స్వీడన్లోని ఓ నగరం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని 80 వేల మంది ఒకరినొకరు ‘హలో’ అని పలకరించుకునేలా క్యాంపెయిన్ను ప్రారంభించింది. ఫోన్లో అనుకునేరు.. ప్రత్యక్షంగానే పలకరించుకోవాలి. ఒంటరితనంతో బాధపడుతున్నవారికి సాంత్వన చేకూర్చుడం దీని ప్రధాన ఉద్దేశం.
Loneliness | ఒంటరితనం కూడా ఓ మహమ్మారిగా మారిపోయింది. ఎంతలా అంటే దాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్వో) గుర్తించేంతగా. ఒంటరితనం ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించిందని ఇటీవల డబ్ల్యుహెచ్వో ప్రకటించింది. దీని వల్ల మరణం సంభవించే ప్రభావం రోజుకు 15 సిగరెట్లు తాగడంతో సమానమంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఒంటరితనం ఎంత ప్రమాదకరమో.
ఆ విషయాన్ని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒంటరితనంపై అంతర్జాతీయ కమిషన్ను ఏర్పాటు చేసింది. అమెరికా సర్జన్ జనరల్ డా.వివేక్ మూర్తి నేతృత్వంలోని ఈ కమిషన్లో ఆఫ్రికా యూ నియన్ యూత్ రాయబారి చిడో ఎంబాపె, వివిధ దే శాల మంత్రులు, అడ్వకేట్లు ప్రతినిధులుగా ఉన్నారు. ఈ కమిషన్ మూడేండ్ల పాటు కొనసాగుతుంది.
కొవిడ్ సమయంలో, ఆ తర్వాత సమాజానికి దూరంగా బతుకుతున్నవారి సంఖ్య ఎక్కువైంది. వీరంతా క్రమంగా ఒంటరితనానికి లోనవుతున్నారు. కాలంతో పాటు పరుగులు పెడుతున్న ఈ లోకంలో వృద్ధులు ఎప్పటి నుంచో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కొవిడ్ మహమ్మారి తర్వాత సమస్య తీవ్రత ఎక్కువైందని చెప్పవచ్చు. అయితే ఈ సమస్య బారినపడ్డ పెద్దవారిలో డెమెన్షియా వచ్చే ముప్పు 50 శాతం పెరిగే అవకాశం ఉండటం ఆందోళనకరం. అదే విధంగా స్ట్రోక్ వచ్చే ముప్పు 30 శాతం పెరుగుతుంది.
వృద్ధులు, పెద్దవారితో పాటు యుక్త వయస్కులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 5-15 శాతం యువత ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. యువతలో ఈ సమస్య ఉత్పన్నమవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. పాఠశాల, యూనివర్సిటీ స్థాయి నుంచే వారిలో ఈ సమస్య ఆరంభమవుతున్నది. డ్రాప్ అవుట్, ఆర్థిక సమస్యలు, సామాజిక నేపథ్యం, ఉపా ధి దొరకకపోవడం, ఉపాధిని కోల్పోవడం, చేస్తున్న పని నచ్చకపోవడం, ఉద్యోగ జీవితంలో రాణించలేకపోవడం యువత ఒంటరితనానికి గురికావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఆఫ్రికాలో అత్యధికంగా 12.7 శాతం, ఐరోపాలో 5.3 శాతం యువత ఒంటరితనానికి ప్రభావితం అవుతున్నారు.
ఒంటరితనం.. చెప్పుకోవడానికి చిన్న మాటే. కానీ అది ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించిన వారికే తెలుస్తుంది. స్వానుభవంలోకి రానంత వరకు మనకూ దాని గురించి తెలియదు.. దాన్ని అనుభవిస్తున్నవారిని పట్టించుకోం. ఉరుకులు, పరుగుల ఈ జీవితంలో కాలంతో పాటు పరుగులు తీసే నగరవాసులకు కనీసం వారి పక్కింట్లో ఎవరూ ఉంటున్నారో పట్టించుకునే తీరిక ఉండదు. మంచిచెడు తెలుసుకునే సమయమూ ఉండదు. మనకెందుకులే అనే ధోరణి కూడా దీనికి ఓ కారణం. అందుకే నగరాల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
అయితే నగరాలతో పోలిస్తే పల్లెటూర్లలో పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి. పల్లెల్లో అందరూ ఒకరికొకరు తెలిసే ఉంటారు. నిత్యం ఒకరినొకరు పలకరించుకుంటూ ఉంటారు. సాధకబాధకాలు పంచుకుంటారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రచ్చబండ దగ్గర ముచ్చట్లు, ఇండ్ల ముందర ఉండే అరుగుల మీద కబుర్లు వారి మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ఓ కారణం. ఇవేవీ మనకు నగరాల్లో కనిపించవు.
స్మార్ట్ఫోన్లు వచ్చిన తర్వాత మనుషుల మధ్య దూరం మరింత పెరిగింది. కుటుంబ సభ్యుల మధ్య అంతరం అంతకంతకూ పెరుగుతూ వస్తున్నది. ఒకే ఇంట్లో ఉండేవారు సైతం ఎప్పుడో గానీ పలకరించుకోవడం లేదు. తల్లిదండ్రులు ఫోన్లలో మునిగిపోవడం వల్ల పిల్లలు చిన్నప్పటి నుంచే తాము ఒంటరివారమనే భావనలో కూరుకుపోతున్నారు. మరికొంతమంది తల్లిదండ్రులు ఫోన్లను చేతిలో పెట్టి పిల్లల్ని చేతులారా ఒంటరితనానికి గురి చేస్తున్నారు. మరోవైపు పెద్దలు అందరూ ఉన్నా అనాథలుగా మారిపోతున్నారు. మనసులోని భావాలు చెప్పుకొనేందుకు ఎవరూ లేరనే భావన వారిని మరింత కుంగదీస్తున్నది. ఒంటరితనానికి లోనై కొంతమంది తమ ఆరోగ్యాలను పాడు చేసుకుంటుంటే.. మరికొంతమంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు.
స్వీడన్లో చెప్పుకొంటున్నట్టే మనమూ ఒకరికొకరం హలో అని పలకరించుకునే పరిస్థితి రాకముందే మేల్కొవాలి. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే చాప కింద నీరులా ఇది మానవాళిని కబళించేస్తుంది. ప్రతి దానికి ప్రభుత్వాలను నిందించే మనం ఈ సమస్యపై మాత్రం మనల్ని మనం నిందించుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే జపాన్లో తెచ్చినట్టే మన దగ్గర కూడా ఒంటరితనంపై ఓ మంత్రిత్వ శాఖను తేవాల్సిన దుస్థితి వస్తుంది.
– ఎడిటోరియల్ డెస్క్