Privatisation | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు దారులు తెరుస్తున్నది. తద్వారా సంక్షేమ రాజ్యం అనే భావనకు తూట్లు పొడుస్తున్నది. ఆత్మనిర్భర్ భారత్ అంటూనే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిన తర్వాత ప్రభుత్వ రంగాన్ని విచ్ఛిన్నం చేస్తూ సంక్షేమ రాజ్యాన్ని నిర్వీర్యం చేయ చూస్తున్నది.
బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రణాళిక అమలు కోసం ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంక్తో కలిసి పని చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్ వారికి అప్పగించాలనేది ప్రభుత్వ సంకల్పం. ఇది భారతదేశాన్ని బ్యాంకుల జాతీయీకరణ కన్నా ముందు కాలానికి తీసుకెళ్తుంది. దీనివల్ల అసమానత, పేదరికం పెంచడంతోపాటు సంపద, ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణను కొంతమంది చేతుల్లోకి తీసుకువెళుతుంది.
2014 నుంచి ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణించడం, దాని మూలాలు దారుణంగా బలహీనపడడం ప్రభుత్వ వ్యవస్థను ప్రైవేటీకరించే కుట్రలో భాగమే. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేయడం ద్వారా ఈ ప్రక్రియ మరింత వేగవంతంగా జరుగుతుంది. ప్రభుత్వ రంగాన్ని పణంగా పెట్టి ప్రైవేటు, కార్పొరేట్ రంగాలను బలోపేతం చేసేందుకు చేపట్టే ఇటువంటి చర్యల వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ, సమాజంపై ప్రతికూల ప్రభావాలు తీవ్రంగా ఉంటాయి.
మార్కెట్ శక్తులు, ప్రైవేట్ రంగం, కార్పొరేట్లకు అవకాశం కల్పించడం వల్ల భారతీయ పౌరులకు సామాజిక, ఆర్థిక న్యాయం అందించే రాజ్యాంగ దృష్టి ప్రమాదంలో పడింది. రైల్వేలు, బ్యాంకులు, నవరత్న కంపెనీలతో కూడిన ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ దూకుడు పాలన ప్రభావితం చేస్తున్నది. ఆ ప్రభావం రాజ్యాంగం కల్పించిన సామాజిక, ఆర్థిక న్యాయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నది. ఆందోళన కలిగించే విషయమేమిటంటే, కులం, మతం, ప్రాంతం, లింగం తేడాల పేరుతో ఇప్పటికే చీలిపోయిన భారతీయ సమాజానికి ఆర్థిక అసమానతలు కూడా జోడించబడుతాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటీకరణ అనేది రిజర్వేషన్ విధానంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగులకు ప్రభుత్వ రంగంలో విద్యా, ఉపాధి అందకుండా చేస్తుంది. ఇక ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలనే చట్టం ఏదీ లేదు. ఇది సామాజిక న్యాయానికి ముగింపు పలికే ప్రయత్నం. ప్రైవేటీకరణపై ఆధారపడిన ఆర్థిక ప్రక్రియ ప్రస్తుత లోపాలను, కులం, పితృస్వా మ్యం, లింగం వంటి నిర్మాణాత్మక రూపాలను తీవ్రతరం చేసే సంక్షోభాలను సృష్టిస్తుంది.
2008లో యూఎస్ఏలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిన సందర్భం లో ప్రభుత్వ రంగ సంస్థలు , ప్రభుత్వ రంగ బ్యాంకుల పునరుద్ధరణతో భారతదేశం సంక్షోభాన్ని తట్టుకోగలదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థ లు, బ్యాంకులను ప్రైవేటీకరించడం ద్వారా మోదీ పాలన భారత దేశాన్ని బహుళ సంక్షోభాలకు మరింత చేరువ చేస్తున్నది. ఇది ఆర్థి క, రాజకీయ సంక్షోభాలను తీవ్రతరం చేస్తున్నది. భారతదేశాన్ని ప్రపంచ శక్తుల నియంత్రణకు సులభమైన లక్ష్యంగా చేస్తున్నది. భారతదేశం తన ఆర్థిక పరపతిని కోల్పోతుంది. ప్రజలు మరింత పేదరికం, తీవ్రమైన కష్టనష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.
భారతదేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులను నియంత్రించే నియంత్రణ యంత్రాంగాలు దేశాన్ని సంక్షోభాలనుంచి గట్టెక్కిస్తున్నాయి. ఇవి దేశాన్ని స్వేచ్ఛగా ఉంచడంలో ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగి ఉన్నాయని ప్రముఖ ఆర్థికవేత్త జోసెఫ్ స్టిగ్లిట్జ్ చెప్పారు. మోదీ పాలన ఉద్దేశపూర్వకంగా ఇటువంటి వివేకవంతమైన విషయాలను విస్మరించి, విధానపరమైన లోపాలతో ముందుకు సాగుతున్నది, ఇది భారత ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తుంది. మొత్తం సమాజానికి కీడు చేసే పరిణామాలకు దారి తీస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా, కొవిడ్ మహమ్మారి విజృంభన సమయం లో ప్రభుత్వ దవాఖానలు, ప్రభుత్వ సంస్థలు తక్కువ ఖర్చుతో ప్రజలను రక్షించడానికి ముందుకు వచ్చాయి.ప్రభుత్వ రంగం దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. కానీ ప్రభుత్వ రంగా న్ని బలోపేతం చేయడానికి బదులు, దానిని నిర్వీర్యం చేసే ఘోరమైన తప్పిదానికి మోదీ సర్కార్ పాల్పడుతోంది. ఇది మొత్తం దేశానికే ప్రాణాంతకం.
గ్రామీణ, పట్టణ ప్రాంత శ్రామిక ప్రజలు మోదీ పాలన కొనసాగింపును తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. దేశం ఆర్థిక, సంక్షేమ రాజ్యంగా కొనసాగాలంటే మోదీ నుంచి దేశాన్ని రక్షించాలని కోరుకుంటున్నారు. రాజ్యాంగాన్ని, దేశా న్ని కాపాడేందుకు సైద్ధాంతిక రాజకీయ నిబద్ధత కలిగిన రాజకీయ పా ర్టీలు ఏకతాటిపైకి రావాలని కోరు తున్నారు. దేశాన్ని ప్రైవేట్ పెట్టుబడి దారుల నుంచి రక్షించుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు, సామాజికవేత్త లు, ఆర్థిక రంగ నిపుణులు ఒక్కటి కావాలని సూచిస్తున్నారు.
(వ్యాసకర్త: రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్, సింగరేణిభవన్ )
-దండంరాజు రాంచందర్ రావు
9849592958