సరిగ్గా పదేండ్ల కిందట… తెలంగాణలో ఎక్కడ చూసినా దయనీయమైన స్థితిలో ప్రజలు కనిపించారు. ఒక్కపూట కూడా తిండికి నోచుకోని పేదరికం తెలంగాణను ఆవరించింది. వేసవిలో గంజి కేంద్రాలు, ఆకలిచావులు, పొట్టకూటి కోసం వలసలు, చేసిన అప్పులు తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలు.. ఇదీ ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంత పరిస్థితి.
అప్పటి పాలకుల పుణ్యమాని గ్రామీణ ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైంది. పంట పొలాలు బీళ్లుగా మారినయి. నీటి జాడ కానరాని చెరువులు పిచ్చి మొక్కలతో నిండినయి. ఎండిన బావులు, వెయ్యి అడుగులు తవ్వినా నీరు పడని బోర్లతో వేలాది రైతు కుటుంబాలు గుండెలు బాదుకున్నయి. శిథిలమైన ప్రాజెక్టులతో నదీ జలాలు సముద్రంలో కలిసిపోయినయి.
Telangana | నీళ్లు, నిధులు, నియామకాల్లో వలస పాలకులు చూపిన వివక్ష, ఫలితంగా వేలాది రైతుల ఆత్మహత్యలు… వెరసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ప్రారంభానికి కారణాలు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రైతుల ఆత్మహత్యల నివారణే ప్రథమ కర్తవ్యంగా ముందుకు సాగారు. సాగునీటిరంగం-వ్యవసాయ ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించారు. తన తొమ్మిదిన్నరేండ్ల పాలనలో రాష్ట్ర ఆదాయంలోని సింహభాగం ఈ రంగాలపై ఖర్చుపెట్టారు.
సాగునీటి అభివృద్ధి కోసం ముందుగా చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమం ‘మిషన్ కాకతీయ’. సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో 46 వేలకు పైగా ఉన్న చిన్న నీటి వనరులను (వీటిలో సుమారు 28 వేల చెరువులు, కుంటలు) పునరుద్ధరించింది కేసీఆర్ ప్రభుత్వం. వీటి కింద సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నది. రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం చెరువులు, కుంటల కింద నాలుగైదు లక్షల ఎకరాలకు కూడా సాగునీరందని పరిస్థితి.
చెరువుల్లో, కుంటల్లో పూడికతీయడంతో ఆ సారవంతమైన మట్టిని (సుమారు 7 కోట్ల ట్రాక్టర్ల లోడ్) రైతులు తమ పంట పొలాలకు స్వచ్ఛందంగా తరలించారు. మట్టిని తరలించే వ్యయం తగ్గడం, పనులను 30-40 శాతం తక్కువకు కాంట్రాక్టర్లు చేపట్టడం వల్ల ప్రభుత్వం రూ. 22 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ప్రాజెక్టు కేవలం రూ. 9 వేల కోట్లతోనే పూర్తయింది.
పూడికమట్టి వల్ల రైతులకు రసాయనిక ఎరువుల వినియోగం తగ్గి డబ్బు ఆదా అయింది. పూడికతీత వల్ల భూగర్భ జలాలు కూడా 6 నుంచి 8 మీటర్ల మేర పైకి వచ్చినట్లు భూగర్భ జలశాఖ పరిశీలనలో వెల్లడైంది. ఎండిన బావులు, బోర్లలోకి కొత్తగా నీరు చేరి పరోక్షంగా సాగు పెరగడానికి దోహదపడింది.
కేసీఆర్ ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ తర్వాత పెండింగ్లో ఉన్న దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ఎత్తిపోతలపై దృష్టిపెట్టింది. చంద్రబాబునాయుడు తన తొమ్మిదేండ్ల పాలనలో సర్వేల పేరుతో కాలయాపన చేశారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ‘జలయజ్ఞం’లో ఈ ప్రాజెక్టులను చేర్చి పనులను చేపట్టినా 2014 నాటికి కూడా ఇవి పూర్తికాలేదు. కేసీఆర్ ఈ ప్రాజెక్టులను పూర్తిచేయడానికి అవసరమైన నిధులను కేటాయించి లక్ష ఎకరాలకు కూడా సరిగా నీరందని కరువు సీమ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు మరో 10 లక్షల ఎకరాలకు సాగునీరందించారు. ఈ నదీజలాలతో వర్షాధారిత చెరువులకు నీటిని మళ్లించడంతో మండు వేసవిలో సైతం చెరువులు అలుగు దుంకుతుంటే ఆ అపురూప దృశ్యాలతో ప్రకృతి పరవశించింది. ఎండిన వాగులపై వేదనతో ‘వాగు ఎండి పాయెరా’ అని పాటరాసిన గోరటి వెంకన్న కవి హృదయానికి నిండుగా పారుతున్న వాగుల సోయగాలతో ఉపశమనం కలిగింది.
జలయజ్ఞంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చేపట్టిన పలు ప్రాజెక్టుల డొల్లతనాన్ని పసిగట్టిన కేసీఆర్ ఆయా ప్రాజెక్టుల రీ డిజైనింగ్ అవసరాన్ని గుర్తించారు. గోదావరికి ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ వంటి 13 బ్యారేజీలను నిర్మించి ఎక్కడికక్కడ ఎత్తిపోతల పథకాలను నిర్మించి వేలాది ఎకరాలకు సాగునీరిందించటంతో శ్రీరాంసాగర్ నీటి ప్రవాహం బాగా తగ్గింది. ఈ ప్రాజెక్టు కింది ఆయకట్టు మొదటిదశకు కూడా నీరందే అవకాశం లేదు. ఈ సంగతి తెలిసి కూడా కాకతీయ కాల్వను డోర్నకల్, తుంగతుర్తి వరకు సుమారు 200 కిలోమీటర్లకు పైగా తవ్వించి శ్రీరాంసాగర్ రెండోదశ నిర్మాణానికి పూనుకున్నారు. వైఎస్ కాల్వలు రావడం వల్ల సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని వరంగల్, నల్గొండ రైతులు ఆశపడ్డారు. ఇవి కేవలం కాంట్రాక్టర్లకు పని కల్పించి కమీషన్లు పొందడానికి, ‘తెలంగాణలో సాగునీటిరంగం అభివృద్ధి చేస్తున్నానని, తెలంగాణ రాష్ట్రం అవసరం లేద’ని ప్రజలను నమ్మించడానికి వైఎస్కు పనికివచ్చాయి. మంజీరా నదిపై ఇలాంటి బ్యారేజీలనే మహారాష్ట్ర 32, కర్ణాటక 5 నిర్మించి ఎత్తిపోతలతో నదిలోకి వచ్చే నీటిని మొత్తం ఆయా రాష్ర్టాల్లో సాగుకు మళ్లించడంతో సింగూరు, నిజాంసాగర్కు తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లోని సుమారు ఇరవై లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రత్యామ్నాయ సాగునీటి ఏర్పాటు అవసరమైంది.
మరోపక్కన తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిపై 152 అడుగుల ఎత్తున నిర్మించతలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ముందుకు సాగకుండా కేంద్ర జలసంఘం, మహారాష్ట్ర అడ్డుపడ్డాయి. బ్యారేజీ నిర్మాణ స్థలం మహారాష్ట్రలోని వన్య మృగ సంరక్షణ కేంద్రం జోన్లో ఉన్నదని, ఆ ప్రాంతం ముంపునకు గురికాకుండా 148 అడుగుల ఎత్తుతో బ్యారేజీ నిర్మించుకోవచ్చునని మహారాష్ట్ర తెలిపింది. కాగా తెలంగాణ వినియోగానికి వంద టీఎంసీలకు మించి నీరు ఈ ప్రదేశంలో అందుబాటులో లేదని, 160 టీఎంసీల వినియోగానికి అవసరమైన రిజర్వాయర్లు (కేవలం 14 టీఎంసీల రిజర్వాయర్లనే డీపీఆర్లో చూపించారు) లేవని కేంద్ర జల సంఘం అభ్యంతరాలు తెలిపింది. దీంతో గత్యంతరం లేక కాళేశ్వరం రీ-డిజైనింగ్పై కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. ప్రముఖ ఇంజినీర్లు, డబ్లూఏపీసీఓఎస్ (వ్యాప్కోస్-కేంద్ర ప్రభుత్వం సంస్థ) నిర్ణయించినట్టుగా కేవలం మూడేండ్లలోనే లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ళ) బరాజ్లను, మరో మూడు పంపింగ్ స్టేషన్లను నిర్మించారు.
ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది మల్లన్నసాగర్ రిజర్వాయర్. దీని నిర్మాణాన్ని ముందుకుపోనీయకుండా ప్రతిపక్ష నాయకులు నిర్వాసితులచే, ఇతరులచే అనేక కేసులను పెట్టించడంతో కొద్దిగా ఆలస్యమైంది. నిజాంసాగర్, శ్రీరాంసాగర్, అప్పర్ మానేరు, హల్దీ, కడవేరు వాగులోపల గల చెక్డ్యాంలు పునరుజ్జీవం పొందడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడింది. సుమారు ఇరవై లక్షల ఎకరాల ఆయకట్టుకు రెండు పంటలకూ నీరందించగలిగారు కేసీఆర్.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఎకరాలకుపైగా కొత్త ఆయకట్టుకు సాగునీరందించి, మరో ఇరవై లక్షల ఎకరాలకు పైగా పాత ప్రాజెక్టుల ఆయకట్టు స్థిరీకరించాలని కేసీఆర్ భావించారు. కృష్ణా, భీమా, తుంగభద్రా నదుల పరీవాహక ప్రాంతంలోని ప్రధాన నదులపై ఉపనదులపై మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో వందలాది బరాజ్లు నిర్మించడం, ఆల్మట్టి ఎత్తు పెంపు తదితర కారణాల వల్ల తెలంగాణలోని కృష్ణా ప్రాజెక్టులకు తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతున్నది. కరువు సీమ పాలమూరులో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (సుమారు 12 లక్షల ఎకరాల ఆయకట్టు), ఈ జిల్లాలో నిర్మిస్తున్న కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టులు, శ్రీశైలం ఎడమగట్టు నుంచి టన్నెల్ ద్వారా నల్గొండ జిల్లాకు నీరందించాల్సి ఉన్న ఎలిమినేటి మాధవరెడ్డి (ఏ.ఎం.ఆర్) ప్రాజెక్టులకు నికర జలాల్లో నీటి వాటా లేదు. మిగులు జలాలపైన ఆధారపడ్డ ఈ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరగాలంటే బచావత్ ట్రిబ్యునల్ ద్వారా తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను సరిదిద్ది కృష్ణా జలాల్లో పై ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపు జరగాలి. ఈ లక్ష్యసాధన కోసమే అవశేష ఆంధ్రప్రదేశ్-తెలంగాణల మధ్య కృష్ణా జలాల పునః పంపిణీ కోసం కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటుచేయాలని దశాబ్దకాలం నుంచి కేసీఆర్ ప్రభుత్వం ప్రధానిని కోరుతూ వచ్చారు. ఈ సంవత్సరం అక్టోబర్ 6న ప్రధాని తెలంగాణ డిమాండ్ను ప్రస్తుతం ఉన్న బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు రెఫర్ చేశారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో రాజీలేని పోరాటం చేస్తూ కృష్ణా జలాల పునఃపంపిణీకి కృషిచేయాల్సి ఉంటుంది.
తెలంగాణలో నిర్మాణంలో ఉన్న సీతారామ, డిండి-విద్యాసాగర్రావు ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టులోని పలు ప్యాకేజీలు, ఎత్తిపోతల పథకాలు పూర్తయితే రైతులకు బోర్లు, బావుల అవసరం లేకుండా కోటీ ముప్ఫై అయిదు లక్షల ఎకరాల్లో పంట భూమికి రెండు పంటలకూ కృష్ణా-గోదావరి జలాలను అందించి ప్రపంచ రికార్డును తెలంగాణ దక్కించుకుంటున్నది. ఇప్పటికే సుమారు 80-85 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తున్నది ప్రభుత్వం. నదీ జలాల పారకం పెరిగిన ఆయకట్టులో బోర్లు, బావుల అవసరం తగ్గడంతో ఆ మేరకు విద్యుచ్చక్తి ఆదా అవుతున్నది.
తెలంగాణ భౌగోళిక, నైసర్గిక స్వరూపాన్ని అధ్యయనం చేస్తూ, జల వనరుల పట్ల సమగ్ర అవగాహనను ఏర్పరచుకోవడానికి కొన్ని వేల గంటలు శ్రమించారు కేసీఆర్. దీని ఫలితమే దేశమంతా కరువుతో విలవిలలాడుతుంటే 93 శాతం నీటి నిల్వలు గల జలసమృద్ధి రాష్ట్రంగా తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. సాగునీటి వినియోగ సామర్థ్యంలో కూడా తెలంగాణ అగ్రభాగాన నిలిచి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని ఇటీవలే వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ (వాల్మీ) తదితర సంస్థల అధ్యయనంలో వెల్లడైంది. కేసీఆర్ తెలంగాణ జల వనరుల రంగం, వ్యవసాయరంగంలో సాధించిన విజయాలను పరిరక్షించుకుంటూ మరింత ప్రగతిని ఈ రంగాలలో సాధించాల్సిన బాధ్యతను ప్రజలు కాంగ్రెస్ పాలకులకు అప్పగించారు.
(వ్యాసకర్త: జల వనరుల నిపుణులు)
– వి.ప్రకాశ్
90009 50400