సరిగ్గా ఇరవై ఏండ్ల కిందినాటి ఆర్థిక సంస్కరణల ప్రభావంతో వచ్చిన రోడ్లు, పైవంతెనల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగేది. నల్లతాచు పాముల్లా రోడ్లున్నాయని కవితాత్మకంగా కవులు చెప్పేవారు. దాన్ని తాము సాధించిన అభివృద్ధిగా రాజకీయ నాయకులు గొప్పగా చెప్పేవారు. పదేండ్ల కిందటికి, ఇప్పటికి మన రాష్ట్రంలో వచ్చిన మౌలికమైన మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి వందల కిలోమీటర్ల మేర పడమర, ఉత్తరాలుగా జరిగిన మా ప్రయాణ అనుభవాలు.. తెలంగాణలో మౌలిక మార్పు గురించిన కొన్ని విషయాలను చర్చించడం ఈ వ్యాసం ఉద్దేశం.
రాష్ట్ర రాజధాని నలువైపులా ఎటువైపు వెళ్లినా నాలుక చాచుకొని పడుకున్న అనకొండల్లానే విస్తారమైన రహదారులు కనిపించాయి. ఇంకా కొన్ని రోడ్లయితే మరింత సున్నితంగా ఉన్నాయి. కానీ, వాటిపై పరుచుకున్న ధాన్యపురాసులు మాత్రం బంగారు వన్నెతో ఆ రోడ్లకు ఆభరణంలా కనిపించాయి. రోడ్డుపై ప్రయాణిస్తూ కుడి, ఎడమా రెండువైపులా కనుచూపు మేర పచ్చదనం కన్పిస్తున్నది. ఆకురాలు కాలంలో కూడా ఆ పచ్చదనం, వెచ్చదనం ప్రయాణికులను ముగ్ధులను చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ అనుభూతి, అనుభవం వెనుక కొన్ని కారణాలున్నాయి.
మొన్నీ మధ్య హైదరాబాద్ నుంచి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నేను ఇంకొంత మంది కలిసి ఒక జర్నలిస్టు మిత్రుడి ఇంట్లో కార్యానికి జనగామ వెళ్లాం. హైదరాబాద్ నుంచి జనగామ జిల్లా వరకు ఆకులు రాలే కాలంలో మెట్ట చెల్కల మొక్కజొన్న, ఆముదం, కందిచేల స్థానంలో ఎటుచూసినా వరి పంటే కన్పించింది. అంతేకాదు, రోడ్డుపక్కన కొన్ని కిలోమీటర్ల మేర నీటి మడుగులు కన్పించాయి.
మనోవేగంతో పోటీపడే కారు వేగాన్ని సైతం కాస్తా నిదానించి వెళ్లమనేలా చెరువుల్లో నీటి అలల మిల మిలలు కన్పించాయి. అందరం గమనిస్తున్నాం. మా ప్రయాణం మధ్యలో చర్చ ప్రారంభమైంది. ఏమిటీ మార్పు? పదేండ్ల కింద ఇట్లా లేదు కదా? ఎన్ని విధ్వంసాలను దాటుకొని తెలంగాణ వచ్చింది. స్వయం పాలన తీసుకువచ్చిన మార్పును మనం కాస్త లోతుల్లోకి వెళ్లి తొంగిచూస్తే మరిన్ని విషయాలు అర్థమవుతాయి. హైదరాబాద్ నుంచి ఉప్పల్ దాటి ఘట్కేసర్ రాగానే అక్కడక్కడా కొన్ని చేన్లు కన్పించేవి. ఆ తర్వాత బీబీనగర్ చెరువు, కొన్ని వరి పొలాలు.
ఆలేరు చుట్టుపక్కల అంతా డ్రై. కొన్ని ఏరియాల్లో మాత్రం విసిరేసినట్టు కొన్ని వరి చేలు. ఇది పదేండ్ల కింద వరంగల్ రోడ్డు ప్రయాణంలో తాము చూసిన అనుభవాలని మిత్రులు చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపడం, కాళేశ్వరం నీళ్ల ద్వారా వాగులు, వంకల్లో గోదావరి జలాలు. భూమిలో పెరిగిన నీటిమట్టం. వెరసి హైదరాబాద్ నుంచి జనగామ వెళ్తున్నంత దూరం మేము చూసినంత వరకు భూమికి పచ్చదనం అద్దినట్టే ఉన్నది. ఆలేరు దాటి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తున్నప్పుడు రోడ్డు కన్పించకుండా వరిధాన్యం పుట్లకొద్దీ కన్పించింది.
కొలనుపాక నుంచి ఒక మారుమూల గ్రామానికి మా ప్రయాణం సాగినంత దూరం ధాన్యపు సిరులు మా కారు వెంట అదే రోడ్డుపై ప్రయాణం చేసినట్టు కనిపించాయి. మధ్యలో కారు ఆపి రైతులతో ముచ్చటిస్తే.. పూర్వం కొన్ని గ్రామాల్లో జొన్నలు మార్పిళ్లు చేసేవారమని, ఇప్పుడు విరివిగా నీళ్లు రావడంతో రెండు పంటలూ వరి సాగు చేస్తున్నామని చెప్పారు. తమ జీవనసరళిలో మార్పు వచ్చిందని కూడా అన్నారు. ఉమ్మడి వరంగల్లో నల్లరేగడి నేల ఎక్కువగా ఉండటం, నీటి సౌకర్యం రావడంతో వరి, చెరుకు, పత్తి, మిర్చి వంటి పంటలు సాగవుతున్నాయి. 1996-99 మధ్య పత్తి రైతులు ఆత్మహత్యలు అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగాయి. వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో చిక్కుకున్నది. ఇప్పుడు ఆ చిత్రం పూర్తిగా మారిపోయింది.
నాటి ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాల కారణంగా వ్యవసాయ విధ్వంసం జరిగింది. కరెంటు లేక, నీరు లేక పంటలు ఎండిన విషయాలు, నాటి పత్రికల్లో రిపోర్టు అయిన విషయాలు ఇట్లా చాలా మాట్లాడుకున్నాం. ప్రధానంగా అల్లం నారాయణ సార్ ఉత్తర తెలంగాణలో నాటి పరిస్థితుల గురించి, తన జర్నలిజం అనుభవాలు, రైతుల సమస్యల గురించి చాలా విషయాలు చెప్పారు. నేను కూడా ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలోని రైతుల గురించిన విషయాలు నాటి విధ్వంసం గురించి చెప్పాను. మొత్తం ఈ ప్రయాణంలో మాకు గతానికి, ఇప్పటికి వచ్చిన తేడాతో రైతుల ముఖాల్లో ఆనందాన్ని గమనించాం.
ఇదిలా ఉంటే మరో రెండురోజుల తర్వాత… ఎన్నికల్లో ప్రజల నాడి తెలుసుకునేందుకు నాతో పాటు గోరటి వెంకన్న, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు యోగానంద్, ఇంకా కొందరు మిత్రులం కల్సి ఉమ్మడి మెదక్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు తిరిగాం. పదేండ్ల కాలంలో తెలంగాణలో వచ్చిన మార్పు ఏమిటీ? ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ప్రభుత్వ పథకాలు వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చాయా? రైతుబంధు, మిషన్ కాకతీయ పథకాల గురించి ఏమనుకుంటున్నారు? ఇట్లా చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. మేం అందోల్ చెరువులో నీళ్లు.. చెరువు కింద వరి సాగు అక్కడినుంచి మా ప్రశ్నల ప్రయాణం ప్రారంభమైంది. చెరువు కింద మునుపెన్నడూ లేనివిధంగా రెండు పంటలు తప్పకుండా సాగు చేసుకుంటున్నామని రైతులు చెప్పారు. ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నామినేషన్ ర్యాలీ జరుగుతున్నది. కిక్కిరిసిన జనసందోహం. మా కారును అతికష్టం మీద వారిని దాటుకొని మంజీరా రిజర్వాయర్ వరకు వెళ్లసాగాం. ఎటుచూసినా పెద్ద పెద్ద రోడ్లు. రోడ్లపై ధాన్యపురాశులు. యాభై కిలోమీటర్ల మేరకు మాకు వరిధాన్యపు రాశులు రోడ్లపై కన్పించాయి.
గ్రామానికి ఐదారు కిలోమీటర్ల దూరం నుంచి మరో గ్రామం దాటి ఐదారు కిలోమీటర్లు వెళ్లేంతవరకు ధాన్యమే కన్పించింది. ఒక దగ్గర కారును ఆపి రోడ్డుపై ఉన్న ఆ ధాన్యాన్ని చేతుల్లోకి తీసుకున్న గోరటి వెంకన్న ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. పల్లెపల్లెనా పల్లేర్లు మొలిచే అని నాడు తను రాసిన పాటను గుర్తుచేసుకొని నేడు కళ్లెదుట కనిపిస్తున్న ధాన్యపు సిరులను, పచ్చటి పైరులను చూసి పులకించిపోయారు. అక్కడే ఉన్న రైతులు కొందరు తమకు రైతుబంధు వల్ల పెట్టుబడి సాయం సకాలంలో అందుతున్నదని, దానికితోడు కరెంటు, నీళ్ల సమస్య లేదని పంట దిగుబడి బాగా ఉన్నదని చెప్పారు. మునిపల్లె, పుల్కల్ మండలాల్లోని చాలా గ్రామాలు తిరిగాం. ప్రతీ గ్రామంలో రోడ్డుకిరువైపులా విస్తారంగా చెరుకు సాగు కన్పించింది. కూరగాయల తోటలున్నాయి.
కోసేందుకు సిద్ధంగా ఉన్న వరిచేన్లు కన్పించాయి. అంతేకాదు, దాదాపు ప్రతీ గ్రామంలోని తటాకాలు నీటి అలలతో అలరారుతున్న దృశ్యాలే దర్శనమిచ్చాయి. ప్రతి చెరువు దగ్గర చిన్నపాటి చేపల మార్కెట్లా ఉన్నది. చేపలు పట్టేవారితో కూడా కొందరితో మాటలు కలిపాం. వారి అనుభవాలు తెలుసుకున్నాం. రచ్చబండలపై కూర్చున్న వృద్ధులు మేము ప్రశ్న వేయకముందే, ‘ముసలివాళ్ల గురించి ఆలోచించింది, ఆదరిస్తున్నది ఒకే ఒక పార్టీ, ఒకే ఒక్క నాయకుడు. ఆయనే తెలంగాణలో ఉన్నడు. ఆయనను ఆదరించాలని’ తమ ఓటు ఎవరికో కొందరు పరోక్షంగా, మరి కొంతమంది సూటిగా కారు గుర్తుకు అని చెప్పారు.
ప్రజల నాడి తెలుసుకునే క్రమంలో వాళ్లను ప్రశ్నించే సమయంలో గోరటి వెంకన్నతో కొందరు సెల్ఫీలు దిగారు. పదేండ్ల కింద మెదక్ జిల్లా సాంతం వలస పైనే ఆధారపడేది. హైదరాబాద్ దగ్గరగా ఉండటంతో కంపెనీల్లో చిన్నాచితక పనులు చేసుకొని పొట్ట పోసుకునేవారు. ఇప్పుడు మంజీరా నదిలో నిరంతరం నీరు పారుతుందేమో… నదితో పాటు పంటల సాగూ ఉన్నది. వలస వెళ్లినవారు వాపస్ రావడంతో ఈ నది పరీవాహక ప్రాంతం అంతా జన ప్రవాహం మళ్లీ తిరిగివచ్చింది. సాగులో మునిగితేలుతోంది. సరికొత్త జీవనాన్ని ప్రారంభించింది.
వాస్తవానికి ఈ రెండు అనుభవాలు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలకు సంబంధించినవి. రెండు ప్రాంతాలిప్పుడు జలకళను సంతరించుకొని ధాన్యపు రాసులతో కళకళలాడుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో వాతావరణ, జీవావరణ సమ్మిళిత అభివృద్ధి మానవీయ కోణంలో జరుగుతున్న తీరు కళ్లకు కట్టినట్టు కన్పించింది. బహుశా పదేండ్లలో వచ్చిన మార్పు ఇది. స్వయం పాలన సాధించిన విజయంగానే దీన్ని చూడాలి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
ఆస్కాని మారుతి సాగర్
90107 56666