రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ‘మేం అధికారంలోకి వస్తే మ్యానిఫెస్టోలో ఉన్నటువంటి స్కీంలను, అలాగే 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తాం’ అని వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటిపోయింది. కానీ 6 గారెంటీలు మాత్రం ఇంకా ఇంతవరకు పూర్తిగా అమలుకు నోచుకోలేదు.’
Congress | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో 5వ గ్యారెంటీ అయిన ‘విద్యార్థి యువ వికాసం’తో విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామని ప్రకటించింది. అలాగే ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తామని చెప్పింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ‘యువ వికాసం స్కీమ్’ గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
‘యువ వికాస పథకం’ ద్వారా ఫీజులు, కోచింగ్ ఫీజు చెల్లింపుల కోసం రూ.5 లక్షల గ్యారెంటీ కార్డు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. రాష్ట్రంలో ఏటా దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ, ఇంజినీరింగ్, వైద్య తదితర కోర్సుల్లో ప్రవేశం పొందుతున్నారు. ఈయేడు కూడా దాదాపు పూర్తికావస్తోంది. అలాగే ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని లక్షల మంది విద్యార్థులు బయటకు రాబోతున్నారు. కానీ ఇప్పటికీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందడం లేదు. దాదాపుగా రూ.7,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థి యువ వికాసంలో జమ చేస్తారా లేక విడిగానే ఇస్తారా.. అనే ఆందోళనలో విద్యార్థులున్నారు. విద్యార్థి యువ వికాసం కార్డ్ ఎలా ఇస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఈ కార్డుతో విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్లు తీస్తే వడ్డీ ఎవరు భరిస్తారన్నది ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యారంగం వైపు కన్నెత్తి కూడా చూడలేని స్థితి రాష్ట్రంలో ఉన్నది.
‘యువ వికాసం స్కీం’లో భాగంగా ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటుచేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ, అది ఏ మేరకు అమలుచేస్తారనేది అందరి మదిలో నెలకొన్నటువంటి ప్రశ్న? గత ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధి కోసం ‘మన ఊరు-మన బడి’ పథకాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రంలో 26,065 ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులు కల్పించింది. ఇందుకోసం బడ్జెట్లో రూ.7,289 కోట్లు కేటాయించింది. కానీ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం పూర్తి కాలేదు. రాష్ట్రంలో 600కు పైగా మండలాలున్నాయి. అయితే ప్రభుత్వం ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తుందా లేదా అనే సంశయం విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొంటున్నది. ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పెను సవాలుగానే మారనున్నది.
(వ్యాసకర్త: జర్నలిజం పరిశోధక విద్యార్థి, కేయూ)
దేవేందర్ ముంజంపల్లి
89784 58611