Lok Sabha Elections | దేశంలో ఎన్నికల నగారా మోగింది. తమ తమ మ్యానిఫెస్టోలను ప్రకటించి మరొకసారి దేశ ప్రజలను మోసం చేసేందుకు రాజకీయ పార్టీలు తహతహలాడుతున్నాయి. గత ఏడు దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా పలు వేదికలపై నిరుద్యోగం, పేదరికం, ఆదాయ అసమానతలపై చర్చ సాగుతున్నది. ఈ వ్యవస్థాపూర్వక సమస్యల పట్ల అనేక సంస్థలు అధ్యయనం చేస్తున్నాయి. ఆ సంస్థలు విడుదల చేసిన లెక్కలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్నది. కేంద్ర గణాంక శాఖ తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం… జాతీయస్థాయిలో సగటు నిరుద్యోగిత రేటు 16.5 శాతం ఉండగా, రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు (15-29 ఏండ్ల యువత) 22.9 శాతంగా ఉన్నది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో నిరుద్యోగిత రేటును పరిశీలిస్తే.. రాష్ట్ర ర్యాంకు చివరి నుంచి ఆరో స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే పరిణామం.
అభివృద్ధిలో మనకన్నా అత్యంత వెనుకబడిన యూపీ, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, బీహార్ రాష్ర్టాల గణాంకాలు తెలంగాణ కన్నా మెరుగ్గా ఉన్నాయి. రాష్ట్రంలో కార్మిక బలగంలోకి వచ్చే మహిళల సంఖ్య కూడా తగ్గుతున్నది. చదువుకున్న యువతులు ఇంటికే పరిమితం అవుతుండగా, మరోవైపు సరైన అవకాశం లేకపోవడం, ఉన్నా ఇంటి బాధ్యతలు, వివాహాలు, ప్రసూతి కారణాలతో మహిళలు ఉద్యోగాలు వదిలిపెడుతున్నారని ఈ గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి లాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ దేశంలో ఉన్న నిరుద్యోగంపై చాలా దారుణమైన లెక్కలు చూపిస్తున్నాయి. ఇవన్నీ పక్కనపెడితే ఈ దేశంలో అసలు నిరుద్యోగిత ఎందుకు ప్రబలింది? ఇప్పటివరకు పాలక పార్టీలు అనుసరించిన ఆర్థిక, రాజకీయ, సామాజిక విధానాలు ఏమిటి? అవి ఎంత మేర కారణమయ్యాయో ఒకసారి లోతుగా పరిశీలిద్దాం.
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన నినాదం. ఈ నియామకాల్లో కూడా కేవలం ఒక కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయని, ఈ నిరుద్యోగుల ఘోష మీకు శాపనార్థం అవుతుందని మొన్నటి రాష్ట్ర ఎన్నికల్లో కొందరు దుష్ప్రచారం చేశారు. పైగా ఊరూరా బస్సు తిప్పి కొంతమంది మేధావులతో పదే పదే పల్లెల్లో వల్లె వేయించారు. కానీ వాస్తవానికి ప్రభుత్వ రంగంలో ఈ తొమ్మిదేండ్ల కాలంలో లక్షా 35 వేల ఉద్యోగాలను ప్రభుత్వం కల్పించింది. ప్రైవేట్రంగంలో తీసుకున్న శ్రద్ధ వల్ల సుమారు 20 లక్షల ఉద్యోగాలు యువతకు లభించాయి.
స్వాతంత్య్రానికి పూర్వం.. 1922లో దేశీయంగా ఒక శాతం సంపన్నులచేతిలో 13 శాతం జాతీయాదాయం ఉండేది. 1951లో అది 11 శాతానికి తగ్గింది. అయినా నాడు దేశంలోని సగం జనాభా వద్ద 20.6 శాతం మాత్రమే జాతీయాదాయం ఉండేది. 1951లో దేశంలో నిరుద్యోగ రేటు 4.5 శాతం మాత్రమే. కానీ, దేశంలో ధరల పెరుగుదల రేటు 13 శాతంగా ఉన్నది. పేదరికం 45.3 శాతంగా ఉన్నది. ఈ సమస్యలను అధిగమించడం కోసమే మనం సోషలిస్టు ఆర్థిక విధానాన్ని ఎంపిక చేసుకోవాలని 1956లో ఆర్థిక రాజ్యాంగ తీర్మానాన్ని ఆమోదించారు. కానీ అనుకున్నదొక్కటి అయినది మరొకటి. ముఖ్యంగా నిరుద్యోగం విపరీతంగా పెరుగుతూ వస్తున్నది. పాకిస్థాన్ ప్లానింగ్ కమిషన్ ముఖ్య ఆర్థికవేత్తగా ఉన్న హబీబ్ ఉల్ హక్ మూడో ప్రపంచ దేశాల ఆర్థిక ప్రణాళిక గురించి.. ‘ఉద్యోగ లక్ష్యం మారు బిడ్డ (సవితి బిడ్డ) వంటిది’ అని వ్యాఖ్యానించారు. మన దేశంలో 1959 సెప్టెంబర్ 28న చండీగఢ్లో ఏర్పాటుచేసిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ మాట్లాడుతూ… సంఘటిత ప్రణాళికలో ముఖ్యమైన అంశం ఉత్పత్తియే కానీ, ఉద్యోగిత కాదు. ఉత్పత్తితో పోల్చి చూసినప్పుడు ఉద్యోగిత ముఖ్యం కాదు. ఉద్యోగిత ఉత్పత్తిని అనుసరించేదే కానీ, అధిగమించేది కాదు. ఉత్తమ సాంకేతిక పద్ధతుల ద్వారానే ఉత్పత్తి అధికం అవుతుంది’ అని చెప్పారు. అందుకే రెండో ప్రణాళికలో భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చారు.
4వ ప్రణాళిక కాలం నుంచి మన దేశంలో టార్గెట్ గ్రూపు ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ను చేపట్టి ఉపాధి అవకాశాలు కల్పించాలని అనేక పథకాల్లో ఖర్చుచేసే మొత్తంలో అట్టడుగు వర్గాలకు చేరేది కేవలం 20 శాతం అని స్వయంగా ఒక ప్రధానమంత్రి చెప్పారు. ఈ పథకాల వల్ల మన దేశంలో ప్రణాళిక పెట్టుబడి తగ్గిపోయి ఉద్యోగిత అంతగా పెరగలేదు.
పేదవానికి చేపలు పట్టిస్తున్నారు. పట్టి ఇవ్వడం పరాధీనత. పట్టడాన్ని నేర్పడం స్వావలంబన. సాంకేతిక విద్యపై అభివృద్ధి చెందిన దేశాలు 15 శాతం ఖర్చు చేస్తుండగా, మన దేశంలో ఇది మొన్నటివరకు 3 శాతం మాత్రమే. అందుకే నిరుద్యోగిత. నిరుద్యోగితకు కారణం జనాభా కొంతమంది అంటున్నారు. అయితే, జనాభా వల్ల పేదరికం పెరిగిందా? లేక పేదరికం వల్ల జనాభా పెరిగి అది నిరుద్యోగితకు కారణమైందా? అన్న మౌలిక సత్యాన్ని గ్రహించడం లేదు. అవిద్య, పేదరికం కారణంగా మన దేశంలో నిరుద్యోగిత పెరిగింది. ఇది ప్రభుత్వాల వైఫల్యమే.
ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం.. అనేక బహుళజాతి సంస్థలు కల్పిస్తున్న ఉద్యోగిత ప్రపంచ జనశక్తిలో 3 శాతం మాత్రమే. ప్రస్తుతం ఆర్థికవ్యవస్థ సామర్థ్యం పెంపుకోసం పాలకులు ఆహ్వానిస్తున్న ఈ బహుళజాతి సంస్థలు మన దేశంలో ఈ నిరుద్యోగాన్ని పరిష్కరిస్తున్నాయా? అంటే దీనికి పాలకులే సమాధానం చెప్పాలి? మన దేశంలో ప్రణాళికల ప్రారంభం నుంచి ఉద్యోగ అవకాశాల కల్పన ప్రధానంగా ఉన్నది. మొదటి ప్రణాళికలో ఊరిలో ఉన్న మానవశక్తిని పూర్తిగా వినియోగించుకోవాలని, రెండవ ప్రణాళికలో ఆర్థిక, సాంఘిక దృష్టితో చూస్తే ఉద్యోగ అవకాశాల విస్తరణ లక్ష్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, నాలుగో ప్రణాళికలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎప్పటికీ పెరిగే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఆరవ ప్రణాళికలో ఈ సమస్యను తగ్గించకపోవడం వల్ల సాధించిన అభివృద్ధి అంతా మరుగున పడిపోతుందని, ఏడవ ప్రణాళికలో కూడా ఈ సమస్య పరిష్కారానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. కానీ, సాధించిన ఫలితాలు అంతగా లేవు. 1990లో బీఓపీలో లోటు రూ. 10,664 కోట్లు ఉండటం మూలంగా అప్పులు పుట్టని స్థితి వచ్చింది. సంస్థాగత సర్దుబాటు పద్దు కింద ఐఎంఎఫ్ నుంచి అప్పు తీయడంతో ప్రైవేటీకరణ అన్నిరంగాల్లో మొదలైంది. పబ్లిక్రంగ ప్రాధాన్యం ఉన్న సమయంలోనే ఉద్యోగిత అంతగా పెరగలేదు. మరి ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు పెరిగే అవకాశం ఏది? 1991-92 ఆర్థిక సర్వేలో ప్రభుత్వరంగంలో వార్షిక ఉద్యోగిత పెరుగుదల 2.78 శాతం ఉండగా, ప్రైవేట్రంగంలో వార్షిక ఉద్యోగిత పెరుగుదల -10 శాతంగా ఉన్నట్టు వెల్లడైంది. ఇది మూలిగే నక్కపై తాటిపండు చందంగా మారింది.
8వ ప్రణాళికలో 58 మిలియన్ల మంది ప్రజలకు ఉద్యోగం కల్పించాలని ప్రణాళిక సంఘం అంచనా వేసింది. అయితే ఒక్క ఈ ప్రణాళికలో వార్షిక ఉద్యోగిత పెరుగుదల 4 శాతంగా ఉండాలని చెప్పారు. కానీ ప్రభుత్వరంగ ప్రాధాన్యం ఎక్కువగా ఉన్నప్పుడే ఇంత ఉద్యోగిత లేదు. ఈ ప్రైవేటీకరణలో ఇది సాధ్యం కాలేదు. అందుకే
ఈ నిరుద్యోగిత. ఈ ప్రైవేటీకరణకు పునాదులు వేసింది ఎవరో దేశ ప్రజలకు స్పష్టంగా తెలుసు.
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన నినాదం. ఈ నియామకాల్లో కూడా కేవలం ఒక కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయని, ఈ నిరుద్యోగుల ఘోష మీకు శాపనార్థం అవుతుందని మొన్నటి రాష్ట్ర ఎన్నికల్లో కొందరు దుష్ప్రచారం చేశారు. పైగా ఊరూరా బస్సు తిప్పి కొంతమంది మేధావులతో పదే పదే పల్లెల్లో వల్లె వేయించారు. కానీ వాస్తవానికి ప్రభుత్వ రంగంలో ఈ తొమ్మిదేండ్ల కాలంలో లక్షా 35 వేల ఉద్యోగాలను ప్రభుత్వం కల్పించింది. ప్రైవేట్రంగంలో తీసుకున్న శ్రద్ధ వల్ల సుమారు 20 లక్షల ఉద్యోగాలు యువతకు లభించాయి. ఇంకా ఉద్యోగాలివ్వాలని, గ్రూపు-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ప్రజల సంక్షేమం కన్నా తమ అధికారమే మిన్న అన్నది రాజకీయ సూత్ర నానుడి. అందుకే గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని ధర్నాలు, రాస్తారోకోలు చేసి నిరసనలు చేశారు అప్పటి ప్రతిపక్ష నాయకులు. గ్రూపు-1 పరీక్ష విషయంలో సాంకేతికమైనటువంటి లోపాన్ని ఆసరా చేసుకొని హైకోర్టును ఆశ్రయించారు. తద్వారా ఎమ్మెల్సీ పదవిని సైతం పొందింది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. అధికారం కోసం ఈ గోడ దూకే పిల్లులు చెప్పే మాటల గారడీలను నమ్మవద్దు, నమ్మి మరొక్కసారి మోసపోవద్దు.
మెదడుకు పదునుపెట్టి, శాస్త్రీయంగా ఆలోచించండి. ఈ నిరుద్యోగానికి శాశ్వత పరిష్కారం జనశక్తి ప్రణాళికలే. ఉద్యోగం అంటే పని కానీ, ప్రభుత్వం ఇచ్చేదే ఉద్యోగం అనే భావనలో మార్పు రావాలి. అప్పుడే స్వయం సంపూర్ణత కలిగిన గ్రామీణ, ఆర్థిక వ్యవస్థను మనం నిర్మించుకొని గత వైభవాన్ని చాటుకోవచ్చు.
-పొందూరు ప్రభాకర్రావు
ఆర్థిక శాస్త్ర నిపుణులు
90106 31727