(నేడు రావెళ్ల వెంకట రామారావు జయంతి)
తెలంగాణ తొలి గేయ రచయిత, సాయుధ పోరాట యోధుడు రావెళ్ల వెంకట రామారావు. ఒక చేత తుపాకీతో సాయుధ పోరాటం చేస్తూ, మరోచేత కలంపట్టి నిజాం వ్యతిరేక రచనలు సాగించిన సవ్యసాచి.
భూమి కోసం, భుక్తి కోసం, నిజాం రాచరిక పాలన అంతం కోసం తుపాకీ పట్టి దళకమాండర్గా పని చేసి ప్రత్యర్థులను గడగడలాడిం చిన ధీశాలి ఆయన. 1960లో ‘జీవనరాగం’ అనే ఖండకావ్యంలో రావెళ్ల రాసిన ‘మాతృగీతిక’ పాట..
‘కదనాన శత్రువుల కుత్తుకల నవలీల
నుత్తరించిన బలోన్మత్తు లేలిన భూమి
వీరులకు కాణాచిరా తెలగాణ
ధీరులకు మొగసాలరా’
పోరాట గీతమై నిలిచింది. రావెళ్ల ఉద్వేగ స్వరంనుంచి వెలువడిన ఈ గేయం 1969 తొలిదశ ఉద్యమంలో లక్షలాది హృదయాల్లో ప్రతిధ్వనించింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ పాట గొప్పదనాన్ని ఆచార్య జయశంకర్ వివరించేవారు. ప్రముఖ గాయకుడు దేశపతి శ్రీనివాస్ వేలాది సభల్లో పాడి ఉద్యమానికి కొత్తశక్తిని అందించారు.
ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, గోకినేపల్లిలో 1927 జనవరి 31న రావెళ్ల జన్మించారు. విద్యార్థిదశలోనే 1944లో ఆంధ్ర మహాసభలో చేరిన రావెళ్ల, ఆనాటి రజాకార్ల దమన కాండను చూసి గన్నునూ, పెన్నునూ ఆయుధాలుగా వాడుకొంటూ సమరరంలో పాల్గొన్నారు. నాటి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, నవ భారత, స్వతంత్ర భారత పత్రికలలో అభ్యుదయ, జానపద శైలిలో రచనలకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీ కేంద్ర కారాగారంలో ప్రముఖ కమ్యూనిస్టు నేత ఇంద్రజిత్ గుప్తా, మణిపూర్ మాజీ సీఎం దశరథ్ దేవ్ తదితరులు రావెళ్లకు సహచరులుగా ఉన్నారు.
1947లో జయశ్రీ అనే కలం పేరుతో తొలుత రచనలు మొదలు పెట్టిన రావెళ్ల అనంతరం పురాతన్, క్రిషిక్, తెలంగాణ్యుడు, ఆర్.వి.ఆర్. అనే పేర్లతో ఎన్నో రచనలు చేశారు. తన ఇంటినే ఓ కవితా కుటీరంగా మలుచుకున్నారు. రాగజ్యోతులు (గేయసంపుటి), జీవనరాగం (ఖండకావ్యం) నవ ప్రచురణలు (కవిత్వం), అనలతల్పపు (గేయకవిత్వం), పల్లెభారతి (పాటలు), తాండవహేల (శివస్తవ రూపక కావ్యం) రచనలు చేశారు. రావెళ్ల చేసిన సాహిత్యసేవకు గుర్తింపుగా గురజాడ సాహితీ అవార్డ్, దాశరథి సాహితీ పురస్కారం, జాషువా సాహితీ అవార్డులు పొందారు. పోరాటాన్నే ఊపిరిగా మలచుకుని ప్రజల కోసం జీవించిన రావెళ్ల 2013 డిసెంబర్ 10న తనువు చాలించారు.
సాయి లోహిత పులపా