సాధారణంగా నాటికలు, నాటకాలు, హరికథలు మొదలైన ప్రజా కళారూపాలు ప్రజలకు కాలక్షేపంతో పాటు, ఆనందాన్ని కలిగిస్తాయి. వినోదాన్ని పంచుతాయి. వాటిలోని కథ, కథనాలు.. చరిత్రను, సంస్కృతిని మర్మగర్భంగా అందిస్తాయి. పురాణాలు, చారిత్రక సన్నివేశాలను వివరించేటప్పుడు కాలానుగుణంగా కథ, కథనాల్లో కొంత మార్పులు, చేర్పులు చేయటం సహజమే. కథను ఉన్నది ఉన్నట్టుగా చూపించటం అన్నివేళలా సాధ్యం కాదు కూడా. ఇక రేడియో, టీవీ, సినిమాల విషయానికి వచ్చేసరికి అంతా మారిపోయింది. సాంకేతిక యుగంలో సినిమాలు కాసులు దండుకునే ఓ వస్తువుగా పరిణమించింది. ఎవరికి తోచినట్టువారు చరిత్రను చూపించడం పరిపాటిగా మారిపోయింది.
Razakar | ఇటీవల విడుదలైన వివాదాస్పద సినిమా రజాకార్ చరిత్ర కోణంలోనిదే. నిజాం పాలనలో ఖాసీం రజ్వీ నాయకత్వంలోని కిరాయి ‘రజాకార్’ సాయుధ దళం చేసిన దుర్మార్గాలే ఈ సినిమా కథ. అయితే అప్పుడెప్పుడో జరిగిన ఆ ఘటనలను ఇప్పుడు తవ్వి తీయటం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో అందరికీ తెలిసిందే. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈ సినిమాను దేశమంతటా వివిధ భాషల్లో ప్రదర్శించి.. హిందూ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి, గంపగుత్తగా వారి ఓట్లను కొల్లగొట్టాలన్నదే సినిమా ప్రధాన లక్ష్యం. ముస్లిం పాలకులు, రజాకార్ సైన్యం చేసిన దుర్మార్గాలను ఎక్కువగా చిత్రీకరించి, వాటిని చూపించి.. ముస్లింలంతా దుర్మార్గులేనన్న ‘నెరేటివ్’ను చూపెట్టడమే ఈ సినిమా అసలు ఉద్దేశం.
తెలంగాణ సాయిధ పోరాటం నేపథ్యంలో వచ్చిన మరో సినిమా ఇది. గతంలో నరసింహారావు నిర్మించి, దర్శకత్వం వహించిన ‘మా భూమి’ అందరినీ అలరించింది. రజాకార్ సినిమా అప్పటి ‘మా భూమి’ని మరిపిస్తుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ఈ సినిమాను చూస్తే.. ‘చరిత్రను విస్మరించేవారు చరిత్రను నిర్మించలేరు’ అని అంబేద్కర్ చెప్పిన మాటలు గుర్తుకువస్తున్నాయి. చరిత్ర ఆధారంగా రూపొందే సినిమాలు సినిమాటిక్గా ఉండేందుకు కథ, కథనాల్లో కొంతమేరకు మార్పులు, చేర్పులు చేస్తే మంచిదే. కానీ, పూర్తిగా చరిత్రను వక్రీకరించడం, గత చరిత్రను పూర్తిగా విస్మరించడం సరికాదు. రజాకార్ సినిమాలో అదే జరిగింది. ఈ సినిమాలో చరిత్రను పూర్తిగా విస్మరించడమే కాదు, వాస్తవ చరిత్రను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారు. గత చరిత్రను, సంఘటనలను, వ్యక్తులను, వారి పాత్రలను సమూలంగా చెరిపివేసే ప్రయత్నం చేశారు. దేశవ్యాప్తంగా హిందూ, ముస్లిం సోదరుల మధ్య ఉన్న మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా సినిమాను చిత్రీకరించారు.
బీజేపీ రాజకీయ సిద్ధాంతాలకు అనుగుణంగా గతంలో వచ్చిన కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ సినిమాల మాదిరిగానే రజాకార్ సినిమాను తీశారు. ఈ సినిమాలో ప్రధానంగా చెప్పదలచిన విషయం ఏమిటంటే.. చనిపోయేవారంతా హిందువులు, చంపేవారంతా క్రూరమైన ముస్లింలు అని. చరిత్రలో జరిగిన కొన్ని దురదృష్టకరమైన ఘటనలను మొత్తం ముస్లిం సమాజానికి ఆపాదించడం తగదు. సినిమాలో చూపించిందే నిజమైతే? షోయబుల్లాఖాన్ను చంపిందెవరు? రజాకార్లు కాదా?
బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1836-60 మధ్యకాలంలో రాంజీ గోండు నాయకత్వంలో జరిగిన తిరుగుబాటును మత మార్పిడులకు వ్యతిరేకంగా హిందువులు చేసిన పోరాటంగా చిత్రీకరించడం చారిత్రక తప్పిదం కాదా? బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన రాంజీ గోండు పోరాట కథను నిజాం వ్యతిరేక పోరాటంలో మిళితం చేయటం ఏ విధంగా సబబు అవుతుంది. ఇలాంటి ఊహాకల్పనలను చరిత్రకు ఆపాదించటం సరైనది కాదు.
తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలోనే అరుదైన పోరాటంగా పేరుపొందింది. దీనిపై ఎన్నో పుస్తకాలు, కథలు, పాటలు, కళారూపాలు, పోరాట యోధుల జీవిత చరిత్రలు వెలువడ్డాయి. అవి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఆనాడు ప్రత్యక్షంగా పోరాడినవారు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఉన్నాయి. కానీ వాటిని దర్శక, నిర్మాతలు ఏమాత్రం పట్టించుకోలేదు. నాటి ఉద్యమం గురించి వారు కనీసం తెలుసుకొనే ప్రయత్నం కూడా చేసినట్లు కనిపించడం లేదు. పైగా ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువులు పోరాటం చేశారనే కల్పిత కథనాన్ని జోడించారు. ఇందులోని సంభాషణలు కూడా అసత్యాలే.
తెలంగాణ సాయుధ పోరాటంలో కుల, మతాలకతీతంగా జరిగిన పోరాటాన్ని విస్మరించి సర్దార్ వల్లభభాయ్ పటేల్ను హీరోగా చేసి చూపెట్టారు. మొత్తం సినిమా కథనం అంతా ఆయన చుట్టే తిరిగేలా చూపెట్టారు. అసలైన చరిత్ర ఏమిటంటే.. మాతృభాష పరిరక్షణ కోసం, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన గెరిల్లా యుద్ధమే తెలంగాణ సాయుధ పోరాటం. ‘దొర ఏందిరో.. నీ దొరతనమెందిరో’ అంటూ నాటి కమ్యూనిస్టు యోధులు చేసిన యుద్ధాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారు.
ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం నిజాం పెత్తందారీతనానికి, ఆయన అడుగులకు మడుగులొత్తిన భూస్వాముల దోపిడీకి, జమిందారీ గడీల నిరంకుశత్వానికి, వెట్టిచాకిరి, బానిస వ్యవస్థలకు, పాలేగాళ్లకు, దేశముఖ్లకు, ఇనాందార్లకు, తాబేదార్లకు వ్యతిరేకంగా జరిగింది. ఆనాడు ప్రజలు ‘ఆంధ్రా మహాసభ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారే గానీ, ‘వైదిక మతం జిందాబాద్’ అని ఎక్కడా నినదించలేదు.
అయినా ఈ సినిమాలో ‘వైదిక మతం జిందాబాద్’ అంటూ నినాదాలు చేసినట్లు చూపడం చూస్తుంటే.. కావాలనే ఒక రాజకీయ పార్టీకి రాబోయే ఎన్నికల్లో లబ్ధి చేకూర్చడం కోసమే సినిమాను తలకెత్తుకున్నట్టు అనిపిస్తున్నది. ‘మనుషులను చంపగలరు కానీ.. మా మతాన్ని, హిందువులను చంపలేరు’ అనే డైలాగ్ను కావాలనే చొప్పించారు. విసునూరు రామచంద్రారెడ్డి గుండాలు చంపిన షేక్ బందగి, రజాకార్లు చంపిన జర్నలిస్టు షోయబుల్లాఖాన్లను చరిత్ర మరిచిపోదు. నాటి రజాకార్ల సైన్యానికి అధ్యక్షుడు ఖాసీం రజ్వీ అయితే, దానికి ఉపాధ్యక్షుడు విసునూరు రామచంద్రారెడ్డి అనేది జగమెరిగిన సత్యం.
నాటి పోరాటంలో ప్రాణత్యాగాలు చేసిన కమ్యూనిస్టుల గురించి, ప్రజా నాయకుల గురించి, కవులు, రచయితలు, కళాకారులు, యువజనులు, మహిళా నేతల గురించి మచ్చుకైనా చూపించలేదు. కమ్యూనిస్టులు భూసంస్కరణలు అమలుచేసి సుమారు 12 లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంచారు. వెట్టిచాకిరిని, బానిసత్వాన్ని రద్దు చేశారు. భూస్వాముల బీరువాల్లో దాచిన రుణపత్రాలను కుప్పపోసి తగులబెట్టారు. అప్పులు, వడ్డీలు ఒక్క దెబ్బతో రద్దయ్యాయి. స్త్రీలకు సమాన హక్కులు కల్పించారు. కుల, మత వివక్ష లేకుండా కలిసికట్టుగా ప్రజలు జీవించే నేపథ్యాన్ని ఆనాటి నేతలు ప్రోదిచేశారు. తదుపరి కాలంలో ఈ సాయుధ పోరాట అనుభవాలు అనేక ప్రజా పోరాట ఉద్యమాలకు బాటలు వేశాయి. ఒక ధైర్యాన్ని, ప్రేరణను ఆ పోరాటం తెలంగాణ ప్రజలకు ఆయుధంగా ఇచ్చింది.
కమ్యూనిస్టు పోరాటం వల్లనే గ్రామాల్లో పీడన, బానిసత్వం నుంచి ప్రజలు విముక్తి పొందారు. కుండల్లో కారం, చీపిరి కట్టలు, రోకళ్లు మహిళల చేతుల్లో ఆయుధాలుగా మారాయి. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, కాళోజీ, దాశరథి తదితరుల కవితలు, ఉపన్యాసాలు, మాటలు, చేతలు తిరుగుబాటుకు ప్రేరణను ఇచ్చాయి. దున్నేవాడిదే భూమి అనే నినాదం గ్రామీణ ప్రజల్లో చైతన్యం తెచ్చింది. దొరల దోపిడీకి వ్యతిరేకంగా భూస్వాములపై ఎర్రజెండా నీడలో సామాన్య ప్రజలు పోరాటం చేశారు. ఆ మట్టి మనుషుల త్యాగాలను ఈ సినిమాలో చూపెట్టలేదు. పైగా సంకుచిత బుద్ధితో చరిత్రను వక్రీకరించి చూపించారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచిత పాత్ర పోషించిన దొడ్డి కొమురయ్య, బద్దం ఎల్లారెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, మఖ్దుమ్ మొయినుద్దీన్, మల్లు స్వరాజ్యం, ధర్మ బిక్షం, బెల్లంకొండ సత్తయ్య, కాళోజీ, దాశరథి సోదరులు మొన్నమొన్నటి వరకు వారి అనుభవాలను తమ రచనల్లో నిక్షిప్తం చేశారు. వారి అనుభవాలను, జ్ఞాపకాలను అనేక వేదికలపై పంచుకున్నారు. వారి జీవిత చరిత్రలు, వారు రాసిన కవితలు, పుస్తకాలను క్షుణ్ణంగా చదివినవారు, ఆనాటి ప్రజా నేతలు మాటలు, ఉపన్యాసాలు ప్రత్యక్షంగా విన్నవారి మెదళ్లలో తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర పదిలంగా, తాజాగానే ఉన్నది. కానీ, ఈ సినిమాలో ఆనాటి త్యాగాలను చూపకుండా మత దృష్టితో చరిత్రను వక్రీకరించడం విషాదం.
డాక్టర్ కోలాహలం రామ్కిశోర్
98493 28496