ప్రతిపాదించి, సవరించిన పద్దుల ప్రకారం దాన్ని రూ.15,026 కోట్లకు కుదించింది. గ్రామీణ స్థానిక సంస్థలకు 2022-23లో రూ.46,513 కోట్లు ప్రతిపాదించగా, దాన్ని రూ.41 వేల కోట్లకు కుదించారు. ఈ చర్యలు పట్టణ, గ్రామీణ సంస్థలను చిన్నచూపు చూడటంలో భాగమనే భావించాలి. అదే విధంగా ఫైనాన్స్ కమిషన్ నుంచి ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపులో కూడా రూ.4,297 కోట్ల కోత విధించారు.
2023-24 బడ్జెట్లో నికర అప్పులు రూ.17,86,816 కోట్లుగా ప్రతిపాదించిన కేంద్రం అందులో సింహభాగం అంటే రూ.8,69,855 కోట్లు రెవెన్యూ లోటును భర్తీ చేయడానికే ప్రతిపాదించారు. అప్పులను క్యాపిటల్ ఎక్స్పెండీచర్ కోసం కాకుండా, 48.7 శాతాన్ని రోజువారీ ఖర్చుల కోసం ప్రతిపాదించడం వల్ల ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉన్నది. 1979-80 నుంచి కేంద్రంలో రెవెన్యూ లోటు క్రమంగా పెరుగుతున్నది. 1979-80లో రూ.694 కోట్ల రెవెన్యూ లోటు ఉండగా, 2022-23 సవరించిన అంచనాల ప్రకారం రూ.11,10,546 కోట్లకు పెరిగింది. ఇది ఎఫ్ఆర్బీఎం చట్టానికి విరుద్ధం. రాష్ర్టాలు ఆ నిబంధనలను పాటిస్తున్నాయి. కేంద్రం మాత్రం పాటించటం లేదు. దీనివల్ల దేశ ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. బాగా పని చేసే రాష్ర్టాలపై కూడా ఎఫ్ఆర్బీఎం నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ వాటికి నిధులు లేకుండా చేస్తున్న కేంద్రం, తాను మాత్రం ఎప్పటికప్పుడు ఆ నిబంధనలను ఉల్లంఘిస్తున్నది. తద్వారా తన చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నది.
2022-23లో కేంద్రం మొత్తం పన్నుల వసూలు రూ.33,68,858 కోట్లు కాగా, ఇందులో రాష్ర్టాల వాటా రూ.10,21,488 కోట్లుగా అంచనా వేశారు. అదే సమయంలో కేంద్రం వసూలు చేసే మొత్తం పన్నుల ఆదాయంలో 30.4 శాతం మాత్రమే రాష్ర్టాలకు ఇస్తున్నది. నిజానికి, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ర్టాలకు 41 శాతం ఇవ్వాలి. కానీ కేంద్రం సెస్సులు, సర్ఛార్జీల విధింపుతో రాష్ర్టాలకు అందుతున్నది 30 శాతం మాత్రమే. దీంతో రాష్ర్టాలు రెండు రకాలుగా నష్టపోతున్నాయి.
ఈ విధంగా కేంద్ర బడ్జెట్ ఉద్యోగుల, రైతుల, సామాన్య పౌరుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా రూపుదిద్దుకున్నది. తొలి నుంచీ తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షనే ఈసారీ కేంద్రం కొనసాగించింది.
(వ్యాసకర్త: రాష్ట్ర ఆర్థిక మంత్రి)
-తన్నీరు హరీశ్రావు