ప్రధాని మోదీ ఈ మధ్య తన అమెరికా పర్యటనలో అధ్యక్షుడు బైడెన్తో చర్చల సందర్భంగా, వేరే సందర్భాల్లోనూ భారతదేశంలో అమెరికా పెట్టుబడుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ విషయంలో ఇప్పటికే దేశీయంగా 2014, సెప్టెంబర్లో ఆవిష్కరించిన ‘మేకిన్ ఇండియా’తో పాటుగా, దాని కొనసాగింపుగా గత 2, 3 సంవత్సరాల నుంచి ప్రారంభించిన పీఎల్ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు) పథకంపైన ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నది.
ఇక, మానవ వనరుల నిపుణతల విషయంలో మనం చాలా బలహీనంగా ఉన్నాం. ఈ దిశగా స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాలు వచ్చినా, అవి ఇప్పటికి కూడా పెద్దగా ఫలితాలను చూపలేక పోతున్నాయి. ప్రస్తుతం కొత్తగా ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో నిపుణుల శిక్షణకు కృషిచేసే ప్రయత్నాలు మొదలవుతున్నాయి. కనీసం ఈ శిక్షణలు అయినా తానెక్కే రైలు జీవితకాలం లేటు అన్నట్టుగా ఉండవని ఆశిద్దాం! మూడోది… యువజనులు అధికంగా ఉండటం. ఇది మన దేశానికి వరంగా ఉండాలంటే వారికి మనం తగిన ఉపాధిని కల్పించగలగాలి. దానికిగాను వారందరికీ తగిన నిపుణతలూ, విద్యను అందించగల పరిస్థితి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు నేడు అది లోపించింది.
వాస్తవ పరిస్థితులను గమనిస్తే అటు ‘మేకిన్ ఇండియా’లో కానీ, ఇటు ‘పీఎల్ఐ’లో కానీ నేటివరకు ఆశించినంత ఫలితాల్లేవు. 2023 ఆర్థిక సంవత్సర కాలంలో దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2022తో పోలిస్తే 22 శాతం తగ్గాయి. అలాగే దేశ స్థూల జాతీయోత్పత్తిలో సరుకు ఉత్పత్తిరంగం తాలూకు వాటాను కనీసం 25 శాతానికి చేర్చాలన్న ఆశలు కూడా ఇప్పటివరకు అడియాసలుగానే మిగిలిపోయాయి. నిజానికి, కొవిడ్ అనంతర కాలంలో దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భారీగా దెబ్బతినడంతో… కోట్లాది మంది నగర ప్రాంత కార్మికులు, తిరిగి గ్రామీణ వ్యవసాయంపై ఆధారపడటం పెరిగింది. ఫలితంగా, ప్రస్తుతం దేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయం వాటా కాస్త పెరిగింది. ఇది కచ్చితంగా తిరోగమనమే. ఎందుచేతనంటే, వ్యవసాయ రంగంలో ఇప్పటికే అవసరానికి మించిన స్థాయిలో దేశీయ మానవ వనరులు కేంద్రీకృతమై ఉన్నాయి. ఇతరేతర ఆర్థిక రంగాల్లో ఉపాధిని పొందే అవకాశాలు రాక, లేక కోటానుకోట్ల మంది నేడు వ్యవసాయ రంగంలోనే చిక్కుకొని ఉండిపోయారు. ఈ పరిస్థితిని మార్చగలగడంలో అటు ‘మేక్ ఇన్ ఇండియా’ కానీ, ఇటు ‘పీఎల్ఐ’ కానీ పెద్దగా ఫలితాలను సాధించలేదు.
పీఎల్ఐ కింద ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రధానంగా 14 రంగాలను ఎంపిక చేశారు. వాటిలో ఎలక్ట్రానిక్స్ రంగం, ఫార్మా రంగం వంటి కొద్దిపాటి రంగాల్లో మాత్రమే ఈ పథకం కొంత ప్రభావాన్ని చూపగలిగింది. ఆ మేరకు దేశం నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతుల వంటివి భారీగా పెరిగాయి. కానీ, ప్రస్తుతం దేశంలో మొబైల్ తయారీరంగంలో జరుగుతోంది- కేవలం విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న విడిభాగాల అసెంబ్లింగ్ మాత్రమేనని, పూర్తిస్థాయి దేశీయ ఉత్పత్తి కాదనే విమర్శలున్నాయి. అలాగే, నేటి వరకు పీఎల్ఐ పథకం ఆశించిన స్థాయిలో ఉపాధి కల్పన దిశగా సాధించింది కూడా పెద్దగా ఏమీ లేదనే విమర్శలూ ఉన్నాయి.
మరి, ఈ పరిస్థితికి కారణాలేమిటి? మనం మన దేశీయ సరుకు ఉత్పత్తిరంగాన్ని ఎందుకు ముందుకు తీసుకువెళ్లలేకపోతున్నాం? దీనికి కారణాలనేకం. ముఖ్యంగా మోదీ ప్రధాని అయిన తర్వాత మేకిన్ ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ, ప్రస్తావించిన భారతదేశం తాలూకు మూడు ప్రధాన బలాలుగా చెప్పుకున్నవాటిలో 1. దేశీయ డిమాండ్, 2. ప్రజాస్వామిక దేశం కావటం, 3. ప్రపంచంలోనే యువజనులు అత్యధికంగా ఉన్న దేశం కావడం అనేవి ఉన్నాయి. దేశంలో పారిశ్రామిక ఎదుగుదలకు ఈ మూడు అంశాలను ప్రధాన ఇతివృత్తంగా లేదా మన బలంగా మోదీ భావించారు. మరి, ఈ లెక్కన 2014లో ప్రకటించిన మేకిన్ ఇండియా అనంతరం – ఈ మూడు అనుకూలతలతో, భారత్ పారిశ్రామికంగా గణనీయంగా పురోగమించి ఉండవలసింది. కానీ అది జరగలేదు. పారిశ్రామిక ప్రగతి ఇప్పటికీ మనకు ఎండమావిగానే మిగిలిపోయింది. దీనికి కారణాలేమిటి?
మొదటగా, పైన పేర్కొన్న మూడు అనుకూలతల్లో ఒకటైన దేశీయ డిమాండ్ను చూద్దాం. డిమాండ్ అనేది ప్రధానంగా ప్రజల ఆదాయాలు. తద్వారా వారి కొనుగోలు శక్తిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో లోపించింది ఇదే. ఉదాహరణకు దేశంలోని అత్యధిక శాతం జనాభా అయిన రైతాంగ కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం ఇప్పటికీ రూ.10,218 మాత్రమే ఉన్నది. ఈ మొత్తం దేశీయ తలసరి ఆదాయం కంటే కూడా తక్కువగానే ఉన్నది. అంటే సగటున ఐదుగురు సభ్యులున్న దేశీయ రైతువారీ కుటుంబాల ఆదాయాలు అతి తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఈ ఆదాయంలో కూడా సింహభాగం, సాగుబడి నుంచి కాక ఇతరేతర (పశు పోషణ, కూలీ పనులకు వెళ్లడం తదితర) ఆదాయ మార్గాలపై ఆధారపడి ఉన్నది.
కాగా, ప్రస్తుతం తాజా గణాంకాల ప్రకారం సుమారు 16 నెలలకు పైగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద జనాల వేతనాలు (మార్చి 31, 2023 గణాంకాలు) కుంచించుకుపోతున్నాయి. దీనికి ఒక ప్రధాన కారణం ఒకప్రక్కన గ్రామీణ పేదల వేతనాలలో పెరుగుదల లేకపోవడం, మరోప్రక్క ద్రవ్యోల్బణం వారి కొనుగోలు శక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉండటం. ఈ సందర్భంలోనే, జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్న కూలీ డబ్బు దేశీయ కనీస వేతనం కంటే తక్కువ స్థాయిలో ఉండటాన్ని కూడా గమనించవచ్చు.
దేశంలోని నగర ప్రాంత జనాభా ఆదాయాలు కూడా కొవిడ్ అనంతర కాలంలో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నిరుద్యోగం పెరగడం, వేతనాల పతనం, ధరల పెరుగుదల వంటివన్నీ కూడా నగర ప్రాంతాల ప్రజల కొనుగోలు శక్తి పతనం వెనుక ఉన్నాయి. ఈ కారణాల చేతనే నేడు దేశీయంగా డిమాండ్ భారీగా పతనమవుతున్నది. ఈ క్రమంలోనే, టోకు ధరల సూచి జూన్ 2023 నాటికి మూడు నెలలుగా అధోముఖంగా సాగుతున్నది. ఫలితంగా 4.12 శాతం పతనంతో జూన్లో టోకు ధరల సూచి ఎనిమిదేండ్ల కనిష్ఠ స్థాయిలో ఉన్నది. సరుకులకు, సేవలకు డిమాండ్ పతనం వల్ల వాటి ధరలు పడిపోతున్నాయి. రానున్న రోజుల్లో టోకు ధరల సూచిలో కనపడుతున్న ఈ ‘ప్రతికూల ద్రవ్యోల్బణం’ అనేది, రిటైల్ ద్రవ్యోల్బణంలో కూడా కనపడే అవకాశమే అధికం. అంటే, సామాన్య జనం కొనుగోళ్ల స్థాయిలో కూడా మరింతగా దిగజారుడు సంభవించి – అది ద్రవ్యోల్బణం ప్రతికూల దిశగా (మైనస్లోకి) వెళ్లే ప్రమాదం కూడా ఉన్నది. ఇది అధిక ద్రవ్యోల్బణం కంటే కూడా ప్రమాదకరమైన పరిస్థి తి. ఈ స్థితిలో దేశీయ డిమాండ్ అనేది, దేశంలో పారిశ్రామిక ప్రగతికి ఊతాన్నిచ్చేదిగా ఉండజాలదు.
ఇక మోదీ ప్రస్తావించిన రెండవ అంశం, మన దేశం ప్రజాస్వామ్య దేశం కావడం. ఈ అంశం ప్రాతిపదికనే, ప్రధానంగా నేడు అమెరికా వంటి పాశ్చాత్య ధనిక దేశాలు చైనాలో కేంద్రీకృతమై ఉన్న సరుకు ఉత్పత్తి రంగంలోని గణనీయమైన భాగాన్ని ‘చైనా ప్లస్ వన్’ పేరిట భారతదేశం వంటి దేశాలకు మళ్లించాలని కోరుకుంటున్నాయి. పాశ్చాత్య దేశాల ఈ విధానం, మన దేశంలో పారిశ్రామికీకరణకు కలిసి వస్తుందనేది మన ప్రభుత్వ అంచనా. అయితే, ఇప్పటివరకు ‘చైనా ప్లస్ వన్’లోని ప్లస్ వన్గా… అంటే, చైనా నుంచి తరలివెళ్లే పరిశ్రమలను ఆకట్టుకోవడంలో మనం పెద్దగా విజయవంతం కాలేదు. ఆ దిశగా మనకు వియెత్నాం వంటి దేశాల నుంచి బలమైన పోటీ వస్తున్నది. అలాగే, నేడు మనం పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్న అమెరికా వంటి దేశాల్లో కూడా పరిస్థితులు మారుతున్నాయి. ఆ దేశంలో నేడు పారిశ్రామిక సంస్థలకు కొత్త పారిశ్రామిక పెట్టుబడులకు భారీగా ప్రోత్సాహకాలను ఇస్తున్నారు.
అమెరికా ప్రభుత్వం, గతంలోని మార్కెట్ ఆధారిత విధానాల స్థానంలో నేడు – ప్రభుత్వ ప్రోత్సాహకాలూ, పారిశ్రామిక విధానాల ప్రాతిపదికన దేశంలో పారిశ్రామికరంగానికి తిరిగి ఊపిరులూదే ప్రయత్నం చేస్తున్నది. ఈక్రమంలోనే.. యూరప్ దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు అమెరికాకు తరలిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. ఫలితంగా, ఈ స్థితిని తట్టుకోగలిగేందుకు గాను అమెరికాకు ధీటుగా తమ దేశీయ పరిశ్రమలకు ప్రోత్సాహకాలను ఇచ్చుకునే ప్రయత్నాలను యూరోపియన్ యూనియన్ దేశాలు చేస్తున్నాయి. అదీ కథ!
కాబట్టి మనది ప్రజాస్వామ్య దేశమా కాదా అన్నది పెట్టుబడులను ఆకట్టుకోవడంలో ప్రస్తుతం ప్రశ్న కాదు. అసలు ప్రశ్నలల్లా… నేటి పోటీ ప్రపంచంలో… పెట్టుబడుల కోసం… ఇతర దేశాలకు ధీటుగా మన దేశం రాయితీలను ఇవ్వగలదా? మౌలిక సదుపాయాలను సమకూర్చగలదా? అలాగే, నిపుణులైన కార్మికులను, ఉద్యోగులను పారిశ్రామిక రంగానికి అందుబాటులో ఉంచగలదా? అనేవి మాత్రమే. ఈ విషయంలో చూస్తే మౌలిక సదుపాయాల కల్పనలో మనం కొంతమేర ప్రగతిని సాధించగలిగినా, ఇంకా చేయవలసింది చాలా ఉన్నది. ఇప్పటికీ దేశంలో సరుకుల ఎగుమతికి అవుతున్న రవాణా వ్యయం (లాజిస్టిక్స్) సుమారుగా 13 శాతంగా (అంటే వంద రూపాయల సరుకు ఖరీదులో సుమారు 13 రూపాయలుగా) ఉన్నది. కాగా, ఈ లాజిస్టిక్స్ వ్యయం సగటు అంతర్జాతీయంగా 7-8 శాతంగా ఉంది. ఫలితంగా మన దేశ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలో చౌకధరల పోటీని తట్టుకోవడం కష్టమవుతున్నది. ఇక, మానవ వనరుల నిపుణతల విషయంలో మనం చాలా బలహీనంగా ఉన్నాం. ఈ దిశగా స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాలు వచ్చినా, అవి ఇప్పటికి కూడా పెద్దగా ఫలితాలను చూపలేక పోతున్నాయి. ప్రస్తుతం కొత్తగా ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో నిపుణుల శిక్షణకు కృషిచేసే ప్రయత్నాలు మొదలవుతున్నాయి. కనీసం ఈ శిక్షణలు అయినా తానెక్కే రైలు జీవితకాలం లేటు అన్నట్టుగా ఉండవని ఆశిద్దాం! మూడోది… యువజనులు అధికంగా ఉండటం. ఇది మన దేశానికి వరంగా ఉండాలంటే వారికి మనం తగిన ఉపాధిని కల్పించగలగాలి. దానికిగాను వారందరికీ తగిన నిపుణతలూ, విద్యను అందించగల పరిస్థితి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు నేడు అది లోపించింది.
అంతిమంగా నేడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పతనమవుతున్న కాలంలో దేశంలో పారిశ్రామిక ప్రగతి కోసం ప్రయత్నించడం కష్టసాధ్యమైన పని. ప్రస్తుతం మన దేశంతో పాటుగా చైనా ఎగుమతులు కూడా భారీగా పడిపోతున్నాయి. ధనిక దేశాల్లో సంక్షోభ వాతావరణం, ఆర్థిక స్థితిగతుల దిగజారుడు, ప్రజల కొనుగోలు శక్తి పతనం వంటివన్నీ దీనికి కారణం. దేశీయంగా కూడా ప్రజల కొనుగోలు శక్తి దిగజారుడు గురించి ముందుగానే ప్రస్తావించుకున్నాం.
ఈ నేపథ్యంలో, దేశంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు పరస్పర ఆధారిత మూడు ప్రధాన మార్గాలున్నాయి. వాటిలో ఒకటి వ్యవసాయ రంగంలోని వారి ఆదాయాలను పెంచగలగడం. అంటే, కనీస మద్దతు ధర వంటి వాటి దిశగా పెద్ద ముందడుగులు వేయగలగాలి. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో చిత్తశుద్ధి అవసరం. అంతకుమించి, నగర ప్రాంతాలకూ జాతీయ ఉపాధి హామీ పథకం తరహా కార్యక్రమాలు అవసరం. ఇక రెండవది సంపద పన్ను. ప్రస్తుతం దేశంలో ఆర్థిక అసమానతలు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీయంగా బిలియనీర్లపై సంపద పన్ను విధించడం అవసరం. దాని ద్వారా సమకూరే వనరులను నూటికి 99 శాతం జనం బాగుకోసం ఖర్చుపెట్టవచ్చు. దానివల్ల దేశానికి అదొక ఆర్థిక ఉద్దీపనగా ఉంటుంది. ఫలితంగా, మనం నేటి మాంద్య స్థితిని అధిగమించే అవకాశం వస్తుంది.
ఇక మూడవది కార్మికులు, ఉద్యోగుల వేతనాలను ద్రవ్యోల్బణంతో ముడిపెట్టి, తదనుగుణంగా నిజ వేతనాలు రక్షణ పొందేలా చర్యలు తీసుకోవడం కూడా ప్రస్తుతం తక్షణ అవసరం. ఇది మాత్రమే పడిపోతున్న గ్రామీణ పేదల ఆదాయాన్ని, నగర ప్రాంత ప్రజల కొనుగోలు శక్తిని కాపాడగలదు. ఇలాంటి చర్యలు మాత్రమే దేశీయంగానే డిమాండ్ను కల్పించి మేకిన్ ఇండియా, దాని కొనసాగింపు అయిన పీఎల్ఐ పథకాలకు విజయాన్ని సాధించిపెట్టగలదు. వియెత్నాం వంటి దేశాలకు భిన్నంగా భారతదేశం జనాభా రీత్యా చాలా పెద్దది కావడమనే అంశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే దానికిగాను రాశి దృష్ట్యానే కాకుండా… ప్రజల నిపుణతలు, విద్య, కొనుగోలు శక్తి వంటి వాసి సంబంధిత అంశాల్లో కూడా మనం ముందడుగు వేయగలగాలి.
డి.పాపారావు
98661 79615