మాట్లాడే భాషకు, రాసే భాషకు ఎంతో కొంత తేడా ఉంటుంది. ఎదుటి మనిషితో మాట్లాడుతున్నంత సహజంగా, సరళంగా రాయడం దానికదిగా ఒక కళ. ఒక భాషలో ఉన్న నుడికారాలు, సామెతలను వాడుకుంటూ ఆ భాషకే పులకింతలు పుట్టించడం అందరికీ సాధ్యమయ్యే విద్య కాదు. తెలుగు వచన రచనలో తనదైన ముద్ర వేసిన శ్రీరమణది పదహారణాల తెలుగు శైలి.
రచయిత శ్రీరమణ అని కొడితే గూగుల్లో ఆయన బయోడెటా అంతా దొరుకుతుంది. కాబట్టి ఆ వివరాల్లోకి వెళ్లదలుచుకోలేదు. ఆయన కథకుడు, కాలమిస్ట్. వ్యంగ్య రచనల్లో అందె వేసిన చేయి. ఆయన రాసిన ‘మిథునం’ కథ రెండే పాత్రలతో సినిమాగా వచ్చింది. బాపు-రమణలతో ఆయన దాదాపు పాతికేళ్లు ప్రయాణం చేశారు. తెలుగులో దాదాపు ప్రఖ్యాత వచన కవులందరి కవితలకు పేరడీ కవితలు రాశారు. జర్నలిస్టుగా విజయవాడ, హైదరాబాద్లలో పెద్దవారితో కలిసి పనిచేశారు. అలాంటి వివరాలన్నీ అందరికీ తెలిసినవే. అవే చెప్తే పునరుక్తి అవుతాయి.
శ్రీరమణ హాస్యరస ప్రియుడు. ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆయన మాట్లాడే ప్రతిమాటలో ఒక హాస్యరస గుళిక దొరుకుతుంది. తెలుగు సాహిత్యంలో పెద్దవారిని దగ్గరగా చూసిన, వారిగురించి విన్న సంగతులను ఆయన మైమరచి చెప్తుంటే విన్నవారిది అదృష్టం.
విశ్వనాథ పద్యాలు రాయరు. నోటికి చెప్తుంటే శిష్యులు రాసేవారట.. అని విజయవాడ వీధిలో రిక్షాలో వెళ్తున్న విశ్వనాథవారిని ఏనుగు ఎక్కి విజయనగర విరూపాక్ష గుడిముందు వెళ్తున్న కవిరాజులా శ్రీరమణ మన కళ్లముందు దృశ్యాన్ని ఆవిష్కరిస్తారు. లండన్లో ఎవరింటికో పలకరింపునకు వెళ్లిన శ్రీశ్రీ టేబుల్ మీద ఉన్న ఇంగ్లీషు పదకేళిని రెండు నిముషాల్లో పూర్తి చేస్తే… నాలుగు రోజులుగా దాన్ని పూర్తి చేయలేకపోయిన ఆ ఇంటి యజమాని, సాహితీ పిపాసికి నోట మాట రాలేదని… తేరుకున్నాక ఆయన శ్రీశ్రీ ఇంగ్లీషు పరిజ్ఞానం గురించి ఎలా హాశ్చర్యపోయాడో శ్రీరమణ పులకింతగా వివరిస్తారు. నమ్మినవారు మోసం చేయగా ముళ్లపూడి వెంకటరమణ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బాపు కుటుంబం ఎలా బాధ్యత తీసుకుందో శ్రీరమణ చెప్తుంటే వినితీరాలి. సినారె రాసుకొచ్చిన పాటకు బాపు ఎలా స్పందించారో, ముళ్లపూడి ఎలా సవరణలు చెప్పకుండానే చెప్పారో శ్రీరమణ చెప్తుంటే… ఓహో అందుకా బాపు సినిమాల్లో తెలుగు తెలుగులా ఉంటుందని పొంగిపోవాలి. అంత్యప్రాసల ఆరుద్ర అంటే బాపు ఎందుకు మైమరచిపోతారో శ్రీరమణ చెప్తుంటే… సినిమా పాటల ప్రాసలు దాటి పొంగి పొర్లే ముత్యాల ప్రాసలను ఏరుకోవాలి. వేటూరి కృష్ణా తరంగాల్లో రాయని కావ్యాలు పలికిన మధురిమలు శ్రీరమణ చెప్తుంటే… అర్జంటుగా వేటూరి కాళ్లెక్కడ ఉన్నాయని వెతుక్కోవాలి. గుంటూరు శేషేంద్ర చెట్టంత కవిత్వంలో కొమ్మలు, రెమ్మలు, పూలు, కాయలను విడమరచి శ్రీరమణ చెప్తుంటే ఆ చెట్టు నీడలో సేదతీరాలి. అత్యంత తేలికైన పదాలతో దాశరథి రాసే పాటలు వీణకు ఎందుకు అనువైనవో శ్రీరమణ చెప్తుంటే ఆ వీణాగాన రస చర్చలో మునకలు వేయాలి.
కథ కల్పనే అయినా ఆ కథలో మనల్ని మనం చూసుకోగలగాలి. అలా శ్రీరమణ కథల్లో మన ఇంట్లోవాళ్లే మనకు ఎదురుపడుతూ ఉంటారు. ఒక్కో భాషకు కొన్ని సహజమైన అందచందాలుంటాయి. శ్రీరమణ కలం అర్ధ శతాబ్దం పాటు ఆ తెలుగు అందచందాల వెంట వీరవిహారం చేసింది. కలకాలం నిలిచి ఉండే రచనలు చేసి… వచ్చిన పని ముగించుకొని వెళ్లిన శ్రీరమణ కలానిది రమణీయమైన సంతకం.
-పమిడికాల్వ మధుసూదన్
99890 90018