తెలంగాణ జనాభాలో కుమ్మరి/శాలివాహన సామాజికవర్గం వాటా 1.2 శాతం ఉన్నందున దామాషా పద్ధతి ప్రకారం.. కనీసం 1 నుంచి 2 ఎమ్మెల్యే సీట్లు ఆ వర్గానికి దకాలి. 17 ఎంపీ సీట్లు ఉన్నందున ఐదు లోక్సభ ఎన్నికలకు ఒకసారి రొటేషన్ పద్ధతిలో ఒక స్థానం ఉండాలి. చట్టసభల్లో నేరుగా ఎన్నికయ్యే అవకాశం లేనప్పుడు నామినేటెడ్ కోటాలో శాసనమండలిలో కనీసం ఒక సీటు అయినా కేటాయించి వారి రాజకీయ శూన్యత్వాన్ని భర్తీ చేయాలి. కానీ, రాష్ట్రంలో 4,31,363 (1.2 శాతం) జనాభా ఉన్న కుమ్మరి సామాజికవర్గానికి చట్టసభల్లో ఒక సీటు కూడా దకకటం లేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి ఇప్పటికీ కుమ్మరి సామాజికవర్గం ఒక నిశ్శబ్ద ఓటుబ్యాంకుగానే మిగిలిపోయింది. ఉమ్మడి ఏపీలో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ, కుమ్మరి కులస్తులకు ఎమ్మెల్యే టికెట్లు దక్కలేదు. జనాభాపరంగా బీసీ-బీ క్యాటగిరీలో ఉన్న వీరు, రాజకీయంగా బలంగా ఉన్న ఇతర బీసీ కులాల నీడలోనే ఉండిపోయారు. కాంగ్రెస్ లేదా టీడీపీ వంటి ప్రధాన పార్టీలు వీరిని కేవలం స్థానిక సంస్థల స్థాయికే పరిమితం చేశాయి. నామినేటెడ్ పదవుల్లో కూడా వీరికి దకిన వాటా నామమాత్రమే. కుమ్మరి సామాజికవర్గానికి చెందిన బలమైన నేత ఐలాపురం వెంకయ్య శాసనమండలి సభ్యునిగా ఎనిమిదేండ్లపాటు పనిచేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా తాడూరి శ్రీనివాస్కు కేసీఆర్ అవకాశం కల్పించారు. కుమ్మరి కులానికి ఆత్మగౌరవ భవనం కేటాయించారు. రాష్ట్రమంతటా కుమ్మరి జనాభా విస్తరించి ఉన్నది. కానీ, ఏ ఒక నియోజకవర్గంలోనూ గెలుపోటములను శాసించే స్థాయిలో లేదు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 94 మంది కుమ్మరి కులస్తులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా గెలిచి సత్తాచాటారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన సీపెక్ డాటా గణాంకాలను పరిశీలిస్తే, సామాజికంగా, ఆర్థికంగా కుమ్మరులు నిలకడగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఈ కులం తీవ్ర వివక్షకు గురవుతున్నట్టు కనిపిస్తున్నది. రాష్ట్రం మొత్తం జనాభాలో కుమ్మరుల వాటా 1.2 శాతం. వీరి ఆర్థిక స్థితిగతులు మెరుగ్గానే ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం భూమిలో 1.4 శాతం భూమి వీరి హస్తగతమై ఉన్నది. జనాభా నిష్పత్తి కంటే ఎకువ భూమిని కలిగి ఉండి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తమదైన ముద్ర వేస్తున్నప్పటికీ, రాజకీయంగా మాత్రం వీరి గొంతు చట్టసభలకు చేరడం లేదు. కేవలం ఓటుబ్యాంకుగానే కాకుండా, చట్టసభల్లో నిర్ణయాత్మక శక్తులుగా కుమ్మరులను గుర్తించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది.
-లట్టుపల్లి విక్రమ్
97015 87979