Minister KTR | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రగతిశీల విధానాలు, కల్పిస్తున్న అద్భుతమైన మౌలిక సదుపాయాలు, మన వద్ద ఉన్న నైపుణ్యం కలిగిన మానవ వనరులు అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ ముందుచూపు, చొరవతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్కు తరలి వస్తున్నాయి. ఇటీవలి కేటీఆర్ విదేశీ పర్యటనే దీనికి మరో నిదర్శనం.
హైదరాబాద్లో డాటా సెంటర్ల అభివృద్ధికి ఆరమ్ సంస్థ ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ సేవల సంస్థ స్టేట్స్ట్రీట్ హైదరాబాద్లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నట్టుగా తెలిపింది. అదనంగా మరో ఐదువేల మందికి ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్టుగా ప్రకటించింది. సొనాటా సాఫ్ట్వేర్ కంపెనీ త్వరలోనే నల్గొండ ఐటీ టవర్లో కార్యకలాపాలను ప్రారంభించనుంది. 200 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలను కల్పించనుంది.
రెండు వారాల పర్యటనలో వివిధ కంపెనీల యాజమాన్యాలతో 80కి పైగా సమావేశాలను నిర్వహించి తెలంగాణలో అమలు చేస్తున్న పారిశ్రామిక, ఐటీ విధానాలను మంత్రి కేటీఆర్ వివరించారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఐటీ, ఐటీ ఆధారిత రంగాలు, మీడియా, ఎంటర్టైన్మెంట్, ఏరోస్పేస్, రక్షణ, లైఫ్ సైన్సెస్, మెడికల్ డివైజెస్, డిజిటల్ సొల్యూషన్స్, ఇన్నోవేషన్ డేటా సెంటర్, ఆటోమోటివ్, ఈవీ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీలను కేటీఆర్ ఒప్పించారు. ఈ పెట్టుబడులతో రానున్న కాలంలో తెలంగాణలో సుమారు 42 వేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయి.
హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసేందుకు లండన్ స్టాక్ ఎక్సేంజీతో అంగీకారం కుదిరింది. స్టాక్ ఎక్సేంజీ గ్రూప్ సీఐఓ అంథోనీ మెక్ కార్తీతో కేటీఆర్ సమావేశమై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఏడాదిలోనే వెయ్యి ఉద్యోగాలు రానున్నాయి. 1801లో లండన్లో ఏర్పాటైన ఈ సంస్థ తెలంగాణకు రావడం చరిత్రలో నిలిచిపోనుంది. స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్ సంస్థ ప్రొడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు డీఏజెడ్ఎన్ గ్రూపు ప్రధాన టెక్నాలజీ అధికారి సందీప్ టికు మంత్రి కేటీఆర్తో ఒప్పందం చేసుకున్నారు. క్రీడల లైవ్ స్ట్రీమింగ్లో ఈ సంస్థ అగ్రగామి. ఈ సంస్థ ఏర్పాటు చేసే కేంద్రంలో సుమారు వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
కెమికల్స్ తయారీ సంస్థ క్రోడా ఇంటర్నేషనల్ హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక గ్లోబల్ టెక్నికల్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. గ్రీన్జెట్స్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా డ్రోన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. బ్రిటన్లో లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూపు అతి పెద్ద ఆర్థిక సేవల సంస్థ. ఈ కంపెనీ మన రాష్ట్రంలో పెట్టుబడులు
పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది.
అమెరికాకు చెందిన ప్రఖ్యాత మీడియా, ఎంటర్టైన్మెంట్ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హైదరాబాద్లో తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీని వల్ల మొదటి ఏడాదిలోనే 1200 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. న్యూయార్క్లో మంత్రి కేటీఆర్తో ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండ్రా కార్టర్ సమావేశమై ఈ వివరాలు వెల్లడించారు. వైద్య పరికరాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెడ్ట్రానిక్స్ సంస్థ రాష్ట్రంలో రూ.3వేల కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. హైదరాబాద్లో ఈ కంపెనీ ఆర్అండ్డీ కేంద్రం విస్తరణతో ఐదేండ్లలో 1500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దిగ్గజ బయోటెక్నాలజీ కంపెనీ జెనెసిస్ రాష్ట్రంలో రూ.497 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే ఈ సంస్థ జీనోమ్ వ్యాలీలో రూ.415 కోట్ల పెట్టుబడి పెట్టింది.
మొబైల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన కంపెనీ ఫాక్స్కాన్ టెక్నాలజీస్. తైవాన్కు చెందిన ఈ సంస్థ సుమారు రూ.4,114 కోట్ల పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. రాష్ట్ర ప్రభుత్వం 196 ఎకరాల స్థలాన్ని రంగారెడ్డి జిల్లా కొంగర్కలాన్లో కేటాయించడంతో ఇప్పటికే శంకుస్థాపన జరిగింది. తయారీ కేంద్రం ప్రారంభమైతే ప్రత్యక్షంగా 35 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు 27 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. ఆహారశుద్ధిలో రూ.7 వేల కోట్లను పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటితో దాదాపు 58 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఫ్రెంచ్-అమెరికన్ ఆయిల్ గ్యాస్ దిగ్గజ కంపెనీ టెక్నిప్ ఎఫ్ ఎంసీ తొలిదశలోనే రూ.1250 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు ముందుకొచ్చింది. అమెరికాలోని హ్యూస్టన్లో ఆ సంస్థ క్యాంపస్లో మంత్రి కేటీఆర్తో కీలక భేటీ జరిగింది. 3500 మందికి ఉద్యోగాలను కల్పించనుంది. దీంతోపాటు మరో మ్యాన్యుఫాక్చరింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించింది. ఐదేండ్లలో మరో వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. అల్లియంట్ గ్రూపు గ్లోబల్ కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సంస్థ. మంత్రి కేటీఆర్తో ఆ గ్రూపు సీఈఓ ధవల్ జాదవ్ భేటీ అయ్యారు. హైదరాబాద్లో తమ సంస్థను విస్తరించనున్నట్టుగా ధవల్ ప్రకటించారు. దీనివల్ల 9 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
కేటీఆర్ వంటి యువమంత్రి తెలంగాణకు ఉండటం గొప్ప వరం. ఐటీ, పారిశ్రామిక రంగాల అభివృద్ధిపై తనకున్న అవగాహనతో దిగ్గజ కంపెనీలను తెలంగాణకు రావటానికి ఒప్పిస్తున్నారు. మంత్రి కృషి వల్ల యువతకు భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. కేటీఆర్ చేపట్టే ప్రతి విదేశీ పర్యటన తెలంగాణకు వరంగా మారుతున్నది.
(వ్యాసకర్త: అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ)
-డా.ఎన్.యాదగిరి రావు
97044 05335