దేశ జనాభాలో సింహభాగం యువజనులే అని దేశ నేతలు మురిపెంగా చెప్తుంటారు. ఇది దేశంలో ఉత్పాదకత పెంచేందుకు తద్వారా ఆర్థికవృద్ధికి తోడ్పడుతుందని వారి ఉద్దేశం. అయితే ఉత్పాదక వయస్సులో ఉన్న జనాభా ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నప్పుడే అది సాధ్యపడుతుందని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో భారతదేశ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. కరోనా వంటి సాంక్రమిక వ్యాధుల సమస్య ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇటీవలి సంవత్సరాల్లో జీవనశైలి లేదా అసాంక్రమిక జాడ్యాల సమస్య అంతకంతకూ తీవ్రమవుతున్నది. మరి ప్రజల ఆరోగ్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన శ్రద్ధ పెడుతున్నదా అంటే లేదనే చెప్పాలి. ఆ మధ్య జరిపిన ఓ సర్వే ప్రకారం అధిక రక్తపోటు, గుండెజబ్బులు, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడుతున్న వారిలో మూడింట రెండు వంతుల మంది 26-59 ఏండ్ల మధ్య వయసుండే ఉత్పాదక వయోవర్గానికి చెందినవారే. ఈ తరహా ఏడు వ్యాధుల బారిన పడుతున్న వారిలో సగం మంది 53 ఏండ్ల లోపువారే. తమ ఉపాధితో దేశ ఆర్థికవ్యవస్థకు దన్నుగా నిలిచి కుటుంబాలను పోషించుకోవాల్సిన వయసులో చాలామంది జీవన శైలి రుగ్మతల బారిన పడుతున్నారు.
భారతీయులను పీడిస్తున్న ఈ వ్యాధుల్లో బీపీ, షుగర్, కీళ్లవాతం మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకొని ధూమపానం, మద్యానికి దూరంగా ఉంటే వీటిని కొంతవరకు దూరం పెట్టవచ్చు. ఆరోగ్య ఖర్చులను తట్టుకునే స్థాయిలో దేశం లోని 40 కోట్ల మంది లేరని నీతిఆయోగ్ వెల్లడించింది. మధ్య, అల్పాదాయ వర్గాలవారు ఆరోగ్య చికిత్సలకు ఆదాయానికి మించి ఖర్చులు భరించాల్సి వస్తుంది. అదే సమయంలో అరకొర నిధులతో వెళ్లదీస్తున్న మన దేశ ఆరోగ్య వ్యవస్థ సత్తాకూ ఇవి పరీక్ష పెడుతున్నాయి. ఈ సమస్య ఇంతటితో అయిపోలేదు. అసాంక్రమిక వ్యాధుల బారిన పడినవారు లాభసాటి ఉపాధికి దూరమయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా కలిగే ఉత్పాదక సంవత్సరాల కోత వల్ల 2030 నాటికి మూడున్నర లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుందని ఒక అంచనా.
పెద్ద ఎత్తున ముంచుకొస్తున్న ఆరోగ్య సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవడం లేదు. 2023-24 బడ్జెట్లో ఆరోగ్యానికి కేటాయించిన రూ.89,155 కోట్లే ఇందుకు సాక్ష్యం. దేశ జీడీపీలో ఇది 2.1 శాతమే. దక్షిణాఫ్రికా వైద్యరంగ వ్యయం వారి జీడీపీలో 8 శాతం పైగా ఉంది, వారినుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది. ఇక సంపన్న దేశాలతో అయితే మనం ఏ మాత్రం పోటీ పడలేమన్నది వాస్తవం. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గరిష్ఠస్థాయి 5 శాతం నిధులతో ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరుస్తున్నది. ప్రభుత్వ వైద్యాన్ని కార్పొరేట్ వైద్యానికి దీటుగా తెలంగాణలో బలోపేతం చేస్తున్నది. కొత్త మెడికల్ కాలేజీలు, స్పెషాలిటీ దవాఖానలు నెలకొల్పుతున్నది. అన్నిస్థాయుల్లో సర్కారీ వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తున్నది. కేంద్రం కూడా ఇదే బాటలో పయనించి ప్రజల ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా దేశ ఆర్థికవ్యవస్థ పురోగతి కోసమైనా ఆరోగ్య రంగానికి నిధులు పెంచి ప్రణాళికాబద్ధమైన వ్యూహాన్ని అమలుచేయాల్సిన అవసరం ఉన్నది.