మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లా కుర్బీ గ్రామంలో ఒక ఆదివాసీ కూలీపై మూత్రం పోసిన ప్రవేశ్ శుక్లాపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేసిన అక్కడి ప్రభుత్వం.. ఇటీవల అతడి ఇంటిని బుల్డోజర్తో కూల్చివేసింది. నిరసనల్లో పాలుపంచుకున్నారంటూ గతంలో ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ వంటి రాష్ర్టాల్లోనూ ఇలాంటి కూల్చివేతలు జరిగాయి.
ఉత్తరాఖండ్లో హత్యకేసు నిందితులకు సంబంధించిన వ్యాపార సముదాయాన్ని ప్రభుత్వం నేలమట్టం చేసింది. అయితే ఇలాంటి కూల్చివేతలకు అక్రమ నిర్మాణాలని ముద్ర వేస్తున్న ప్రభుత్వాలు.. కోర్టులకు సైతం అదే సమాచారాన్నిస్తున్నాయి. అటు ప్రజల్లో మాత్రం చేసిన తప్పునకు ఇదే శిక్ష అంటూ ప్రచారం చేస్తున్నాయి. ఇది నాణేనికి ఒక వైపే. మరోవైపు చూస్తే ఇండ్లను కూల్చివేయడంతో సదరు నిందితుల కుటుంబాల బాధలు వర్ణనాతీతం. బుల్డోజర్ శిక్షను అమలుచేసేముందు సదరు కుటుంబ సభ్యుల గురించి ప్రభుత్వాలు ఆలోచించకపోవడం బాధాకరం.
యూపీ నుంచి షురూ..
ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక ఈ బుల్డోజర్ జస్టిస్ షురూ అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత అది క్రమంగా మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, అసోం ఇలా బీజేపీ పాలిత రాష్ర్టాలన్నింటికీ వ్యాపించింది. మొదట మాఫియా, క్రిమినల్స్ ఇండ్లను ప్రభుత్వాలు కూల్చడం ప్రారంభించాయి. ఆ తర్వాత పలురకాల నిరసనల్లో పాల్గొన్న సామాన్య వ్యక్తుల ఇండ్లపై కూడా బుల్డోజర్లు నడిపించడం షురూ చేశారు. ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ర్టాల్లో ఇలాంటి కూల్చివేతలు ఎక్కువగా జరిగాయి. ముందుగా ఇలాంటి చర్యలకు పాలకులు ఒక మతానికి సంబంధించిన వారిని లక్ష్యంగా చేసుకున్నారనే విమర్శలు వచ్చాయి.
ఇలాంటి చట్టవ్యతిరేక కూల్చివేతలపై పలువురు హైకోర్టు, సుప్రీంకోర్టులను సైతం ఆశ్రయించారు. కాగా వీటిని అక్రమ నిర్మాణాలుగా ప్రభుత్వాలు కోర్టులకు తెలిపాయి. దీంతో ‘కూల్చివేతలనేవి చట్టానికి లోబడి ఉండాలని.. అవి ప్రతీకారం తీర్చుకునేలా ఉండకూడదు’ అని యూపీ ప్రభుత్వాన్ని గతంలోనే సుప్రీంకోర్టు హెచ్చరించింది. అంతేకాకుండా అసోంలో విచారణ ముసుగులో ఐదుగురు నిందితుల ఇండ్లపై బుల్డోజర్ నడిపించినందుకు గౌహతి కోర్టు అసోం పోలీసు సూపరింటెండెంట్ను మందలించింది. ఆ తర్వాత లైంగికదాడులు, హత్యల లాంటి నేరాలు చేసినవారి ఇండ్లనూ కూల్చడం ప్రారంభించారు. బీజేపీ పాలిస్తున్న నాలుగైదు రాష్ర్టాల్లో ఇలాంటి న్యాయాన్నే అమలుచేస్తున్నట్టు కనిపిస్తున్నది.
రాజకీయ ప్రయోజనాల కోసమే!
తప్పు చేసినవారికి చట్ట ప్రకారం శిక్ష పడాలి. దీనికోసం పోలీసులు, న్యాయస్థానాలు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి. నేర నిర్ధారణ అనేది చట్టపరమైన ప్రక్రియ ద్వారానే జరగాలి. వారికి శిక్ష విధించవలసింది న్యాయస్థానమే తప్ప అధికారంలో ఉన్న రాజకీయ నాయకులో, అధికారులో కాదు.
అయితే నిందితులను గుర్తించడం, ఆధారాలు సేకరించడం, కేసు నమోదు చేయడం, అరెస్టులు చేయడం, న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టడం వంటి సుదీర్ఘ ప్రక్రియ వల్లనే, న్యాయంపై అధిక శాతం ప్రజల్లో అవిశ్వాసం ఏర్పడుతున్నదని, అందుకే తమ ప్రభుత్వం ఇన్స్టంట్ జస్టిస్ మార్గాన్ని ఎంచుకున్నదని ఆయా రాష్ర్టాల పాలకులు బహిరంగంగానే చెప్తున్నారు. చట్టప్రకారం నిందితులకు సరైన శిక్ష పడకపోతే బాధితులకు న్యాయం జరగదని సోషల్ మీడియా ద్వారా తెగ ప్రచారం చేస్తున్నారు.
ఇండ్లను కూల్చివేసిన తర్వాత ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మంత్రుల ప్రకటనలు సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎవరు తప్పుచేసినా ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుందని స్వయంగా పాలకులే హెచ్చరిస్తుండటం రాజ్యాంగంపై, చట్టాలపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నది. అంతేకాకుండా ప్రజల ప్రాథమిక హక్కులకు తీవ్ర భంగం కలుగుతున్నది. మరోవైపు కూల్చివేతలు జరుగుతున్నప్పుడు కొందరు అధికారులు వాటిని తమ ట్వీట్లలో నేరానికి విధించిన శిక్షగా పేర్కొంటుండటం గమనార్హం. తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వాలు ఇలా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు ఎదుర్కొంటున్నాయి.
కుటుంబానికెందుకు శిక్ష?
మధ్యప్రదేశ్లో నిందితుడు ప్రవేశ్ తల్లిదండ్రులు తమ ఇంటిని కూల్చొద్దని వేడుకున్నా అధికారులు కనికరించలేదు. రాజకీయ కక్షలతో పాత వీడియోను వైరల్ చేశారని, ఇంటిని కూల్చివేస్తే తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లాలని నిందితుడి సోదరి చెప్పినా పట్టించుకోలేదు. ప్రయాగ్రాజ్లో జరిగిన నిరసనల్లో జావేద్ మహమ్మద్ అనే వ్యక్తి ఇంటిని కూల్చివేయగా, అది అతని భార్య పేరున ఉన్నదని, ఆమె కుటుంబం నుంచి బహుమతిగా వచ్చినట్టు తేలింది. ఈ ఇంటిపై ఎలాంటి వివాదాలు లేకున్నా కూల్చివేయడం చట్ట విరుద్ధమని ఆ కుటుంబం వాపోయింది. ఢిల్లీలోని జహంగీర్పురిలో అక్రమ నిర్మాణాలంటూ చేపట్టిన ఇండ్ల కూల్చివేత బాధితులకు కన్నీళ్లనే మిగిల్చింది. అన్ని పత్రాలున్నప్పటికీ తన జ్యూస్ షాప్ను ధ్వంసం చేశారంటూ గణేశ్కుమార్ గుప్తా అనే చిరువ్యాపారి వాపోయారు.
బుల్డోజర్లతో ఓ చిన్నపాటి ఇంటిని కూల్చేస్తుంటే అందులో నివసించే ఓ మహిళ విలవిల్లాడిపోయింది. కూల్చివేయొద్దంటూ అధికారులను బతిమాలింది. అయినప్పటికీ కనికరం చూపని అధికారులు.. చూస్తుండగానే ఆమె సామగ్రిని జేసీబీలతో ఎత్తి ట్రాక్టర్లోని మట్టిలో పడేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించినా ఇండ్లనూ కూల్చివేసిన సందర్భాలున్నాయి.
ఇలాంటి చర్యల ద్వారా కోర్టు బయటే పాలకులు నేరాలను నిర్ధారించినట్టవుతున్నది. దీంతో నిందితులకే కాకుండా వారి కుటుంబాలకు సైతం శిక్షలు వేసినట్టవుతున్నది. ఒక వ్యక్తి చేసిన నేరానికి గానూ అతని యావత్తు కుటుంబాన్ని సామూహికంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. ఇలాంటి చర్యలకు రాజ్యాంగంలో, ప్రజాస్వామ్యంలో చోటులేదు. ఇదిలా ఉంటే ఇండ్లను కూల్చివేయడం ద్వారా సదరు నిందితుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నిలువనీడ లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నాయి. నివాస గృహాన్ని కలిగి ఉండటమనేది ప్రాథమిక హక్కుగా గతంలోనే పలు కేసుల్లో కోర్టు తీర్పులు ఉండగా.. ఎలాంటి తప్పు చేయకున్నా ఆ కుటుంబాలు ఆ హక్కును కోల్పోతున్నాయి.
(వ్యాసకర్త: ఫ్రీలాన్స్ జర్నలిస్ట్)
ఫిరోజ్ ఖాన్
96404 66464