2001 తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ ఆకాంక్ష ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచింది. ఈసారి కూడా ఉద్యమాన్ని అణచివేయాలని సీమాంధ్ర పాలకులు చేయని కుట్ర లేదు. కానీ, కేసీఆర్ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. భిన్నరూపాల్లో ఉద్యమాన్ని రగిలించారు. అదే సమయంలో విదేశాల్లో ఉన్నత ఉద్యోగంలో ఉన్న కేటీఆర్ తన ప్రాంత విముక్తి కోసం సాగుతున్న ఉద్యమంలో భాగస్వామ్యం కావాలనే పట్టుదలతో భారతదేశానికి వచ్చి ఉద్యమ జెండా ఎత్తుకున్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చాలని సీమాంధ్ర పాలకులు చేసిన ప్రతి కుట్రను ఛేదించారు కేసీఆర్. తండ్రి పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న కేటీఆర్ తాను ఉద్యమంలో భాగమయ్యారు. సామాన్య కార్యకర్తగా ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. తండ్రీకొడుకులిద్దరూ ఉద్యమ రూపాలను మార్చుతూ తమదైన శైలిలో పోరు సల్పారు. ఉద్యోగుల పెన్డౌన్, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, రైల్రోకో, రాస్తారోకోలు, వంటావార్పులు, ముందస్తు బంద్లతో తెలంగాణ అట్టుడికింది. కేసీఆర్ పోరాట వారసత్వాన్ని అచ్చంగా పుణికిపుచ్చుకున్న వ్యక్తి కేటీఆర్. ఉద్యమ సమయంలో దెబ్బలకు భయపడకుండా జైలు నిర్బంధాలకు వెరవకుండా తాను పోరాటంలో మమేకమై ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారు. ఉద్యోగమా? ఉద్యమమా? అంటే ఉద్యమాన్ని ఎంచుకున్న మహా మనీషి కేటీఆర్.
ఆ సందర్భంలోనే 2013, జనవరి 27న తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ను అరెస్టు చేసింది సీమాంధ్ర ప్రభుత్వం. అరెస్టయి రెండు నెలలు జైల్లో ఉన్నారు. ఇన్ని ప్రతికూలతల నడుమ కూడా తన ధైర్యం చెదరలేదు. తన లక్ష్యాన్ని వదల్లేదు. ఈ సంఘటన కేటీఆర్ను మరింత రాటుదేలేలా చేసింది. జైలు నుంచి విడుదలైన అనంతరం మరింత రెట్టించిన ఉత్సాహంతో ఇందిరా పార్క్ దగ్గర అమరదీక్షకు పూనుకున్నారు. అలుపెరగని పోరాటయోధుడిగా కేటీఆర్ అవిశ్రాంతంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ జనంలో సామాన్య కార్యకర్త వలె పనిచేశారు. తన విద్యా ప్రతిభను ఉద్యమం కోసం ధారపోశారు. తెలంగాణవాదాన్ని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తూనే విదేశాల్లో ఉన్న తెలంగాణ వాళ్లందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చారు. తెలంగాణ చివరికి గెలిచింది. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష ఫలించింది, తెలంగాణ రాష్ట్రం 2014, జూన్ 2న ఆవిర్భవించింది.
నిత్యం ప్రజల క్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పరితపించే నాయకుడిగా అచంచలమైన పరిజ్ఞానంతో యావత్తు తెలంగాణ సమాజం నుంచి ప్రజల మన్ననలు పొందారు కేటీఆర్. అలా 2014లో తొలిసారి కేటీఆర్ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి వెనుదిరగాల్సిన అవసరం లేకుండా వరుస విజయాలు సాధించారు. కేటీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసిన సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు కేటీఆర్ను భారీ మెజారిటీతో గెలిపిస్తూ వస్తున్నారు. కేటీఆర్ సైతం తన నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో ముందునిలిపారు.
ఐటీ శాఖ మంత్రిగా పారిశ్రామికరంగంలో విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చేలా దేశంలోనే హైదరాబాద్ను నెంబర్వన్ స్థానంలో నిలిపారు. అలాగే మున్సిపల్ మంత్రిగా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరాల స్థాయిలో నిలపడంలో కేటీఆర్ కృషి వెలకట్టలేనిది.
జి.రాజేష్ నాయక్
96035 79115