ప్రపంచవ్యాప్తంగా విద్యుత్తు కొరతకు చెక్ పెట్టేందుకు పలు దేశాలు నడుం బిగించాయి. అతి చౌకగా లభించే అణు విద్యుత్తు సామర్థ్యాన్ని మూడింతలు పెంచాలని ఆయా దేశాలు నిర్ణయించాయి. దుబాయి వేదికగా జరిగిన 28వ ఐక్యరాజ్య సమితి ైక్లెమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ (సీవోపీ 28వ సదస్సు)లో ఈ మేరకు 20కి పైగా దేశాలు ప్రతిజ్ఞ చేశాయి.
Nuclear power | ఐరోపా, ఉత్తర అమెరికాకు చెందిన పలు దేశాలు 2050 నాటికి తమ అణు విద్యుత్తు సామర్థ్యాన్ని భారీగా పెంచుకునేందుకు సమాయత్తం అవుతున్నాయి. రానున్న 25 ఏండ్లలో ప్రపంచ విద్యుత్తు అవసరాలలో ప్రస్తుతం 10 శాతంగా ఉన్న అణు విద్యుత్తును భారీగా పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, ఘనా, దక్షిణ కొరియా, స్వీడన్, యూఏఈ తదితర దేశాలు ఈ మేరకు అంగీకారం తెలిపాయి.
పారిస్ ఒప్పందం ప్రకారం ప్రపంచ సగటు ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయడానికి అవసరమైన మార్గాలను అనుసరించేందుకు సీవోపీ 28వ సదస్సు దోహదం చేసింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు జరిగిన ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన సుమారు 70 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో పలు ఒప్పందాలు జరిగాయి. అయితే పారిస్ ఒప్పం దం దిశగా అడుగులు పడటం లేదని సీవోపీ 28వ సదస్సు అధ్యక్షుడు సుల్తాన్ అల్ జబేర్ విచారం వ్యక్తం చేయడం గమనార్హం.
అణు విద్యుత్తు శక్తి లేకుండా కర్బన ఉద్గారాలను నెట్ జీరోకు తీసుకురావాలన్న లక్ష్యాన్ని చేరుకోలేమని భావిస్తున్న ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలు పలు లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. ప్రస్తుతం ఉన్న అణు రియాక్టర్ల జీవితకాలాన్ని 80 ఏండ్లకు పెంచడం అందులో ఒకటి. దీంతో పాటు కొత్తగా పెద్ద రియాక్టర్లు, అడ్వాన్స్డ్ స్మాల్ మాడ్యూలర్ రియాక్టర్లను నిర్మించాలని నిర్ణయించాయి.
అయితే ఆయా దేశాలు అనుకున్న లక్ష్యాన్నిచేరుకోవడం అంత సులువు కాదు. అణు విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు తప్పనిసరి. అదే సమయంలో ఆర్థిక వనరులు సమకూర్చడం కూడా ఆయా దేశాలకు తలకు మించిన భారమే. అణు శక్తి చౌకగా లభిస్తున్నప్పటికీ అణు విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వీటి నిర్మాణం కూడా అనుకున్నంత వేగంగా సాగకపోవడం మరో ప్రతికూలత.
పునరుత్పాదక ఇంధన వనరులైన పవన, సౌర విద్యుత్తు నిరంతరం మనకు కరెంటును అందించలేవు. అణు విద్యుత్తు వాటికి ప్రత్యామ్నాయమని న్యూక్లియర్ పవర్ మద్దతుదారులు వాదిస్తున్నారు. అయితే పర్యావరణవేత్తలు వారి వాదనను కొట్టిపారేస్తున్నారు. అణు విద్యుత్తు కంటే పవన, సౌర విద్యుత్తు ఎంతో చౌకగా లభిస్తున్నదని, అదే సమయంలో పర్యావరణానికి ఎటువంటి హాని చేయవని వారు చెప్తున్నారు. ఒకవేళ అణు ధార్మిక పదార్థాలు లీక్ అయితే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 2011లో జరిగిన పుకుషిమా ఘటనను వారు గుర్తు చేస్తున్నారు. పర్యావరణవేత్తల ఆందోళనను కొట్టిపారేయలేం. అనుకోని ఘటన జరిగితే భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉన్నది. కానీ, రేడియో ధార్మిక పదార్థాల నిర్వహణపై కూడా ప్రస్తుత సదస్సులో చర్చించడం హర్షించదగిన విషయం.
అమెరికా విద్యుత్తు అవసరాలలో 18 శాతం అణు శక్తి తీరుస్తున్నది. అమెరికా సహా అనేక ఐరోపా దేశాలు అణు విద్యుత్తు వైపు అడుగులు వేస్తున్నాయి. ఆయిల్, గ్యాస్ తదితర అవసరాల కోసం ఐరోపా దేశాలు రష్యాపై అతిగా ఆధారపడుతున్నాయి. ఇంధనం కోసం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. దీంతో ఈ రంగంపై ఎక్కువ పెట్టుబడులు అవసరం అవుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు రష్యాపై ఆధారపడకుండా ఉండేందుకు గానూ ఐరోపా దేశాలు అణు విద్యుత్తు దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ అంశంలో ఫ్రాన్స్ అందరికంటే కాస్త ముందున్నది.
ఆరు న్యూక్లియర్ రియాక్టర్లను నిర్మించాలని గతేడాది నిర్ణయించుకున్న ఫ్రాన్స్ వాటికి తోడుమరో ఎనిమిది రియాక్టర్లను నిర్మించాలని చూస్తుండటం ఈ రంగంలో ఆ దేశ దూకుడుకు నిదర్శనం. దేశ విద్యుత్తు అవసరాలలో ఫ్రాన్స్ సుమారు 70 శాతం అణు విద్యుత్తు ద్వారానే పొందుతున్నది. ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ ఈ విషయంలో కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అణు విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం కోసం ఆయన పెద్ద మొత్తంలో ఆర్థిక వనరులను సమకూరుస్తున్నారు.
మన భారతదేశం కూడా అణు విద్యుత్తు శక్తి దిశగా వడివడిగా అడుగులు వేస్తుండటం ముదావహం. దేశంలోని ఏడు న్యూక్లియర్ ప్లాంట్లలో 22 రియాక్టర్లు ఉన్నాయి. ఏటా అవి 6,780 మెగావాట్ల అణు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. 2031 నాటికి ప్రస్తుతం ఉన్న సామర్థ్యాన్ని మూడింతలు పెంచి, 22,480 మెగావాట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదిలా ఉంటే వీటి నిర్మాణానికి కావాల్సిన నిధులను సమకూర్చుకోవడమే దేశం ముందున్న అసలు సమస్య.
సూరి