కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి రాయునది… గత కొన్నేండ్లుగా కేంద్ర ప్రాయోజిత పథకాలు (సీఎస్ఎస్) తామరతంపరగా పెరుగుతున్నాయి. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల కింద చేపడుతున్న ఈ పథకాల వల్ల ఆధార్ అనుసంధానిత ఖాతాల్లోకి వేస్తున్న మొత్తాలు కూడా అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్నాయి. 2014 లో సీఎస్ఎస్ నిధులు రాష్ర్టాలకు బదిలీ చేసిన స్థూలనిధుల్లో 7.5 శాతం మాత్ర మే. 2023-24 బడ్జెట్ అంచనాల్లో వీటి వాటా 48 శాతానికి పెరిగిపోయింది. ఇవి విచక్షణాధికార నిధులు. అంటే కేంద్రం తన సొంత నిర్ణయం మేరకు ఇచ్చేవన్న మాట. ఇందులో అత్యధికం వ్యక్తిగత లబ్ధిదారులకే ఇస్తున్నారు. ఇవి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న ఫలితంగా రాష్ర్టాలకు ఫైనాన్స్ కమిషన్ నియమాల ఆధారంగా ఇచ్చే నిధుల వాటా నామమాత్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే రాష్ర్టాలు అరకొర నిధులతో సరిపెట్టుకోవాల్సిన రోజు వస్తుంది. భారతదేశంలో తద్వారా సమాఖ్య విధానం సన్నగిల్లి కేంద్రాధిపత్యం పెరిగిపోతుంది. కేంద్రం ఏకపక్షంగా రూపొందించే సీఎస్ఎస్ పథకాల వల్ల రాష్ర్టాల ప్రత్యేక ప్రాధాన్యాలు ప్రాంతీయ వైవిధ్యాలు నిర్లక్ష్యానికి గురవుతాయి. రాజ్యాంగం ప్రకారం రాష్ర్టాలు, స్థానిక సంస్థలు నిర్వహించాల్సిన కీలక పాత్ర పక్కకు పోతుంది.
ఖాతాల్లోకే నేరుగా సొమ్ము జమచేసే (డీబీటీ) లావాదేవీలు అన్నీ కూడా లబ్ధిదారు ఆధార్ గుర్తింపు మీదే ఆధారపడి ఉంటా యి. 2017 జూలై 26న లోక్సభకు ప్రభుత్వం ఇచ్చిన సమాధా నం ప్రకారం 51 మంత్రిత్వ శాఖల కింద 314 సీఎస్ఎస్లు అమలవుతున్నాయి. 2023-23 ప్రకారం… సీఎస్ఎస్ల మొత్తం కేటాయింపు రూ.4,76,105 కోట్ల దాకా ఉన్నది. ఇక్కడ సంబంధిత మొత్తాలు సరైన ఖాతాల్లోకే చేరుతున్నాయా అనే ఓ సందేహం రాకమానదు. ఆధార్ లింకేజీ హ్యాకింగ్కు గురవుతున్న సంగతి తెలిసిందే. ఖాతాల్లో సొమ్ము పడితే లబ్ధిదారు దాన్ని వెంటనే సులభంగా పొందవచ్చా? లేక ఏదైనా మధ్యవర్తిత్వ వ్యవస్థ ఉన్నదా? నగదు పొందేందుకు లబ్ధిదారు సమయం, డబ్బు వెచ్చించాల్సి ఉంటుం దా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే అందుకు అవసరమైన సమాచార సేకరణ ఏదీ లేదు. చిట్టచివరి గమ్యస్థానం వద్ద పంపిణీ వ్యవస్థలోని లోటుపాట్లు సరిదిద్దేందుకు మొత్తం సీఎస్ఎస్ కేటాయింపుల్లో 0.5 శాతం వెచ్చించినా బాగుండేది.
పాడేరులో గిరిజనులు ఉపాధి హామీ పథకం కింద వచ్చే నగదు పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలపై లిబ్టెక్ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనం జరిపింది. ఉపాధి కూలీలకు చాలామందికి చదువురాదు. మొబైల్ ఫోన్లు ఉండవు. బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్లి నగదు తీసుకోవడమెలాగో తెలియదు. వెళ్లినా రోజుకూలీ నష్టపోవాల్సి వస్తుంది. మధ్యవర్తులను నమ్ముకుంటే వారికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. లిబ్టెక్ చేసిన ఈ తరహా సిఫారసులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అధ్యయనం చేస్తే మంచిది.
(వ్యాసకర్త: భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి)
-ఈఏఎస్ శర్మ