‘ఉండబట్ట లేక ఓటేస్తే.. ఉన్న బట్టా లాక్కున్నట్టు..’ అని తెలంగాణ ప్రజా కవి చెరబండరాజు అన్నట్టుగానే రాష్ట్ర ప్రజలు అవస్థల వలయంలో చిక్కిపోయారు. జిరాక్స్ సెంటర్ల వద్ద భారీ క్యూలైన్లో నిలబడి కూలబడిపోతున్నారు. ఆరు గ్యారెంటీల కోసం గ్రామాలన్నీ హస్తం పార్టీ నాయకుల ఇండ్ల చుట్టూ బొంగరంలా తిరుగుతున్నాయి. వెరసి హస్తం పార్టీ ప్రభుత్వ ‘ప్రజా పాలన’ కాస్తా ‘ప్రజా వేదనగా’ మారిపోయింది. అసలు ఆరు గ్యారెంటీల అర్హులను గుర్తించేందుకు ఇంత హంగామా ఎందుకు? ఆరు గ్యారెంటీల అమలుకు అవసరమైన లబ్ధిదారుల సమాచారం మొత్తం ప్రభుత్వ శాఖల వద్ద అందుబాటులో ఉండగా, దండగమారి దరఖాస్తుల ప్రహసనం నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితనం చూసి ప్రజలు జోకులు పేలుస్తున్నారు.
పరమ శివుడి ఫొటో, కైలాసం చిరునామాతో దరఖాస్తులు అందజేస్తున్నారు. వివరాల నమోదులో విచిత్రమైన సమాచారం రాస్తూ, ప్రజా పాలనపై జనాలు ఏమనుకుంటున్నారో చెప్పకనే చెప్తున్నారు. ఖజానా ఖాళీ కుండ అని నిందలేస్తూ, నెల పాలన అవసరానికే దాదాపు రూ.9 వేల కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ సర్కార్. తెలంగాణ పరువును జాతీయ, అంతర్జాతీయ ఆర్థికసంస్థల ముందు సీఎం స్వయంగా దిగజారుస్తూ, ఏ ఆసరాతో లక్ష కోట్ల అదనపు భారం పడే ఆరు గ్యారెంటీలను అమలు చేయగలరు? హామీల మత్తు మందును ఊరూరా చల్లి, ఓట్లను కొల్లగొట్టిన హస్తం పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ‘ఓ స్త్రీ రేపు రా’ తరహా తలుపు మీద రాతలా మారింది.
దారిద్య్రరేఖ దిగువనున్న నిరుపేదల వివరాలు, అభివృద్ధి పథకాల అర్హుల సమాచారం ఉండగా, వెంటనే అమలుచేస్తామన్న హామీలను అమలు చేయకుండా ఈ దరఖాస్తుల నాటకాలెందుకు? జనాల బతుకు ఆశల పత్రాలను పప్పు బెల్లం పొట్లాలుగా ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడంలో అర్థం ఉన్నదా? నిత్యం కంచెలు, కరెంటు, కాళేశ్వరం, ఖజానాపై విషం చిమ్మడానికే పరుగులు పెడుతూ, ప్రభుత్వాన్ని ప్రతికారేఛ్చకు కాంగ్రెస్ సర్కార్ పావుగా మార్చుకుంటున్నది. నిన్నటిదాకా మోపిన నిందలను నిజమని చూపేందుకు, హామీల అమలుకోసం ఎదురుచూస్తున్న ప్రజల దృష్టిని మళ్లించేందుకు నెల రోజులుగా నానా తంటాలు పడుతున్న ముఖ్యమంత్రిని, మంత్రి మండలిని చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. గరీబీ హఠావో నినాదం ఇచ్చి, మరోవైపు నీరు పోసి దారిద్య్ర వనాన్ని దేశమంతా పెంచిన చరిత్ర కాంగ్రెస్ది. అదే వారసత్వ చరిత్ర చేయందుకొని, నోటితో చెప్పి నొసలుతో వెక్కిరించినట్టుగా తెలంగాణ ప్రజలతో చెలగాటమాడుతున్నది రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం.
నెల రోజుల కాంగ్రెస్ సర్కార్ ముప్పుతిప్పల పాలన, ప్రచారంలో రామచిలుకలా, పాలనలో పిశాచిలా ప్రవర్తిస్తున్న తీరు బుద్ధి జీవులందరికీ ఆవేదన కలిగిస్తున్నది. హామీలతో మునగచెట్టు ఎక్కించిన జనాలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నది. సహవాస దోషమో ఏమో కానీ సీఎం రేవంత్ రెడ్డికి ప్రపంచ బ్యాంకు తెలివితేటలు బాగానే అబ్బాయి. ప్రగతిభవన్ పేరు మార్చి, పూలే ప్రజా భవన్ అని నామకరణం చేసి, దాన్ని డిప్యూటి సీఎం భట్టికి కేటాయించి, పూలే పేరున్న భవనంలో తనుండలేననే సంగతి చెప్పకనే చెప్పేశారు. పైగా ఆ భవన్ వాస్తు భట్టికి కలిసొచ్చి ఏ అనుకూల ప్రయత్నాలైన మొదలు పెడతాడేమో ననే అనుమానంతో నమ్మకమైన సీతక్కను ద్వారం దగ్గరనే సీఎం కాపలా పెట్టేశారు.
ఇంకా విచిత్రమేమంటే సీఎం ఉండే భవనానికి రక్షణ ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉంటాయి. రేవంత్రెడ్డి ఆ భవన్లోనే ఉండనప్పుడు అక్కడ కంచెలెందుకు? అయినా వాటిని తొలగించి, సంకెళ్లు విడిపించానని ప్రచారం చేసుకోవడం ఎంత తెలివో కదా? మరోవైపు ప్రజా భవన్ ప్రజలకు అందుబాటులోకి అనే నినాదం ఇచ్చి, ప్రజా దర్బార్ను మళ్లీ మొదలు పెడుతున్నామని ప్రకటించి, నాలుగైదు రోజులు మీడియాలో ఊరేగి, తర్వాత అధికారులతోనే ప్రజావాణిని సాగించడం హాస్యాస్పదమే. మాటలు కోటలు దాటిస్తూ, చేతలు మాత్రం చెవిలో పువ్వులు పెట్టడానికేనన్నట్టుగా రేవంత్రెడ్డి ప్రభుత్వ పనులున్నాయి. ప్రతి అడుగులో ప్రచార యావ తప్ప ప్రజాకోణం ఇసుమంతైన కానరావడం లేదు.
గులాబీ పార్టీది దుబారా సర్కార్ అని నిందమోపి, హస్తం పార్టీ సర్కార్ మాత్రం దినపత్రికలలో భారీ ప్రకటనలివ్వడం పొదుపవుతుందా? ఫామ్హౌజ్ పర్యటనలకు ప్రజాధనం దుర్వినియోగమైందని అభాండాలేసి, నెలరోజుల్లోనే ఆరుసార్లు ఢిల్లీ పర్యటనలు చేయడం కాసులు కూడబెట్టే పనులేనా అనేది ప్రజలకు అర్థమైపోతున్నది. కాన్వాయ్ కార్లయినా, ట్రాఫిక్ నిలుపుదలైనా ఇలా ఏదైనా మీడియాకు మసాలా, సీఎం రేవంత్ రెడ్డికి ఉండితీరాలన్నట్టుగానే ఉన్నది కదా? ప్రజల కోసం తపన పడే నాయకులు పనికిమాలిన అంశాలపై దృష్టి నిలపరు. పగ చుట్టూ ఫ్యాక్షన్ సర్కార్ను నడిపించాలని అసలుకే అనుకోరు. మరి రేవంత్రెడ్డి సర్కారు చర్యలను చూసిన తర్వాత ఏమనుకోవాలో ఆలోచనాపరులందరూ అర్థం చేసుకోవాలి.
ప్రజా పాలనగా గుండెల్లో ఉండాలంటే, గత పాలనలో మంచిని కొనసాగిస్తూ, దానికి మించిన, మరింత తోడ్పాటును ప్రజలకు అందించాలి.
మార్పు అంటే రద్దులు, దర్యాప్తులు కాదు. అధికార పార్టీలో, నేతల్లో హుందాతనం అనేది నిండుకుండలా నడువాలే కానీ, నడమంత్రపు సిరిలా దుందుడుకుతనం కాంగ్రెస్ పార్టీనే దెబ్బ తీస్తుంది. రైతుభరోసా రూ.15 వేలు వేయడానికి, రైతుబీమా చెక్కులివ్వడానికి, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంచడానికి ఏ డాటా కావాలో? పండించిన వరి పంట, క్వింటాలు మద్దతు ధరకు అదనంగా రూ.500 అందివ్వడానికి అడ్డుపడే అంశాలేం లేవు కదా? ఇలా 420లో తక్షణమే అమలుకు అవకాశం ఉన్న హామీలు ఎన్నో ఉన్నా, అమలుపరచకుండా అందరితో ఆడుకోవడం విడ్డూరం.
చివరికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కూడా సరిగ్గా అమలు చేయకుండా ఆర్టీసీ బస్సులను గాంధీభవన్లాగా మార్చివేసి తన్నులాట తమాషా చూస్తున్నారు. ప్రజా పాలనలో వైఫల్యాలను, విజిలెన్స్, సిట్టింగ్ జడ్జి దర్యాప్తు మసాలా వార్తలతో ఎన్నో రోజులు దాచిపెట్టడం సాధ్యం కాదు. యూపీఎస్సీ పనితీరును ముఖ్యమంత్రి, మంత్రి గంటలోనే అధ్యయనం చేసి, ఔపోసన పట్టే మేధస్సు ఉన్నప్పుడు, టీఎస్పీఎస్సీకి సంబంధం లేని ఇతర సర్కార్ భర్తీ ఏజెన్సీల నోటిఫికేషన్లకు సమయమెందుకు అవసరమో సమాధానం చెప్పాలి కదా? నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీలు, ఖాళీ శాఖల మంత్రుల భర్తీకి ఢిల్లీ చుట్టూ తిరుగుతూ చూపుతున్న చొరవ, కొలువులు నింపే కార్యాచరణకు మాత్రం చూపడం లేదు. ఎందుకని? కొత్తవి కాదు కదా గత ప్రభుత్వమే నోటిఫై చేసిన ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలుకు నెల రోజులైనా అడుగులు పడవెందుకు? మనసు నిండా రానున్న లోక్సభ ఎన్నికలే కానీ, నమ్మి ఓట్లేసిన జనాలు లేనే లేరన్నది అర్థమవుతూనే ఉన్నది. సీఎం మనసులో లేనే లేని జనం, పాలనలో మాత్రం ఎలా స్థానం దక్కించుకోగలరు?
మొత్తానికి ‘నమ్మితిరా సిద్ధా అంటే తన్నితిరా సిద్ధా’ అన్నట్టుగా కాంగ్రెస్ సర్కార్ పనితీరు కనపడుతున్నది. చివరికి ప్రజా పాలన కార్యక్రమంలో జనం సమర్పించుకున్న దరఖాస్తులను నడిరోడ్డుపై ఆరబోస్తున్నది. ఇలాంటి ఎన్నో సర్కార్ హస్యాస్పద పనులు ప్రజల హృదయాలను గాయపరుస్తున్నాయి. జమాఖర్చుల పద్దును లంకెబిందెలుగా ఊహించుకొని పీఠమెక్కిన వారికి ప్రజాకోణం ఉంటుందనుకోవడం అమాయకత్వమే. తలసరి ఆదాయంలో, జీఎస్డీపీలో తల ఎత్తుకొని నిలిచిన తెలంగాణను మళ్లీ తన్లాటల్లోకి నెట్టకుంటే అదే పదివేలు అనే లాగా పాలన సాగుతున్నది.
ఒకవైపు జూరాల, కల్వకుర్తి, నాగార్జున సాగర్ ఆయకట్టుకు యాసంగి పంటలకు సాగు నీరు ఇవ్వలేక క్రాప్ హాలిడే ప్రకటిస్తూ, మరోవైపు లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టుపై పాలనా విషం కుమ్మరించే కుయుక్తులు పారించడం కాంగ్రెస్ నైజానికి నిదర్శనం. కరెంట్ కోతలను నివారించే చర్యలు లేవుగానీ, పదేండ్ల పాటు 24 గంటల విద్యుత్తు వెలుగులు సరఫరా చేసిన ట్రాన్స్కో, జెన్కోలలో భస్మాసుర హస్తం పెడుతున్నారు. దశాబ్దిలో రాష్ట్రం సాధించిన పురోగతికి అధికారిక గణాంకాలే సాక్ష్యం.
కేంద్ర ప్రభుత్వ అవార్డులే ఆధారం కదా? అప్పుల అభాండాలకు సమాధానం రిజర్వ్ బ్యాంకు గణాంకాల్లో వెతుక్కోవచ్చు. కేసీఆర్ ప్రభుత్వం సమకూర్చిన ఆదాయం, సకల రంగాల్లో ప్రతిష్టించిన ఆత్మ విశ్వాసానికి వెలకట్టగలమా? రాఫెల్, 2 జీ స్పెక్ట్రమ్, కామన్వెల్త్, కార్గిల్ శవ పేటికలు ఇలా ఎన్నో లక్షల కోట్ల కుంభకోణాల ఆరోపణలు దేశాన్ని ఏలిన కాంగ్రెస్, బీజేపీల పెద్దలపై ఉన్నాయి. వారి చేతివాటం ఘనకీర్తినే బీఆర్ఎస్తో సహా, వివిధ రాష్ర్టాల భూమి పుత్రుల రాజకీయ శక్తులైన అనేక ప్రాంతీయ పార్టీల నేతలకు అంటించాలని కుట్రలు పన్నుతూనే ఉన్నారు. రేపటి వైపు నడిపించే దార్శనికత్వానిది ప్రజా పాలనగా చరిత్రలో నిలుస్తుందే కానీ, కుట్రదారులది కానే కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రగతి దృక్పథాన్ని ప్రేమిస్తారే కానీ, పగ ధోరణిని కానే కాదు. బొటాబొటి మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టినా, నిజంగా ప్రజా పాలనను శాస్త్రీయ దృక్పథంతో అమలు జరిపితే, కాంగ్రెస్ పార్టీ సర్కార్ పది మంది మెప్పు పొంది ఉండేది. కానీ, అలా అమలుచేస్తే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకవుతుంది?
(వ్యాసకర్త: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
డాక్టర్ ఆంజనేయ గౌడ్