ఒకనాడు తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం తర్వాత లక్షలాది కుటుంబాలకు ఆసరాగా నిలిచింది బీడీ పరిశ్రమ. ఆనాటి ఉమ్మడి జిల్లాలైన నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పది లక్షల మందికి ఉపాధిని అందించింది. ఈ పరిశ్రమలో బీడీ రోలర్స్ (మహిళలు), బీడీ ప్యాకర్స్, చెకర్స్, భట్టివాల, ఆకు సేకరణ, బీడీ టేకేదారులు మొదలైన పేర్లతో పిలిచే కార్మికులు పనిచేస్తారు. స్వాతంత్య్రానికి పూర్వం లోకల్ బీడీలు ఉండగా 1950లో దేశాయి, చార్బాయి, ఒంటేషాపు, టెలిఫోన్, హీరాలాల్, ప్రభురాం కంపెనీ లాంటి జాతీయ కంపెనీలు తెలంగాణ ప్రాంతంలోకి వచ్చి స్థిరపడ్డాయి.
బీడీ పరిశ్రమకు టేకేదారులు, అటు కంపెనీ యజమానులకు, ఇటు కార్మికులకు వారధులుగా పరిశ్రమ మనుగడకు పునాదులయ్యారు. ఒకనాడు పెద్ద సంఖ్యలో ఉండే టేకేదారులు ప్రస్తుతం ఆరు వేలకు తగ్గారు. పది లక్షలమంది బీడీల తయారు కార్మికులకుగాను, ప్రస్తుతం ఐదు లక్షలమంది మాత్రమే ఉన్నారు. నెలకు 26 రోజులు పనికల్పించిన పరిశ్రమ నేడు పది రోజులు మాత్రమే పని కలిపిస్తున్నది. దీంతో పరిశ్రమ రోజురోజుకు కుచించుకుపోతున్నది.
కేంద్ర ప్రభుత్వాల కపట ప్రేమ కారణంగా బీడీ పరిశ్రమ కుంటుపడుతున్నది. దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు బీడీ పరిశ్రమను కుటీర పరిశ్రమగా గుర్తించలేదు. బడా పెట్టుబడి వ్యాపారులైన సిగరెట్ కంపెనీల మోజులో పడి, భారతదేశంలో బీడీ పరిశ్రమను కుప్పకూల్చాయి. బీడీ కట్టలపై పుర్రె గుర్తులు, నోటి క్యాన్సర్ లాంటి గుర్తులు ముద్రించాలని కండిషన్లు పెట్టి, బీడీలు వాడేవారిని భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఆధారపడి జీవిస్తున్న బీడీ పరిశ్రమ నడ్డి విరిచారు. బీడీలను బహిరంగ ప్రదేశాల్లో తాగవద్దని, దుకాణాల్లో కనిపించేటట్టు స్టాక్ పెట్టవద్దని, అనేక విధాలుగా ఆంక్షలు పెట్టి పరిశ్రమ నష్టానికి కారణమయ్యారు. వీటికి అదనంగా ఒకే దేశం, ఒకే పన్ను పేరుతో మోదీ ప్రభుత్వం బీడీ పరిశ్రమకు కూడా జీఎస్టీని అమలు చేసి, ఆటంకం కలిగిస్తున్నది.
ప్రస్తుతం వెయ్యి బీడీలు చుట్టే వారికి రూ. 252.04 చెల్లిస్తున్నారు. చాలా మంది మహిళలు రోజుకు 400 నుంచి 1000 బీడీలకు మించి చుడుతారు. మొన్నటిదాక వారికి వెయ్యి బీడీలకు రూ.16/- లు పన్ను ఉండగా, జీఎస్టీ అమలుతో నేడు రూ.70/- ల నుండి 80/- లకు చేరుకున్నది. గతంలో బీడీలు చుట్టే రాష్ర్టాల్లో పన్నులు ఉండేవికావు. కేవలం బీడీలు ఎక్కువగా వాడే రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ర్టాల్లో మాత్రమే ఉండేవి.
దేశ వ్యాప్తంగా 16 రాష్ర్టాల్లో 2 కోట్ల మంది కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో మారుమూల గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 90 శాతం మహిళలు ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం 2003లో తీసుకువచ్చిన ‘సీవోటీపీఏ’(సిగర్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్ యాక్ట్) చట్టంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అయ్యింది. తిరిగి 2021 సీవోటీపీఏ చట్ట సవరణ పేరుతో మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బీడీ పరిశ్రమ ను పూర్తిగా నిర్వీర్యం చేసింది.
కానీ తెలంగాణ విధాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర సాధ న ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల స్థితిగతులను అధ్యయ నం చేసి, రాష్ట్రం సాధించిన తర్వాత ఒక్కొక్కటిగా పరిష్కరించారు. అందులో భాగంగా ఖాయిలా పడుతున్న బీడీ పరిశ్రమను గుర్తించి, పరిశ్రమను పరిరక్షించడానికి ముందు కు వచ్చారు. ప్రత్యేకంగా నాలుగు లక్షల మంది బీడీ కార్మికులకు జీవనభృతి (ఆసరా పింఛన్) పేరుతో ప్రతి ఒక్కరికి నెలకు రూ. 2116లు ఇచ్చి పరిశ్రమకు అండగా నిలబడ్డా రు. తద్వారా 10 రోజుల పనితో బతకలేమని, బీడీలు చుట్టడం మానేయాలని భావించిన బీడీ కార్మికులు, ఆసరా పింఛన్తో తిరిగి బీడీలు చుట్టడం ప్రారంభించారు. తద్వారా తెలంగాణలో పరిశ్రమ కాస్త నిలబడింది. కానీ బీడీ టేకేదారులకు మాత్రం 10 రోజుల పనిదినాల్లో తయారయ్యే బీడీలు అతి తక్కువగా ఉండటంతో వారికి వచ్చే కమీషన్ డబ్బులు నెలకు రూ.4-5 వేలకు పడిపోయింది. ఈ ఆదాయంతో వారు కుటుంబ పోషణ గడవక ఆర్థిక ఇబ్బందులతో జీవితాలను కొనసాగిస్తున్నారు. వారికి కూడా నేనున్నానంటూ సీఎం కేసీఆర్ కార్మికులతో పాటు టేకేదారులకు కూడా పింఛన్ ఇస్తామని ప్రకటించారు. ఇది ఒక రకంగా క్షీణిస్తున్న బీడీ పరిశ్రమకు కేసీఆర్ కొత్తజీవం పోసినట్టయ్యింది.
(వ్యాసకర్త :కార్మికనేత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి)
ఎల్. రూప్సింగ్
90005 00760