అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పార్టీ జరుపుతున్న వరుస సమీక్షలకు అయిదు లక్ష్యాలున్నట్టు కనిపిస్తున్నది. అవి, ఓటమికి గల కారణాల అన్వేషణ, అందులో భాగంగా పార్టీ లోపాలను, పరిపాలనా లోపాలను కనుగొనటం. వాటిని సరిదిద్దుకోగలమని పదే పదే ప్రకటించటం ద్వారా పార్టీ శ్రేణులకు, శ్రేయోభిలాషులకు, జన సామాన్యానికి భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తూ, తమకు తాము కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటం. గత పదేండ్లలో చేసిన మంచిని ప్రజలకు గుర్తు చేయటంతో పాటు, వారి తీర్పు తమను పూర్తిగా తిరస్కరించటమేమీ కాదని గ్రహించబూనటం. కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీలను అమలుపరుస్తున్న తీరును ప్రజల దృష్టికి తేవటం. అంతిమంగా, రానున్న లోక్సభ ఎన్నికలకు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలకు పార్టీని సిద్ధపరచటం.
సమీక్ష లక్ష్యాలు ఇవీ అని బీఆర్ఎస్ నాయకత్వం బహిరంగంగా ఏమీ ప్రకటించలేదు. కానీ, ఆ సమావేశాలపై పత్రికలలో వెలువడుతున్న వార్తల సరళిని బట్టి ఇటువంటి అభిప్రాయం కలుగుతున్నది. పైన పేర్కొన్న అయిదు అంశాల్లోకి వెళ్లే ముందు ఒక మాట చెప్పాలి. ఎన్నికల్లో పార్టీలు గెలుస్తుంటాయి, ఓడుతుంటాయి. నిజానికి గెలిచినవారు తాము ఎందుకు గెలిచామో, ఓడినవారు తామెందుకు ఓడామో సమీక్షించుకోవాలి. ఆ పని చేసినట్టయితే, గెలిచినవారు తాము భవిష్యత్తులో కూడా గెలుస్తూనే ఉండటానికి, ఓడినవారు మునుముందు ఓడకుండా ఉండటానికి అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. అది సరైన ప్రజాస్వామిక పద్ధతి అవుతుంది. కానీ, మన దేశంలో, గెలిచిన పార్టీలు సమీక్షించుకోవటమనే పద్ధతి లేనే లేదు. కనుకనే ఒకసారి గెలిచినాక తప్పులు చేసి మరోసారి ఓడుతుంటారు.
ఓడిపోయిన పార్టీలలో అన్నీ కాకున్నా అనేకం సమీక్షలు జరుపుకొనే సంప్రదాయం మన దేశంలో ఉన్నది. కానీ, అందులో తేడాలున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ వంటివి ఆ సమీక్షల వివరాలు బయటకు రానివ్వవు. కాంగ్రెస్కు అయితే అదొక మొక్కుబడి తంతు మాత్రమే. సమీక్ష కోసం ఒక కమిటీని వేస్తారు. అది నివేదిక అయితే ఇస్తుంది. కానీ ఆ నివేదిక ఎప్పుడూ బయటికి రాదు. వార్తలకు ఎక్కదు. దాని ప్రకారం ఏవైనా చర్యలు తీసుకున్నదీ లేనిదీ వారు చెప్పరు, బయటకు కనిపించదు. మనకు తెలియదు. నాలుగు రోజులకు అందరూ అసలు కమిటీ మాటే మరిచిపోతారు. అందుకే దానిని ఒక తంతు అంటున్నది. బీజేపీ వలెనే కమ్యూనిస్టులు కూడా తమ సమీక్షలను పార్టీ ఉన్నతస్థాయి వేదికలలో సీరియస్గా చర్చిస్తారు. కాకపోతే వివరాలు బయటకు రావు.
ఈ పరిస్థితినంతా దృష్టిలోకి తీసుకొని చూసినప్పుడు, ప్రస్తుతం సాగుతున్న బీఆర్ఎస్ సమీక్షలు వీటన్నింటికి భిన్నమైనవని ఎవరైనా చెప్పగలరు. పార్టీ మౌనంగా ఊరుకొని విషయాన్నంతా సంస్థ అధినేత కేసీఆర్కేమీ వదిలివేయలేదు. లేదా, ఒక కమిటీని వేసి, దానిని, దాని నివేదికనూ దైవాధీనమనుకొని ఊరుకోలేదు. లేదా, నాయకత్వం తాను ఎంపిక చేసిన ఎవరో కొద్దిమందిని రప్పించుకొని గదిలో కూర్చొని చర్చించే పద్ధతిని అనుసరించలేదు. ప్రతి రోజూ ఒక లోక్సభ నియోజకవర్గానికి చెందిన కొన్ని వందల మంది పార్టీ ముఖ్యులను సమావేశపరిచి, వారు నిర్మొహమాటంగా చెప్తున్న అభిప్రాయాలను వింటున్నది. వాటికి స్పందిస్తున్నది. వారి అభిప్రాయాలు చేదుగా తోచినప్పుడు ఎదురు వాదనలతో వారి నోరు మూయించే పద్ధతిలో వెళ్లటం గాక, వాటిని స్వీకరిస్తున్నది. సమీక్షా సమావేశాల్లో ఈ విధమైన వివరాలన్నీ కాకున్నా అనేకం పత్రికల్లో వెలువడుతున్నాయి కూడా. వాటిలో కొన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, లేదా ఇతర నాయకులు తామే స్వయంగా మీడియాకు వివరిస్తున్నారు.
మన రాజకీయపార్టీల ఎన్నికల సమీక్షలు, ముఖ్యంగా ఓటమికి సంబంధించి, ఈ విధంగా జరగటం మనం ఎప్పుడూ చూడలేదు, వినలేదు. ఇక్కడనే కాదు, మొత్తం దేశంలోనే. ఇటువంటి సంప్రదాయాన్ని ఆరంభించినందుకు బీఆర్ఎస్ను అభినందించినా, అభినందించకపోయినా, కనీసం ఇదొక భిన్నమైన కొత్త పద్ధతి అని మాత్రం గుర్తించవలసి ఉంటుంది. పోతే, లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షల తర్వాత అసెంబ్లీల వారీ సమీక్షలు నిర్వహించగలమని పార్టీ ప్రకటించింది. ప్రస్తుత సమీక్షలలో చర్చలు స్వేచ్ఛగా జరుగుతున్నట్టు బయటగల పార్టీ శ్రేణులు కిందిస్థాయి వరకు గమనిస్తున్నాయి గనుక, అసెంబ్లీ సమీక్షలలో పాల్గొనేవారు మరింత ధైర్యంగా తమ అభిప్రాయాలు వెల్లడించగలరని భావించవచ్చు.
అవి విని స్వీకరించదగినవి స్వీకరించేందుకు కూడా నాయకత్వం సిద్ధపడగలదని భావించాలి. దీనంతటి ప్రభావం సానుకూలమైన రీతిలో, ప్రజాస్వామికమైన విధంగా పార్టీ సాధారణ కార్యకర్తలపైన, జన సామాన్యంపైన కూడా పడగలదు. నాయకత్వం హామీ ఇస్తున్నట్టు పార్టీ సంస్థాగత నిర్మాణం కింది నుంచి పైవరకు జరిగి, శిక్షణలు సైతం ఇచ్చే క్రమంలో దీనంతటి ఫలితాలు కనిపిస్తాయి. యథాతథంగా ఇదంతా ఇతర పార్టీల కన్న భిన్నంగా, ఆశావహంగా ఉన్నమాట నిజం. అందుకు పార్టీని అభినందిస్తూనే , రాగలకాలంలో చూడవలసింది వాస్తవాచరణను. ఆ పని జరిగినట్టయితే పార్టీ ఒక పెద్ద గాలి గుమ్మటంగా మిగిలిపోవటం గాక, బలమైన పునాదులతో పటిష్ఠమైన నిర్మాణంగా మారుతుంది. అందుకు పార్టీ చెప్పగల రాజకీయ, ఆర్థిక, సామాజిక సిద్ధాంతాలు తోడవుతాయి.
ఇక, మొదట చెప్పుకొన్న అయిదు అంశాల విషయానికి వద్దాము. అయితే, అవి ఈ సమీక్షలలో ఏ విధంగా కనిపిస్తున్నాయనేది ఒక్కొక్కటిగా వివరాల్లోకి వెళ్లలేం. వార్తలు వరుసగా చదువుతున్నవారికి అవి దృష్టికి వస్తూనే ఉన్నాయి. ఎన్నికల్లో ఓటమికి ముఖ్య కారణాల్లో పార్టీ వ్యవస్థాగత నిర్మాణం లేకపోవటం, కార్యకర్తలతో నిత్య సంబంధాలు లోపించటం, పరిపాలనపై దృష్టిని ఎక్కువగా కేంద్రీకరించి పార్టీని ఉపేక్షించటం వంటివి ఉన్నట్టు ప్రస్తావనకు వచ్చింది. వాస్తవానికి పార్టీని ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ‘వారధి’గా నిర్మించగలమనే మాట నాయకత్వం స్వయంగా కొన్నిసార్లు అన్నదే. ఆ పని ఎందుకైతేనేమి జరగలేదు. ఇక నుంచి జరుగగలదని భావించాలి.
పార్టీకి తగిన నిర్మాణంతో పాటు యుద్ధకాలపు విధులు, శాంతికాలపు విధులు అనేవి ఉంటాయి. ఎన్నికలు, లేదా ఏవైనా అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు అవి యుద్ధకాలపు విధులవుతాయి. తక్కినదంతా శాంతికాలం. అప్పుడు ప్రభుత్వ లేదా పార్టీ విధానాలను, పథకాల గురించి పార్టీ వారు స్వయంగా అర్థం చేసుకుంటూ వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. వాటి అమలులోని లోటుపాట్లను అధికారులు, లేదా ప్రభుత్వ దృష్టికి, పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకుపోయి సరిదిద్దేట్టు చూడాలి. ఆయా అంశాలపై ప్రజల ఫిర్యాదులను, సూచనలను కూడా పై వారికి చెప్తుండాలి.
పరిపాలనా లోపాలకు సంబంధించిన, ఉదాహరణకు, దళితబంధు, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగ-ఉపాధి కల్పన, పోడు భూముల పంపిణీ వంటి అంశాలు సాంకేతికంగా చూసినప్పుడు పరిపాలనా వైఫల్యాలు కావు. వాస్తవిక పరిస్థితుల కారణంగా వాటి అమలుకు కొన్ని పరిమితులు ఏర్పడ్డాయి. ఆ పరిమితులకు లోబడుతూ అవి ముందుకు సాగాయి. ఉదాహరణకు, పంచుదామన్నా భూమి అందుబాటులో లేదు. ఉద్యోగ- ఉపాధి కల్పన నిజంగానే గణనీయంగా జరిగింది. దళితబంధు, ఇండ్ల వంటివి భారీ పథకాలు అయినందున ఒకేసారి సాధ్యం కాదని, దశలవారీగా అమలుచేయగలమని మొదటినుంచి చెప్తూనే ఉన్నారు. అయితే, ఇటువంటి పరిపాలనా సంబంధమైన విషయాలు, లేదా వాటి ఆచరణలోని పరిమితులు, సాధక బాధకాల గురించి ప్రజల విశ్వాసంలోకి తీసుకొని పారదర్శకంగా చెప్పటం కూడా పరిపాలనాపరమైన బాధ్యతే అవుతుంది. ఆ పని సరిగా చేయలేకపోవటం పరిపాలనా వైఫల్యమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ తన శాంతికాలపు విధులను గుర్తెరిగి పనిచేస్తూ, ఇటువంటి విషయాలను అర్హులకు సవ్యంగా వివరించగలిగి ఉంటే ప్రజలలో వ్యతిరేకత చాలా తగ్గి ఉండేది.
ప్రభుత్వ వైఫల్యాలు, వాటిని ఎత్తి చూపటం మాట ఎట్లున్నా, అన్నింటికన్న ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకత్వం ఈ సమీక్షల సమయంలోనే ఒక సందర్భంలో అన్నట్టు ఆత్మ పరిశీలన చేసుకొని, దిద్దుబాటు చర్యలు చేపట్టడమన్నది ప్రధానం. అందువల్ల తమ పార్టీ శ్రేణులకు, ప్రజలకు నమ్మకం కలగటం మొదలవుతుంది. ఒకవైపు ఈ పని స్పష్టమైన రీతిలో చేస్తూ, రెండవ వైపు ప్రస్తుత ప్రభుత్వం తన హామీలను అమలు చేయగలుగుతున్నదా లేదా అనే విషయం ఎప్పటికప్పుడు ఎత్తిచూపాలి. తామట్లా చేయగలమని నాయకత్వం చెప్పటం ఈ సమీక్షలలో ముందుకువచ్చిన విషయం. దానిపై ఇప్పటికిప్పుడు ఒకేసారి పూర్తిస్థాయి విమర్శలు కాకుండా, ప్రభుత్వం స్వయంగా తానే తేదీలతో సహా ప్రకటించిన పథకాల గురించే మాట్లాడదలచుకున్నామని, తక్కినవాటిపై వందరోజుల గడువు తీరేవరకు వేచి చూడగలమని, అట్లాగే నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలోనే మాట మార్చడం, రైతుబంధు ఆలస్యాలు, రుణమాఫీ గురించి ఏమీ చెప్పకపోవటం వంటి అంశాలను ప్రస్తావించగలమని సమీక్షా సమావేశాలలో పేర్కొంటున్నారు. అది సమంజసమే కూడా.
ఆ విధంగా చూసినప్పుడు, సమీక్షలు ఒకవైపు బీఆర్ఎస్ తనను తాను ఆత్మ పరిశీలనతో సరిదిద్దుకోవటం విషయం లో గానీ, మరొక వైపు ప్రతిపక్షంగా తన బాధ్యతల నిర్వహణకు తనను తాను సమాయత్తం చేసుకోవటంలో గానీ, అం తిమంగా పార్టీని తమ శ్రేణులకు, ప్రజలకు కూడా తిరిగి విశ్వాసం కలిగించి బలోపేతం చేయబూనటంలో గానీ సూత్రరీత్యా, థియరెటికల్గా సరైన మార్గంలోనే అడుగులు వేస్తున్నట్టు సూచిస్తున్నాయి. ఇదంతా ఎంతగా ఆచరణలోకి పరిణమిస్తే అంత మంచి జరుగుతుంది.
టంకశాల అశోక్