Telangana | తెలంగాణ వస్తే కరెంటు ఉండదని ఒకరు, నీళ్లు రావని మరొకరు, వ్యవసాయం చేత కాదని ఇంకొకరు, పరిపాలనే చేత కాదని, హైదరాబాద్ నాశనమైపోతుందని మరికొందరు శాపనార్థాలు పెట్టారు. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఉద్యమకారుడు, పరిపాలనాదక్షుడు, దార్శనికుడు అయిన కేసీఆర్ సమైక్య పాలనలో 58 ఏండ్లలో సాధ్యం కాని అభివృద్ధిని కేవలం తొమ్మిదేండ్ల పాలనలో సాధించి చూపించారు. అన్ని రంగాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టి దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేశారు. రాష్ర్టాభివృద్ధి పట్ల ఆయనకు ఉన్న దూరదృష్టి, తపనే ఇందుకు కారణం.
కేవలం పేరు కోసమే ఒక రాష్ట్రం ఏర్పడితే సుదీర్ఘ కాలం జరిగిన ఉద్యమానికి, మనుష్యుల ప్రాణ త్యాగాలకు విలువ ఉండదని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరమనేది ప్రజలు తాము అభివృద్ధి చెందడానికి, మరింత అభివృద్ధికి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సహాయపడేటట్టు ఉండాలనే ఆలోచనతో కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని ప్రగతి పథం వైపు తీసుకెళ్తున్నారు. అన్ని రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక విజన్తో రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారు. వివిధ రంగాల్లో గత, ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సాధించిన ప్రగతేమిటో అర్థమవుతుంది.
వ్యవసాయరంగాన్ని పరిశీలిస్తే కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, పాత నీటి పారుదల ప్రాజెక్టుల మరమ్మతుల వల్ల రాష్ట్రం ఏర్పడినప్పుడు 62.48 లక్షల ఎకరాలుగా ఉన్న ఆయకట్టు 2021-22 నాటికి 1.35 కోట్ల ఎకరాలకు చేరి 117 శాతం వృద్ధిని సాధించింది. నాడు వరి ఉత్పత్తి 45.71 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా, 2021-22 నాటికి 202 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. 2013-14లో ఒక కోటి ఎకరాల్లో పంటలు సాగైతే, 2022-23 నాటికి సాగు విస్తీర్ణం 2.20 కోట్ల ఎకరాలకు పెరిగింది. వరి ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల సాధించాం. పత్తి ఉత్పత్తిలో 32 శాతం వృద్ధి, పండ్ల ఉత్పత్తిలో రెండో స్థానం, ఆయిల్ పామ్ సాగులో ఆరో స్థానం సాధించగలిగాం. నాడు మన దగ్గర ఉన్న గోదాముల సామర్థ్యం 4 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, నేడు 25 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది.
విద్యారంగాన్ని గమనిస్తే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 293 గురుకులాలు ఉండేవి. కానీ బీఆర్ఎస్ పాలనలో తొమ్మిదేండ్లలోనే కొత్తగా 709 గురుకులాలను స్థాపించారు. ఈ గురుకులాల్లో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా నాణ్యమైన వసతులతో కూడిన విద్యను అందిస్తున్నారు. నేడు గురుకుల కళాశాలల విద్యార్థులు బహుళజాతి సంస్థల క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికై ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతిభావంతులైన నిరుపేద ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు మహాత్మా జ్యోతిబా పూలే పథకం ద్వారా, బ్రాహ్మణ విద్యార్థులకు స్వామి వివేకానంద పథకం ద్వారా, మైనారిటీ విద్యార్థులకు కేసీఆర్ ఓవర్సీస్ పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడానికి రూ.20 లక్షల ఉపకార వేతనాన్ని కేసీఆర్ సర్కార్ అందిస్తున్నది. ఒక బడి నిర్మిస్తే వేయి మంది మేధావులు తయారవుతారనే అంబేద్కర్ మాటలను ఆదర్శంగా తీసుకొని సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనకు మన ఊరు-మన బడి పథకాన్ని తీసుకొచ్చి వాటి రూపురేఖలను మార్చుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశపెట్టి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం.
వైద్యరంగాన్ని గమనిస్తే ఒకనాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కొరత తెలంగాణను వేధించేది. నేడు తగినన్ని ప్రభుత్వ దవాఖానలు, జిల్లాకో వైద్య విద్య, పారా మెడికల్, నర్సింగ్ కాలేజీలను స్థాపించుకునే దశకు చేరుకున్నాం. మాతృత్వ మరణాల రేటు (బాలింతల మరణాలు) ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే భారీగా తగ్గాయి. శిశు మరణాల రేటు ఉమ్మడి రాష్ట్రంలో 35 శాతం ఉండగా, నేడు 21 శాతానికి తగ్గాయి (ఇది జాతీయ సగటు 28 శాతం కన్నా తక్కువ). రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ వల్లే ఇది సాధ్యమైంది.
జిల్లాకో వైద్య కళాశాల లక్ష్యంగా తెలంగాణ సర్కారు చేపట్టిన చర్యలతో 2014 నాటికి ప్రభుత్వ విభాగంలో కేవలం 850 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉండగా ఇప్పుడా సంఖ్య 4,590కి పెరిగింది. కేంద్ర ఆర్థిక సర్వే 2022-2023 ప్రకారం దక్షిణ భారతదేశంలో ప్రజా వైద్యంపై చేస్తున్న ఖర్చులో ప్రభుత్వ వాటా ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో నిలిచింది. వైద్యం కోసం చేసే ఖర్చులో ప్రజలపై తక్కువ భారం పడుతున్న రాష్ర్టాల్లో 3వ స్థానంలో నిలిచింది. తెలంగాణ డయాలసిస్ పథకం, వ్యాధి నిర్ధారణ పథకం, కంటి వెలుగు, మహిళా ఆరోగ్య పథకం లాంటి ఎన్నో పథకాలతో ప్రజారోగ్యంపై ఎంతో శ్రద్ధను చూపిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.
ఉమ్మడి రాష్ట్రంలో గృహాలకు 4-8 గంటలపాటు విద్యుత్తు కోతలు విధించేవారు. పరిశ్రమలకు వారంలో రెండు రోజులు పవర్ హాలిడే ఇచ్చేవారు. 4 నుంచి 6 గంటల పాటు అస్తవ్యస్తమైన విద్యుత్తు సరఫరా వల్ల వ్యవసాయంలో నష్టం కలిగి రైతులు ఆత్మహత్య చేసుకొనేవారు. కానీ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా ప్రస్తుత సామర్థ్యం 18,567 మెగావాట్లు. రాష్ట్రం ఏర్పడినపుడు సోలార్ విద్యుత్తు ఉత్పత్తి 72 మెగావాట్లు కాగా నేడది 5,741 మెగావాట్లకు చేరుకున్నది. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు రోజులో 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. సుమారు 27 లక్షల రైతులకు రోజులో 24 గంటలపాటు ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. తక్కువ ట్రాన్స్మిషన్ నష్టంలో 2వ స్థానంలో ఉన్నాం. తలసరి విద్యుత్తు వినియోగం 2014లో 1,152 కిలోవాట్లుగా ఉండగా ప్రస్తుతం అది 2,126 కిలోవాట్లకు చేరుకొంది.
మానవీయ దృక్పథం లేని ప్రగతి నిరర్థకమని నమ్మిన సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్ల మొత్తాన్ని రూ.200 నుంచి రూ.2016కు పెంచారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని రూ.4016కు పెంచారు. కొత్తగా బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ రోగులు, ఫైలేరియా బాధితులకు ఆసరా పింఛన్లు అందిస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. పేదింటి ఆడపిల్లల పెండ్లి తల్లిదండ్రులకు భారంగా మారకూడదని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నది. ఇప్పటివరకు 13.16 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. దళిత బంధు, బీసీ బంధు, చేనేత బీమా, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, గృహలక్ష్మి పథకం.. ఇలా చెప్పుకొంటూ పోతే సమాజంలోని అన్నివర్గాల అభివృద్ధి పట్ల కేసీఆర్కు ఉన్న విజన్ తెలుస్తది.
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషి కారణంగా ఐటీ రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఐటీ వార్షిక ఎగుమతుల విలువ 2014లో రూ.57,258 కోట్లు ఉండగా.. 2023 నాటికి రూ.1,83,569 కోట్లకు పెరిగింది. ఐటీ ఉద్యోగ నియామకాల్లో 156 శాతం వృద్ధి నమోదైంది. ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరింపజేయడం అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. అడవుల పునరుద్ధరణ, పర్యావరణ సమతుల్యత కోసం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన హరిత హారం వల్ల రాష్ట్రం ఏర్పడప్పుడు 19,854 చదరపు కిలోమీటర్లుగా ఉన్న అటవీ విస్తీర్ణం 2023 నాటికి 26,969 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. పచ్చదనం 7.70 శాతం పెరిగింది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో పేదరికం తగ్గింది. 2015-16లో తెలంగాణలో 13.18 శాతం జనాభా పేదరికంలో ఉండగా 2019-20 నాటికి అది 5.88 శాతానికి తగ్గిందని నీతి ఆయోగ్ తెలిపింది. రాష్ట్రంలో సగటు పౌరుడి ఆదాయం సుమారు 5-6 ఏండ్లలో రెట్టింపవుతుండగా, దేశ స్థాయిలో అందుకు 8-9 ఏండ్లు పడుతున్నది.
ఎంతో ఘన చరిత్ర కలిగిన పార్టీ మాదని, విజన్ ఉన్న నాయకులున్న పార్టీ మాదని ఢంకా బజాయించుకున్న గత పాలకులు ఇన్నేండ్లలో ప్రవేశపెట్టని అభివృద్ధి పథకాలను కేవలం తొమ్మిదేండ్లలో ప్రవేశపెట్టడం సీఎం కేసీఆర్ విజన్కు నిదర్శనం. దేశంలో కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ కేసీఆర్ సారథ్యంలో అనతికాలంలోనే తెలంగాణ నమూనాతో అభివృద్ధి పథంలో నడుస్తూ దేశం యావత్తు తన వైపు చూసేలా చేసుకున్నది. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా దూరదృష్టి, గొప్ప విజన్ కలిగిన ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కావటం, రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్లలోనే ఇన్ని విజయాలు సాధించడం తెలంగాణ ప్రజల కష్టాలకు, త్యాగాలకు దక్కిన ప్రతిఫలం.
(వ్యాసకర్త: చరిత్ర సహాయ ఆచార్యులు)
సాసాల మల్లికార్జున్
83282 10190