తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన యువతకు రాష్ట్ర నిర్మాణంలో అవకాశం ఇవ్వాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక మార్గమని భావించింది. అందులో భాగంగానే వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసింది. అయితే పలు కారణాల వల్ల ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల ఆలస్యం కావడం యువతను నిరాశ , నిస్పృహకు గురిచేసింది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి టీఎస్పీఎస్సీ సమగ్రమైన జాబ్ క్యాలెండర్ రూపొందించాలి. యువత ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు మంచి భవిష్యత్తును, ఆదాయాన్నిచ్చే ప్రైవేటు ఉద్యోగాలు, స్వయం ఉపాధిపైనా దృష్టి సారించాలి.
పోటీ పరీక్షల్లోని జాప్యం వల్ల ధైర్యం లేని, చొరవ తీసుకోలేని, నాయకత్వ పటిమ లేని యువతను సమాజం తయారు చేస్తున్నదేమోనని అనిపిస్తుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ కొనసాగిస్తున్న అందరి విషయంలోనూ ఇలాగే జరుగుతుందని చెప్పలేం. పోటీ పరీక్షల్లో విజయం సాధించలేని కొందరు తమ లోక జ్ఞానంతో ఇతర రంగాల్లో అద్భుతాలు సాధించారు.
గత తొమ్మిదేండ్లలో గురుకుల విద్యా సంస్థలు, ఇరిగేషన్, ఆరోగ్యం, పంచాయతీరాజ్, పోలీసు తదితర శాఖల్లో వేలాది ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. తాజాగా వివిధ శాఖల్లోని దాదాపు 82 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో గ్రూప్ 1, 2, 3, 4 లాంటి ప్రధాన స్రవంతి ప్రభుత్వ ఉద్యోగాలు ఉండటం యువతీ యువకుల్లో ఉత్సాహాన్ని నింపింది.
గ్రూప్స్ ఉద్యోగాలు మేధోశక్తికి కొలమానాలుగా ఉండి, ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకొనే కీలక హోదా కలిగిన ఉద్యోగాలుగా గుర్తింపు పొందాయి. ఇలాంటి ఉద్యోగాలను పెద్ద ఎత్తున భర్తీ చేయనున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభినందించకుండా ఉండలేం. అయితే గత రెండేండ్ల నుంచి జరుగుతున్న పరిణామాలు ఉద్యోగార్థుల్లో ఎన్నో భయాలకు, అనుమానాలకు తావివ్వడం శోచనీయం. మరోవైపు పరీక్షల నిర్వహణలో ఏండ్లకు ఏండ్లు గడవడం నిరుద్యోగులను నిరుత్సాహపరుస్తున్నది.
ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రపంచస్థాయి అధ్యయన నివేదికలను ఇక్కడ ఉదహరించడం అవసరం. ఎర్గోనామిక్స్ (ఉద్యోగుల సామర్థ్య అధ్యయన శాస్త్రం) ప్రకారం ప్రతి ఉద్యోగి ప్రతి రోజూ నిర్ణీత ఉత్పాదకతను కలిగి ఉంటాడు. అం దుకే మనిషి కృషిని పని గంటలతో కొలుస్తారు. ఈ లెక్కన పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఉద్యోగార్థులు ఎన్ని ప్రయోజనాత్మకమైన, ఉత్పాదకతతో కూడిన పని గంటలను ప్రిపరేషన్ కోసం వెచ్చిస్తున్నారనేది గమనించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగార్థి ఒక సంవత్సరం పాటు ఒక ఉద్యోగం కోసం తన కాలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, మేధా శక్తి.. ఇలా అన్నింటినీ కేంద్రీకరించి సన్నద్ధమవుతాడు. ఈ లెక్కన ఒక సంవత్సరంలో జరగాల్సిన పరీక్షకు సంబంధించిన మొత్తం రిక్రూట్మెంట్ ప్రక్రియ వేర్వేరు కారణాల వల్ల రెండు, మూడేండ్లు సాగదీతకు గురైతే, ఆ మానవ శ్రమ తాలూకు ఉత్పాదకత వృథా అయినట్టే! ఇంకొక విషయం ఏమంటే పలు కారణాల వల్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఏండ్ల తరబడి ఆలస్యం కావడం అనివార్యం అవుతున్నది. ఈ ఆలస్యానికి వ్యవస్థాగత, నిర్వహణ లేదా న్యాయపరమైన వివాదాలు వంటివి కారణాలైనప్పటికీ.. చివరికి బాధితులు మాత్రం ఉద్యోగార్థులే.
ఎందుకంటే ఒక ఉద్యోగం కోసం ఒక మనిషి తన జీవితకాలంలో ఒక సంవత్సరం లేదా రెండేండ్లు కేటాయించడమనేది సమంజసమే! కానీ నాలుగైదేండ్ల పాటు ఒక ఉద్యోగం కోసం నిరీక్షించడం వల్ల ఆ అభ్యర్థి తన యువ జీవితం లో విలువైన కాలాన్ని కోల్పోవడమే కాకుండా.. ఎన్నో ఆర్థిక, సామాజిక సమస్యలు, సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులకు భారంగా మారడం, ఆర్థికపరమైన ఇబ్బందుల ను ఎదుర్కోవాల్సి రావడం, మిగతా పనులేవీ చేసుకోలేని అశక్తత, నడి సముద్రంలో ఉన్నామ న్న అభిప్రాయం ఏర్పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పోటీ పరీక్షలు నిర్దిష్ట సమయానికి లేదా ఒక క్యాలెండర్ పరంగా జరగకపోవడం వల్ల ఉద్యోగార్థులు మానసిక ఆరోగ్య సమస్యల బారి న పడే అవకాశం ఉన్నది. ఉద్యోగార్థులు తమలో తామే స్ఫూర్తి నింపుకోలేకపోతే నిరాశ, నిస్పృహ కు గురికావాల్సి ఉంటుంది. దీనికి తోడు ఎంతో ఉత్పాదక సామర్థ్యం ఉన్న వయో వర్గం (20 నుంచి 42 ఏండ్ల మధ్య వయస్కులు) శక్తి సామర్థ్యాలు వృథా అవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవేళ పరీక్షలు సజావుగా సాగి ఫలితాల ప్రకటనలో జాప్యం జరిగితే.. అటు వేరే కెరీర్ లేదా ఉద్యోగం ఎంచుకోలేక.. ఇటు ప్రిపరేషన్ కొనసాగించలేక కొందరు దిక్కుతోచని స్థితి లో మిగిలిపోతున్నారు! దీనివల్ల వారి భవిష్యత్తు నిర్వీర్యమైపోతున్నది.
కొందరు ఉద్యోగార్థులు దీక్షగా, పట్టుదలగా చదివినా వందల మందితో పోటీ పడి ఉద్యోగం సాధించలేకపోవచ్చు. దాన్ని ఉద్యోగాల వేటలో వైఫల్యం చెందినట్టు భావించకూడదు. అలా భావిస్తే వారిలో ఆత్మవిశ్వాసం లోపించి, భవిష్యత్తు పట్ల అప నమ్మకం పెరిగే అవకాశం ఉంది. ఇందుకు బదులుగా కొందరు యువత ప్రైవేటు ఉద్యోగాల్లో రాణిస్తున్న తీరుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడేవారు స్ఫూర్తిగా తీసుకోవాలి. నేటి యువ విద్యావంతులకు సాఫ్ట్వేర్ వంటి రంగాల్లో ఎన్నో ఉద్యోగవకాశాలున్నాయి.
చాలామంది ప్రతిభావంతులు 25 ఏండ్ల వయస్సులోనే లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించి జీవితంలో ముందుకు వెళుతున్నారు, స్థిరపడుతున్నారు. అయితే వీరితో పాటు సమానంగా చదువుకొని, ప్రతిభ కలిగి ఉం డి కేవలం ప్రభుత్వాధికారిగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యాన్ని కలిగిన కొంత మంది యువత కార్పొరేట్, ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయకుండా గ్రూప్స్, సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు సిదమవుతున్నారు. అయితే, తీరా ఆ పోటీ పరీక్షల్లో ఎంపిక కాకపోయినా, పరీక్షల ఫలితాలు, ఉద్యోగ నియామకాలు ఆలస్యమైనా వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నది. మూడు, నాలుగేండ్లు తమకు నైపుణ్యం ఉన్న రంగం నుంచి దూరమై పోటీ పరీక్షలకు సిద్ధ మై… అక్కడ నిరాశ ఎదురైతే.. మళ్లీ తమకు నైపు ణ్యం ఉన్న రంగంలో ఉద్యోగం సాధించవచ్చు. కానీ తమ నైపుణ్యానికి తగిన వేతనాలు పొందలేక, తన సమకాలికులతో పోల్చుకొని మానసిక ఆందోళనకు గురి కావాల్సి వస్తుంది!
స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ వంటి స్ఫూర్తి ప్రదాతలు దృఢ సంకల్పం, ఉక్కు నరాలు కలిగిన యువతతో అద్భుతాలు సాధించవచ్చని ఆశించారు. కానీ పోటీ పరీక్షల్లోని జాప్యం వల్ల ధైర్యం లేని, చొరవ తీసుకోలేని, నాయకత్వ పటిమ లేని యువతను సమాజం తయారు చేస్తున్నదేమోననిపిస్తున్నది. అయితే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ కొనసాగిస్తున్న అందరి విషయంలోనూ ఇలాగే జరుగుతుందని చెప్పలేం. పోటీ పరీక్షల్లో విజయం సాధించలేని కొందరు తమ లోకజ్ఞానంతో ఇతర రంగాల్లో అద్భుతాలు సాధించారు. కొందరు పరిశ్రమలు స్థాపించి అద్భుత ఫలితాలు సాధించి మరెందరికో మార్గదర్శిగా నిలిచారు. కొందరైతే తమ ప్రిపరేషన్ అనుభవంతో పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలను స్థాపిం చి విజయం సాధించిన వారూ ఉన్నారు. నిర్దిష్ట కాల వ్యవధిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టడం ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిష్కారానికి ఒక మార్గం. ఉద్యోగాల భర్తీలో చిక్కులు, ఆలస్యం, న్యాయ వివాదాలు తదితర సమస్యలను యావత్ తెలంగాణ యువ సమాజం సమస్యగా భావించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రభుత్వం, విద్యావేత్తలు, న్యాయస్థానం తీవ్రంగా ఆలోచించి ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలను నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించి నిర్దిష్ట కాల పరిమితిలో దాన్ని అమలు చేయాలి. ఉద్యోగార్థుల్లో ఆత్మ విశ్వాసపు మొలకలను చిగురింపజేయాలి.
-ప్రతిభా శేఖర్
76609 45505