ఈశాన్య రాష్ర్టాలలో రత్నాల భూమిగా, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మణిపూర్లో నేడు మరణ మృదంగం మోగుతున్నది. ఈ ఏడాది మే 3 నుంచి ప్రారంభమైన జాతుల మధ్య ఘర్షణల వల్ల దాదాపు 150 మంది చనిపోయారు. 25 గ్రామాలు, 350 చర్చిలు, క్వార్టర్లు దహనం కావడమే గాక 70 వేల మంది ప్రజలు వలసపోయారు.
గత 70 రోజులుగా ఇంటర్నెట్ బంద్ చేశారు. పాఠశాలలు మూతపడ్డాయి. గృహ దహనాలు, మూకుమ్మడి హింస, ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకొని హత్యలు, భయంకరమైన శిరచ్ఛేదం, మహిళలు, చిన్నారుల హత్యలు, జాతుల వైరం, ప్రభుత్వ కార్యాలయాల దహనం కొనసాగుతున్నది.
మణిపూర్లో జాతుల వైరం వెనుక అనేక దీర్ఘకాలిక కారణాలు ఉన్నాయి. 53 శాతంగా ఉన్న మైతీ ప్రజల చేతుల్లో 10 శాతం భూమి మాత్రమే ఉండగా 47శాతంగా ఉన్న నాగ,కుకీల చేతుల్లో 90 శాతం భూమి ఉన్నది. ఇంఫాల్ లోయలో తరుగుతున్న వనరులు, పెరిగిన జనాభా, నిరుద్యోగం, లోయలోకి వలసలు పెరగడం, తదితర కారణాలవల్ల మైతీలు కొండ ప్రాంతాలకు విస్తరించాలని అనుకుంటున్నారు.
మణిపూర్ హింసపై ప్రధాని ‘ఉద్దేశపూ ర్వక’ మౌనం పాటిస్తున్నారని రాహు ల్ గాంధీ విమర్శిస్తుండగా, ‘రాజకీయ మైలేజీ’ కోసమే ఆయన మణిపూర్లో పర్యటించారని బీజేపీ విమర్శించింది. మరోవైపు మణిపూర్ జాతుల హననం వెనుక మానవీయ కోణాలు ఉన్నాయని సాయం కోరితే చేయడానికి సిద్ధమని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రకటించారు.
మయన్మార్తో 398 కిలోమీటర్ల సరిహద్దు గల మణిపూర్ ఒక సున్నితమైన సరిహద్దు రాష్ట్రం. ఉత్తరాన నాగాలాండ్. దక్షిణాన మిజోరం, పశ్చిమాన అసోం సరిహద్దు రాష్ర్టాలుగా ఉన్నా యి. 22,327 చదరపు కిలోమీటర్ల్ల వైశాల్యం గల ఈ రాష్ట్రంలో 2011 లెక్కల ప్రకారం 28,55,794 మంది నివసిస్తున్నారు.
1949లో భారత్లో విలీనం తర్వాత 1972 వరకు కేంద్రపాలిత ప్రాంతంగా ఉండి 1972 జనవరి 21న రాష్ట్రంగా ఆవిర్భవించింది. 16 జిల్లాలు, 60 శాసనసభ స్థానాలు, రెండు లోక్సభ స్థానాలు, ఒక రాజ్యసభ స్థానం గల మణిపూర్ ప్రజల భాష మైతీ లేదా మణిపురి. దీన్ని 1992లో 8వ షెడ్యూల్లో అధికార భాషగా గుర్తించారు.
ఈ రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే విదేశీయులు నియంత్రిత ప్రాంత అనుమతి పత్రం, స్వదేశీయులు ఇన్నర్ లైన్ పర్మిట్ ఆర్డర్ పత్రం కలిగి ఉండాలి.
ప్రస్తుతం 30 నుంచి35 లక్షల జనాభా గల చిన్న రాష్ట్రమైన మణిపూర్లో సంక్షోభం తలెత్తడానికి అనేక తక్షణ, దీర్ఘకాలిక కారణాలున్నా యి. సుమారు 35 గిరిజన తెగలున్నప్పటికీ ప్రధాన తెగలు మూడే. వీరు మైతి, నాగా, కుకీలు. మొత్తం జనాభాలో 53 శాతంగా ఉన్న మైతిలు అధిక సంఖ్యాకులే గాక రాష్ట్రం మధ్య లో గల ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. వీరు రాష్ట్రంలో ప్రభావవంతమైన వర్గంగా ఉన్నారు.నాగా, కుకీ ఇతర తెగలన్నీ కలిపి 47 శాతంగా ఉన్నారు.
వీరు ఇంఫాల్ లోయ చుట్టుగల కొండ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ప్రస్తు తం ఎస్సీ, ఓబీసీ హోదాతో ఉన్న మైతీలు నా గా, కుకీల్లాగా ఎస్టీ హోదా కావాలని 2012 నుంచి డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మణిపూర్ హైకోర్టు ఈ డిమాండ్ను పరిశీలించి నాలుగు వారాల్లోగా అభిప్రాయం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభు త్వం ఇంకా స్పందించాల్సి ఉన్నది. ఒకవేళ బీరెన్సింగ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే తమకు నష్టం జరుగుతుందని నాగ, కుకీ తెగలవారు మైతీలతో ఘర్షణ పడటంతో హింస ప్రజ్వరిల్లింది.
మణిపూర్లో జాతుల వైరం వెనుక అనేక దీర్ఘకాలిక కారణాలున్నాయి. 53 శాతంగా ఉన్న మైతీ ప్రజల చేతుల్లో 10 శాతం భూమి మాత్ర మే ఉండగా 47 శాతంగా ఉన్న నాగా, కుకీల చేతుల్లో 90 శాతం భూమి ఉన్నది. ఇంఫాల్ లోయలో తరుగుతున్న వనరులు, పెరిగిన జనా భా, నిరుద్యోగం, లోయలోకి వలసలు పెరగ డం, తదితర కారణాలవల్ల మైతీలు కొండ ప్రాంతాలకు విస్తరించాలనుకుంటున్నారు.
కానీ ప్రస్తుత చట్టాల ప్రకారం ఎస్టీ హోదా గలవారే కొండ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయాలి. అందువల్ల తమకు కూడా షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించాలని మైతీలు ఉద్యమిస్తున్నారు. దీన్ని నాగా, కుకీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికీ పరిపాలనలో మైతీల ఆధిపత్యం కొనసాగుతున్నది. రాష్ట్రంలోని 60 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది మైతీ తెగవారే ఉన్నారు. ఇప్పటివరకు మణిపూర్కు 12 మం ది ముఖ్యమంత్రులుగా పనిచేస్తే వారిలో 10 మంది మైతీలే. అలాంటి మైతీలకు ఎస్టీ హోదా ఇస్తే తమ భూములు కూడా ఆక్రమించుకొని తమను తరిమేస్తారని నాగా, కుకీలు ఆందోళన చెందుతున్నారు.
నాగాలు, కుకీలు నల్లమందు పండిస్తున్నార ని, అందువల్ల రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం పెరిగిందని మైతీలు ఆరోపిస్తున్నారు. మరోవైపు జాతి వైషమ్యాలు, ఆర్థిక అసమానత లు, జనాభాకు సరిపడా పెరగని ఉద్యోగ అవకాశాలు, హిందూ, ముస్లిం విభేదాలు, నాగా, కుకీలలో క్రైస్తవ మతం వేగంగా విస్తరించడం, వేర్పాటువాద గ్రూపు ల ఆవిర్భావం, ఉగ్రవాద దళాల కు బయటినుంచి అందుతున్న సాయం కూడా ఉద్రిక్తతలకు కారణమవుతున్నా యి. మణిపూర్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, మయన్మార్ నుంచి పెరుగుతు న్న చిన్ జాతి వలసలు, సరిహద్దు వివాదాలు, గ్రేటర్ మిజోరంకు పెరుగుతున్న మద్దతు, డ్రగ్స్ పేరుతో నాగా, కుకీలను గ్రామాల నుంచి తరిమి వేయడం వంటివి కూడా సమస్యను పెంచుతున్నాయి.
మయన్మార్తో కాపలా లేని సరిహద్దు, ఉగ్రవాదులకు అంతర్జాతీయ సంస్థల సహకారం, మయన్మార్ డ్రగ్స్ వ్యాపారుల పాత్ర, తదితర కారణాలవల్ల నేడు హింస మరింత తీవ్ర రూపం దాలుస్తున్నది. మైతీలకు ఎస్టీ హోదా కల్పిస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని బీజేపీ నిలుపుకోవాలని మైతీలు చేస్తున్న డిమాండ్ కూడా సమస్యగా తయారైంది.
మణిపూర్లో తక్షణ శాంతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మైతీలకు ఎస్టీ హోదా కల్పిస్తే తలెత్తే భవిష్యత్తు పరిణామాలపై విస్తృత అధ్యయనానికి నిపుణుల కమిటీని నియమించాలి. కొండ ప్రాంత జిల్లాలకు ప్రత్యే క పరిపాలన ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. ఉగ్రవా ద గ్రూపులను, వాటివెనుక ఉన్న డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయా లి. మయన్మార్ సరిహద్దును విద్యుదీకరణ చేసి అక్రమ వలసదారులను నిరోధించాలి. విభిన్న గిరిజన తెగల్లో విశ్వాసాన్ని ప్రోది చేసి శాంతి సుస్థిరతను శాశ్వతంగా నెలకొల్పాలి.
తండ ప్రభాకర్ గౌడ్
94918 22383