సరందజ్ఖాన్ మళ్లీ పుట్టాడు, పునర్జన్మల మీద నమ్మకం లేని వాళ్లు కూడా ఈ మాట నమ్మాల్సిందే! ఈ ఖాన్ ఎవరు? మళ్లీ ఎవరిలా జన్మ ఎత్తాడు చూద్దాం!
రత్నగర్భ అయి రత్నాల వ్యాపారం జేసిన గోల్కొండ రాజ్యాన్ని కబళించటానికి 1687లో ముఘల్ పాదుషా అయిన ఔరంగజేబు సంకల్పించాడు. అప్పుడు గోల్కొండ పాలకుడైన అబుల్ హసన్ కుతుబ్షా సైన్యంలో అధికారి అయిన సరందజ్ ఖాన్ లంచం తీసుకొని ఔరంగజేబుకు సహాయం చేశాడు. అలా కుతుబ్ షాహీ వంశం అంతరించి ముఘులుల పాలయింది గోల్కొండ రాజ్యం. ఏ ప్రాంతంలోనైనా ఇటువంటి మాతృద్రోహులుంటారు. వారు తాము పుట్టిన నేలకు ద్రోహం చేయటానికి వెనుకాడరు. ప్రస్తుతం మన కండ్లముందే తెలంగాణ రాష్ట్రం గురించి అవాకులు, చెవాకులు పేలుతున్నవాళ్లు లేరా?
1948లో నిజాముకు కల్లబొల్లి ప్రమాణాలు చేసి, ప్రత్యేక దేశంగా ఉన్న హైదరాబాదు రాష్ర్టాన్ని భారతదేశంలో విలీనం చేశాడు జవహర్లాల్ నెహ్రూ, అప్పటినుంచి తెలంగాణ ప్రాంతం మీద జరిగిన దాడులకు లెక్కే లేదు. 1948 సెప్టెంబర్ నుంచి 1949 డిసెంబర్ దాకా మిలిటరీ రూల్ చేసిన అరాచకాలకు అంతులేదు. తర్వాత 1952 దాకా వెల్లోడి ప్రభుత్వం! 1952లో మొట్టమొదటగా తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్నికల ద్వారా ఏర్పడినా అదీ మూణ్నాళ్ల ముచ్చటే అయింది.
1956లో ఆంధ్రా ప్రాంతంలో విలీనమైనప్పుడు తెలంగాణ పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టయింది. 1956 నుంచీ 2014 దాకా సాగిన ఈ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు 27 1/2 ఏండ్లు రాయలసీమ వారు, 24 1/2 ఏండ్లు ఆంధ్రా వారు కావటంతో రత్నగర్భ అయిన తెలంగాణ ప్రాంత నిధులు వలస పాలకులను కుబేరుల్ని, ఈ ప్రాంత వాసులని బికారులను చేశాయి. ముగ్గురు ముఖ్యమంత్రులు తెలంగాణ నుంచి అనివార్య స్థితిలో నియమింపబడ్డా, వారి పాలనా సమయం ఏండ్లకు మించి లేదు. అదీ వలస పాలకుల సత్తా!
అయితే ఇప్పుడు పరాయివారిని తప్పుబట్టే కంటే తెలంగాణ వాసులై ఈ ప్రాంతానికి ద్రోహం తలపెట్టే వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. దాదాపు 6 దశాబ్దాల ఉద్యమం, అనేక త్యాగాల తర్వాత సాధించుకున్న రాష్ట్రం, ఉద్యమ నాయకుడి పాలనలో సుభిక్షంగా ఉండటం ఈ ద్రోహులకు కంటగింపుగా ఉంది. మేధావులుగా పేరుపడ్డవారు, ఆచార్యులుగా ఉద్యోగం చేసి ఉద్యమకారులమని చెప్పుకొని తిరిగేవాళ్లే సొంత పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే, ఇక చదువు, సంస్కారం లేనివాళ్ల సంగతేమిటి? తన పిల్లలని అత్యంత పేరున్న ఇంగ్లీషు మీడియం స్కూళ్ళల్లో చదివించి, వారు అమెరికాలో, ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాక, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలలో తెలుగు మీడియం మాత్రమే ఉండాలంటాడు మహా మేధావి ప్రొఫెసర్ హరగోపాల్.
కేవలం జయశంకర్ గారి సిఫారసు మీద ఐక్య వేదిక అధ్యక్షుడు, జాయింట్ యాక్షన్ కమిటీకి సభాపతిగా నియమింపబడిన ప్రొఫెసర్ కోదండరామ్ తను 14 ఏండ్లు ఉద్యమం చేసిన కేసీఆర్తో సమానమనుకుంటాడు. లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే స్వయంగా కేసీఆర్ గారే ఆహ్వానించి వారికిష్టమైన స్థానం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో పనిచేయమని అడిగినా ఎందుకు నిరాకరించారు? ప్రొఫెసర్ చక్రపాణి, మల్లేపల్లి లక్ష్మయ్యగారు అటువంటి ఆహ్వానాన్ని మన్నించి ఎంతో చక్కగా వారి పాత్రలు నిర్వహించలేదా? అది కదా మాతృభూమి మీద ప్రేమ, గౌరవం చూపించటమంటే! ఏ పొజిషన్ తీసుకోకుండా తెలంగాణ ద్రోహులైన కాంగ్రెస్, టీడీపీలతో కలిసి సొంత ప్రాంతీయ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవాడు తెలంగాణవాది అవుతాడా? తెలంగాణ ద్రోహి అవుతాడా? ఇంకా పాశం యాదగిరి లాంటి వాళ్లు కూడా చాలామందే ఉన్నారు.
వీరందరికి కేసీఆర్ మీద కోపం, ద్వేషం, పగ ఎందుకో చెప్పగలరా ఈ రాష్ట్ర ప్రజలకు? కేసీఆర్ వంటి నాయకుడు గట్టిగా ఉండకపోతే బయటి శత్రువులు ఈ రాష్ర్టాన్ని బతుకనిస్తారా? ఆయన్ని నియంత అంటారు. అవును, శత్రువుల పట్ల నియంతలా ఉండకపోతే వారిని అదుపులో పెట్టడం సాధ్యమేనా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే, కుళ్ళుమోతు చంద్రబాబు తెలంగాణకు రావలసిన కరెంటు ఇయ్యకపోతే ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎట్లా ప్రవర్తించారు? చంద్రబాబుతో పోట్లాడవలసింది పోయి, అసెంబ్లీలో ఎండిపోయిన మొక్కలు ప్రదర్శించారు.
కేసీఆర్ మీద ఎగబడ్డారు. అదేనా తెలంగాణ మీద ప్రేమ? రాష్ట్రం విడిపోతుందన్నప్పుడు అన్ని పార్టీలకు చెందిన ఆంధ్రా నాయకులు ఒక్కటయ్యారే, అటువంటి ఐక్యత తెలంగాణ కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు ఎప్పుడైనా చూపించారా? కేసీఆర్ కొంచెం పుంజుకొని, కరెంటు, నీళ్లు, ఇతర సౌకర్యాలు కల్పించటం మొదలుపెట్టాక, శాపనార్థాలు మొదలుపెట్టారు. ఇది రాజకీయమా? వీళ్లు నాయకులా? రాష్ర్టానికి మేలు చేసే విషయాల్లో అయినా పాలకుడిని సమర్థించనివాళ్లు ఈ రాష్ర్టానికి అవసరమా?
ఇక బాగా చదువుకున్న మేధావులు (?), అంతో, ఇంతో చదువుకున్న ఇతర నాయకులే ఇట్లా ఉంటే ఇక చదువు, సంస్కారం లేని రేవంత్రెడ్డి నుంచి ఏం ఆశించగలం? చంద్రబాబు ఆత్మీయుడు, బినామీ అయిన ఈయన తన నాయకుడు ఇచ్చిన కోట్లతో కాంగ్రెస్ అధ్యక్షుడై తెలంగాణ రాష్ర్టానికి చేటు తేవడం కాదు, సోనియాగాంధీ, రాహుల్గాంధీని మోసం చేస్తున్నాడు. ఈయన మాటలు ఒక్కొక్కటి ఆయన అసలు ప్రణాళిక బయటపెడ్తున్నాయి? ఇక చేతలు వాటిని బలపరుస్తున్నాయి. రజాకారు సమయంలో ఆంధ్రా ప్రాంతానికి వలస వెళ్లి తెలంగాణ వాళ్లు తమను ఆంధ్రవారు చేసిన అవమానాలు చూసి, విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఫజల్ అలీ కమిషన్ ఎదుట అప్పుడు ఉపాధ్యాయుల ప్రతినిధిగా వెళ్లిన ఆనందరావు తోట 2 గంటల పాటు విలీనం వద్దని వాదించారు. ఆయన ఉర్దూ భాషణకు ముచ్చటపడి ఫజల్ అలీ రెండోరోజు కూడా పిలిచి మాట్లాడితే సుమారు రెండున్నర గంటలు తోట ఆనందరావు ఆంధ్ర, తెలంగాణ విలీనం వల్ల తెలంగాణ ప్రజలకు ఎదురయ్యే సమస్యలు వివరించారు. అయినా బలవంతంగా కలపబడిన ప్రాంతాల పట్ల ఉద్యమంలో ‘ఇడ్లీ, సాంబర్ గో బ్యాక్’ నినాదం ఇచ్చారు ఆనందరావు తోట.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు కష్టాలు ఎక్కువై అన్ని రంగాల్లో తెలంగాణ వారిని తోసేసి ఆంధ్రా వారు ప్రవేశించటం, రైతులకు, నీళ్లు, కరెంటు లేక, తెలంగాణ నిధులు దోపిడీ అవటం, ఉద్యోగాలు ఆంధ్రవారికే కట్టపెట్టడంతో తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టకముందు ఆరేండ్ల కిందటే 1995లో జయశంకర్ ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అన్న నినాదంతో తమ ప్రజలను చైతన్యవంతులను చేయటం మొదలుపెట్టారు. 1969, మే 20న ఆనందరావు తోట నిర్వహించిన సెమినార్లో ఈ రంగాలన్నింటిలో తెలంగాణ వారికి 1956 నుంచి జరిగిన అన్యాయాల మీద వివిధ రంగాల వారు ఆ గోష్ఠిలో పేపర్లు చదివారు.
వాటిని ఒక పుస్తకంగా అచ్చువేసి ఆనందరావు తోట వివరంగా ఉన్న ఆ డాక్యుమెంట్ ఇందిరా గాంధీకి ఇచ్చి తెలంగాణకు జరిగిన అన్యాయాలు వివరించారు. అది తెలంగాణకు జరిగిన నష్టాల మీద మొట్టమొదటి రికార్డు. రేవంత్రెడ్డికి ఇంగ్లీషు రాకపోతే ఎవరితోనైనా చదివించుకోవచ్చు. అందులోనే రైతులకు కరెంటు, నీళ్లు లేవని, తెలంగాణ ఆదాయమంతా ఆంధ్రాకు తరలుతోందని, ఉద్యోగాలు స్థానికేతరులకు ఇస్తున్నారని లెక్కలతో సహా ఉంది. నినాదం 1995లో వచ్చినా అన్యాయం 1956 నుంచీ జరిగింది. విలీనం సమయానికి నిజాం 44 చిన్న ప్రాజెక్టులలో నీళ్ల వసతి కోసం ప్రణాళిక తయారుచేశాడు.
వాటన్నింటికి కలిపి రూ.12 కోట్ల వ్యయమవుతుందని ఇంజినీర్లు లెక్కవేశారు. నిజానికి అవి కట్టి ఉంటే తెలంగాణకు కరువు ఉండేది కాదు. అప్పటికి తెలంగాణకు సర్ప్లస్ నిధులు రూ.67 కోట్లున్నాయి. 1956 నవంబర్లో మైన ఆంధ్రా ప్రాంతం కేంద్ర ప్రభుత్వానికి రూ.12 కోట్ల అప్పులో ఉంది. ఇంక కేంద్రం అప్పు ఇవ్వటానికి నిరాకరించటంతో వారి కన్ను సుసంపన్న తెలంగాణ మీద పడి ఈ ప్రాంతం ఇంత నష్టపోయింది. మార్చిలో బడ్జెట్ పెట్టేటప్పుడు శాసనసభలో తెలంగాణ నాయకులు ఆ సర్ప్లస్ నిధులలోంచి కొంత తెలంగాణకు ఇమ్మని కోరారు. అప్పుడు సంజీవరెడ్డి ఆ డబ్బులు లేవని, ఖర్చయిపోయాయని చెప్పాడు. నిర్ఘాంతపోవడం తెలంగాణ శాసనసభ్యుల వంతయింది. అప్పటికే ఆ సర్ప్లస్ మనీ ధవళేశ్వరం బ్రిడ్జ్, ప్రకాశం బ్యారేజీ బాగుచేయటానికి, రాజకీయ నాయకులు మింగటానికి ఆంధ్ర వెళ్లిపోయాయి.
ఐదు నెలల్లో రూ.67 కోట్లు తినగలిగినవారు 58 ఏండ్లలో తెలంగాణ ధనం ఎంత దోచుకుని ఉంటారు? రాష్ట్ర ఆదాయం అన్ని ఏండ్లల్లో ఈ విధంగా ఉండేది? హైదరాబాద్ 10 శాతం, తెలంగాణ జిల్లాల నుంచి 66 శాతం, ఆంధ్ర 17 శాతం, రాయలసీమ 7 శాతం ఆదాయం వచ్చేది. మరి పెద్ద మనుష్యుల ఒప్పందంలో చెప్పినట్టు తెలంగాణ ఆదాయం ఈ ప్రాంతానికే ఖర్చుచేశారా? ఈ నిధులన్నీ ఏమైనట్టు? 1995 నుంచి 1999 వరకు ముఖ్యమంత్రిగా చేసినవాడు సింగపూరులో 7 నక్షత్రాల హోటళ్లు ఎలా కట్టాడు? ఇక్కడ ఎన్ని కబ్జాలు, అవినీతి చేశాడో ఈ ఆధునిక సరందజ్ఖాన్కు తెలియదా? ఇదీ వలస పాలకుల పాలనలో తెలంగాణ నిధులు మాయమైన తరీఖా!
ఇక నీళ్ళు, చంద్రబాబు ఆంధ్రా కాంట్రాక్టర్తో కాలువలు తవ్వించి వారికి డబ్బు దోచిపెట్టాడు కానీ, వాటిలో నీళ్లు లేవు. రైతులకు కరెంటు ఇవ్వలేదు. బోర్లు వేసి, వేసి విసిగి వేసారిపోయారు రైతులు.చెరువుల నిర్వహణ లేక పైనుంచి వచ్చిన నీరు,వర్షపు నీరు ఆంధ్రా ప్రాంతంలోకి పారింది.ప్రాజెక్టులు కట్టక నీరు లేదు. ఇక రైతు వ్యవసాయం ఎట్లా సాగుతుంది? రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత కరెంటు 9 గంటలు ఇచ్చాననిడప్పుకొట్టుకున్నాడే కానీ నీళ్లు ఇవ్వలేదు. వాటిని పోతిరెడ్డిపాడు ద్వారా మళ్లించుకున్నాడు, ఇదీ తెలంగాణలో నీళ్ల కథ, రైతుల వ్యథ. వలస పాలకుల కాలంలో దాదాపు 35 వేల మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయని అధికారిక లెక్కలే చెప్తున్నాయి. ఇక అనధికారికంగా ఎన్నో!
నియామకాల విషయానికి వస్తే, అక్కడ జరిగినన్ని అవకతవకలు ఏ రాష్ట్రంలోనూ జరిగి ఉండవు. 782 ఆఫీసర్ల క్యాడర్లో కేవలం 30 మంది తెలంగాణ వారు. 6 లక్షల ఎనభై వేల ఉద్యోగాల్లో 42 శాతం తెలంగాణ వారికి దక్కాలి. కొన్ని దక్కాయి, ఏ ఉద్యోగాలు? క్లాస్ 4, టీలు సప్లయి చేసేవారుగా, లిఫ్ట్ బాయ్స్గా లెక్క నంబరు చూపించేవారు. కానీ ఎంతో వివక్ష జరిగింది. ఇదంతా 610 జీవోకు స్పెషల్ ఆఫీసరుగా నియమింపబడ్డ గిర్గ్లానీ చెప్తే గానీ ఎవరికీ తెలియదు. రాయలసీమలో 26 మంది తెలంగాణ వారిని నియమిస్తే వారి కుటుంబాలు కూడా వెళ్లకముందే, వారందరినీ బెదిరించి, భయపెట్టి హైదరాబాద్ రైలు ఎక్కించేసిన వారు తాము మాత్రం హైదరాబాద్లో 90 శాతం ఉద్యోగాలు ఆక్రమించారు. ఇంకా ఎటువంటి అన్యాయాలు చేశారంటే జేఎన్టీయూ స్థాపించినప్పుడు, అది వరంగల్కు ఇచ్చారు. కానీ, ఎన్టీరామారావు దానిని హైదరాబాదుకు మార్చాడు ఆంధ్రావారిని నింపటానికి. ఎందుకని కారణమడిగితే, రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాలు రాజధానిలోనే ఉండాలని సమాధానం ఇచ్చాడు. మరి హెల్త్ యూనివర్సిటీ విజయవాడలోనూ, వేదిక్ యూనివర్సిటీ తిరుపతిలోనూ స్థాపించాడు. ఇటువంటి అన్యాయాలు, అక్రమాలు ఆంధ్ర, రాయలసీమ ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో కోకొల్లలుగా చేశారు.
రాష్ట్రంలో రూ.205 కోట్లు విద్యాశాఖకు ఉండగా అందులో రూ.105 కోట్లు కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఇచ్చారు. అలాగే వైఎస్ఆర్ వేమన, నన్నయయూనివర్సిటీలకు ఇబ్బడిముబ్బడిగా నిధులిచ్చి, మహాత్మాగాంధీ యూనివర్సిటీకి చేయి విదల్చలేదు. పైగా పేరు కూడా తెలంగాణతో ఏ సంబంధం లేని గాంధీ పేరెందుకు? ఇక్కడ నన్నయ వంటి కవులు, రచయితలు లేరా? మల్లినాథ సూరి ఇక్కడివాడే కదా? ఇంకా ట్యాంకుబండ్ మీద 33 విగ్రహాలలో3 మాత్రమే తెలంగాణ వారివి!
ఈ అన్యాయాలన్నీ రేవంత్రెడ్డికి కనపడటం లేదా? కండ్లు, బుర్ర లేవా? పైగా ఈ తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిని సహించలేకపోతున్నాడా? ఆయన అసలు ప్రణాళిక వేరే ఉంది. ఈ ఎన్నికలయ్యాక 10 మందో, 20 మందో కర్మకాలి గెలిస్తే వారితో సహా తను తెలుగుదేశంలోకి దుంకుతాడు. అందుకే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను, పాత కాపులను, విశ్వాసపాత్రులైన కార్యకర్తలను కాకుండా, తనకు ఎస్ బాస్ అనేవాళ్లకు టిక్కెట్లిచ్చాడు. 3వ తారీ ఖు ఫలితాలు వెలువడ్డాక ఈ బండారం బయటపడుతుంది. తెలుగుదేశాన్ని మళ్లీ తెలంగాణలో స్థాపించటానికే కుతంత్రాల చంద్రబాబు అన్ని కోట్లు ఇచ్చి రేవంత్రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి పంపించాడు. అందుకే ఇప్పుడు ఇక్కడ నివాసం ఏర్పర్చుకున్న చంద్రబాబు వర్గం కాంగ్రెస్ను అడ్డుపెట్టుకొని ఏదో చేయాలని చూస్తున్నది. అందుకే రాజన్న బిడ్డ భవిష్యత్తులో తెలంగాణలో ఏదో ఒక లబ్ధి పొంది పాగా వెయ్యాలనుకుంటున్నది. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే శోకంలో 11 రోజులు అన్నం తినని పవన్ కల్యాణ్ ఇక్కడ ఎన్నికలలో కాలు పెడుతున్నాడు.
కుతంత్రాల ఈ రేవంత్రెడ్డి సంస్కారం తెలంగాణది కాదు. కుట్రల, కుతంత్రాల చంద్రబాబుది. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే ఈ ఓటర్లు కూడా తెలంగాణ కాకుండా ఉమ్మడి రాష్ట్రం కోరుతున్నట్టే! మళ్లీ నీళ్లన్నీ ఆంధ్రకు, కన్నీళ్లు తెలంగాణకు! నిధులన్నీ ఆంధ్రకు, సంక్షేమ పథకాలు నీటిమూటలే! నియామకాల సంగతి చెప్పనక్కరలేదు. వారి అధికారం ఏ మాత్రం ఉన్నా తెలంగాణలో ఇప్పుడున్న వసతులు, శాంతి, భద్రత, సౌఖ్యం, మత సామరస్యం అన్నీ మాయమౌతాయి. జాగ్రత్తగా ఆలోచించి తెలంగాణకు నిబద్ధతతో సేవ చేసే బీఆర్ఎస్ కావాలో, రాష్ర్టాన్ని ఇక్కట్ల పాలుచేసే కాంగ్రెస్/టీడీపీ కావాలో ఆలోచించుకోండి. తెలంగాణ ప్రేమికులా, తెలంగాణ ద్రోహులౌతారా? నిర్ణయించుకోండి. సరందజ్ ఖానా? ఇప్పుడు పాలించే నాయకుడా? ఎన్నుకోండి!
కనకదుర్గ దంటు
89772 43484