కేంద్రం 2016లో ఆకస్మికంగా నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నది. అలాగే 2020లో ముందస్తు హెచ్చరిక లేకుండానే కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. ఇప్పుడు అలాంటి అనాలోచిత నిర్ణయమే మూడు క్రిమినల్ చట్టాలను సవరించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టటం. ఈ చట్టాలను సవరించటం వల్ల ఎవరికీ ఉపయోగం లేకపోగా అన్ని వర్గాల వారిని తీవ్ర గందరగోళానికి గురిచేస్తాయి.
రాజకీయనాయకులు, జర్నలిస్టులు,లాయర్లు, సామాన్య ప్రజలకు కూడా కొన్ని ఇండియన్ పీనల్ కోడ్స్ (ఐపీఎస్ 1860 )సెక్షన్లు తెలు సు. 302 అంటే హత్యకు శిక్ష, 307 అంటే హత్యాయత్న నేరానికిశిక్ష, 420 అంటే ఎవరినైనా మోసం చేస్తే శిక్ష అని బాగా తెలుసు. అవి గత 183 సంవత్సరాల నుంచి అమల్లో ఉన్నాయి గనుక వాటిని గుర్తు పెట్టుకోవటం తేలిక. తరతరాలుగా జడ్జీలు, న్యాయవాదులు, జూనియర్ లాయర్లు, న్యాయకళాశాలల అధ్యాపకులు ఐపీసీని అధ్యయనం చేయటం, ఆయా సెక్షన్లు గుర్తు పెట్టుకోవటం, వాటిని నిత్యం కోర్టుల్లో ఉపయోగించవలసి రావటం వల్ల అందరికీ గుర్తుండిపోయాయి.
ఒకవేళ ఐపీసీకి నిజంగానే సవరణలు ఆమోదం పొందితే పై వర్గాల్లో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగుతుంది. ఇది అర్థం కావటం కోసం ఒక ఉదాహరణ చెబుతాను. మనిషి శరీరంలో గుండె ఎడమ వైపు ఉంటుంది అని నేర్చుకుని, లేదు అది కుడి వైపు ఉంటుంది అని పాఠాన్ని మార్పు చేస్తే కొత్త విద్యార్థులు ఎలా గందరగోళానికి గురవుతారో, రేపు కొత్త న్యాయ విద్యార్ధులకు ఐపీసీ పాఠం చెప్పే వారి పరిస్థితి అలాగే ఉంటుంది. ఇలాంటి సుపరిచితమైన సెక్షన్లు ఐపీసీలో 511 ఉంటాయి. ఒక్కో సెక్షన్ పై వివరణ, విశ్లేషణ కోసమే మరో వెయ్యి పేజీల గ్రంథం ఉంటుంది. మన ఐపీసీ మన దేశంలోనే కాదు, పాకిస్తాన్, మలేషియా, ఇండోనేషియా వంటి ఇరుగు, పొరుగు దేశాల్లోనూ యథాతథంగా అమలులో ఉన్నది. ఐపీసీ 1861పై మన సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులను అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల సుప్రీంకోర్టులు పరిశీలించి తమ తీర్పులలో ఉటంకిస్తాయి. ఇలాంటి ఇండియన్ పీనల్ కోడ్ను సవరించి, పనికిరాని లేక వద్దనుకున్న సెక్షన్లు తొలగించి, అవసరమైన, కొత్తగా తేవాలనుకు న్న సెక్షన్లు చేర్చవచ్చు. అది చేయకుండా కేవలం సంచలనం కోసం ఇండియన్ పీనల్ కోడ్ను ‘భారతీయ న్యాయ సంహిత-2023 (బీఎన్ఎస్)’ అనే హిందీ పేరుతో పిలవాలని సంకల్పించారు. ఇది ఇతర రాష్ర్టాలపై భాషాపెత్తనం చెలాయించడం కిందకు వస్తుందని తమిళనాడు సీఎం స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇక క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1973, దీనికి ముందు 1898 కోడ్ ఉండేది) గురించి కూడా చాలా వర్గాల వారికి ఎంతో కొంత అవగాహన ఉం టుంది. అటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను, ఇక పై ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) -2023’ అనే హిందీ పేరుతో పిలువాలని సవరణ ప్రవేశ పెట్టారు. ఇందులో చేసిన ప్రమాదకరమైన సవరణ ఏమంటే, ఒక నిందితునికి కోర్టు 14 రోజులు మాత్రమే రిమాండు విధించటానికి బదులు, ఇకమీదట 60-90 రోజుల వరకు రిమాం డు విధించేలా కొత్త చట్టంలో సవరణ తలపెట్టారు. ఈ కోడ్లో మొత్తం 484 సెక్షన్లు ఉండగా మొత్తం తారుమారు చేసి ఘనకార్యం చేసినట్టు భావిస్తున్నారు. వారి చర్యతో మొత్తం దేశ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ను తలకిందులుగా వేలాడదీసినట్టయింది.
కొత్తగా సవరణలు చేసిన మూడు క్రిమినల్ చట్టాలలో అత్యంత కీలకమైనది భారత సాక్ష్య చట్టం-1872 (ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్). ఇది కూడా మన ఇరుగు,పొరుగు దేశాల్లో అమలులో ఉన్నది. ఈ చట్టానికి ‘భారతీయ సాక్ష్య బిల్ -2023’ అనే కొత్త పేరు తగిలించి ఇందులో ఉన్న మొత్తం167 సెక్షన్లను ఇష్టారీతిగా మార్పులు చేసి తలకిందులు చేశారు.
కాలం మారుతున్న కొద్దీ వివిధ చట్టాలను మార్పుచేసి, సవరణలు చేసి పార్లమెంటులో ఆమోదించిన తర్వాత అమలు చేస్తే ఎవ్వరూ అభ్యంతరం పెట్టరు. కానీ కేవలం సంచలనం కోసం, మెరుపు దాడులు చేసినట్టు ఒకేసారి అత్యంత ప్రమాదకరమైన సవరణలు చేయటం కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మంచిది కాదు. ఈ సంహితలు అమ లు జరిగే ముందు ఎన్నో చర్చలు పార్లమెంటు లోపల, బయట జరగాల్సి ఉన్నది. ఈ సవరణల సమగ్ర అధ్య యనానికి చాలా సమయం పడుతుం ది. ప్రజలకు అసౌకర్యం కలిగించే అనాలోచిత నిర్ణయాలు తీసుకోవటం కేంద్ర ప్రభుత్వానికి అలవాటుగా మారింది.
(వ్యాసకర్త : సీనియర్ న్యాయవాది, రచయిత )