‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’.. పోరాట చరిత్రను తెలుసుకోవాలనుకొంటే అది విప్లవవీరుడు రాస్ బిహారీ బోస్ కలకత్తాలో వైశ్రాయ్ హార్డింజి మీద బాంబు విసరడంతో ప్రారంభమవుతుంది. బాంబు సంఘటనతో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. దీంతో రాస్ బిహారీ బోస్, తనకు సురక్షిత స్థానమైన జపాన్ చేరుకొని అక్కడే ఒక జపాన్ యువతిని వివాహమాడి, జపాన్ ప్రజలకు దగ్గరయ్యాడు.
అది రెండవ ప్రపంచయుద్ధ సమయం. వేలమంది బ్రిటిష్ సైనికులు జర్మనీకి యుద్ధ ఖైదీలుగా చిక్కారు. అందులో కొందరు భారత సైనికులూ ఉన్నారు. ఇటు తూర్పు ఆసియా ప్రాం త యుద్ధంలో 1942 ఫిబ్రవరి15న సింగపూర్ పతనమైంది. దీం తో 95 వేల మంది సైనికులను బ్రిటిష్ సైన్యాధికారులు జపాన్కు ధారాదత్తం చేశారు. అందులో 45 వేల మంది భారత సైనికులున్నారు. ఈ పరిస్థితులను గమనించిన రాస్ బిహారీ బోస్ మస్తిష్కంలో మెరుపు లాంటి ఆలోచన తళుక్కున మెరిసింది. అది బం దీలైన భారత సైనికులతో భారత సైన్యాన్ని నిర్మించడం. దాని సహాయంతో భారతదేశంలోని బ్రిటిష్ సైన్యంపై దండెత్తి బ్రిటిష్ వారిని ఓడించి భారత స్వాతంత్య్రం సాధించడం. ఎలాగోలా రాస్ బిహారీ బోస్ జపాన్ వారిని ఒప్పించి, వారి సహకారంతో మొట్టమొదట ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనే సంస్థను (ఐ.ఐ.ఎల్), దానికి అనుబంధంగా ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐ.ఎన్.ఏ) అనే సైనిక విభాగాన్ని ఏర్పాటుచేశాడు. జపాన్కు పట్టుబడ్డ అనేకమంది భారతీయ సైనికులు ఐ.ఎన్.ఏలో చేరారు. వీరికి నాయకుడిగా కెప్టెన్ మోహన్సింగ్ను నియమించాడు. ఈ సైనికదళ లక్ష్యం భారత దేశా న్ని బ్రిటిషర్ల నుంచి విముక్తి చేయడం.
ఇక ఇటు భారతదేశంలో, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నందుకు బ్రిటిష్ ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ను జైల్లో పెట్టింది. ఆయన జైల్లో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించాడు. దానితో ఆయన ఆరోగ్యం విషమంగా మారింది. కలవరపడ్డ బ్రిటిష్ ప్రభు త్వం ఆయనకు గృహ నిర్బంధం విధించి ఆయనకు నిరంతర పోలీస్ పహారాను ఏర్పాటుచేసింది. అయితే పోలీసుల కండ్లు కప్పి వివిధ పేర్లతో ప్రయాణించి జర్మనీ చేరి, జర్మనీ నియంత హిట్లర్ను కలుసుకొన్నాడు సుభాష్ చంద్రబోస్. అంతే కాదు జర్మనీ సహకారంతో ఒక ఫ్రీ ఇండియా సెంటర్ను, రేడియో స్టేషన్ను ఏర్పాటు చేశాడు. వాటికితోడు జర్మనీ సహకారంతో యుద్ధ ఖైదీలైన భారతీయులతో కూడిన ఒక సైనిక పటాలాన్ని ఇండియన్ లెజియన్ పేరుతో ఏర్పా టుచేశాడు. ఈ సైనిక పటాల లక్ష్యం జర్మనీ సహకారంతో భారతదేశం నుంచి బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారదోలి భారతదేశాన్ని విముక్తి చేయడం. ‘జై హింద్’ నినాదం ఇక్కడే రూపుదిద్దుకున్నది. అయితే రానురాను జర్మనీ నియంతలో భారతీయుల పట్ల మార్పును గమనించిన నేతాజీ నిరుత్సాహానికి గురయ్యాడు.
ఇక అదే సమయంలో జపాన్లో రాస్ బిహారీ స్థాపించిన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ వివిధ కారణాల వల్ల మూతపడింది. అయితే రాస్ బిహారీ బోస్కు లీగ్ను కానీ, ఐ.ఎన్.ఏను కాని మూసివేయడం ఇష్టం లేదు. అందుకని బాగా ఆలోచించి జర్మనీలో ఉన్న నేతాజీని జపాన్కు రప్పించి ఆయన చేతిలో లీగ్ను పెడితే బాగుంటుందని నేతాజీని జపాన్కు ఆహ్వానించాడు. దీనికి సమ్మతించిన నేతాజీ సబ్మెరిన్లో అతి సాహసోపేతమైన ప్రయాణం చేసి 1943 మే 6న సాబాన్ ద్వీపం, ఆ తర్వాత సింగపూర్ చేరుకున్నాడు. 1943 జూలై 4న ఆయన లీగ్ బాధ్యతలను స్వీకరించాడు. 1943 ఆగస్ట్ 26న నేతాజీ ఐ.ఎన్.ఏ సర్వసైన్యాధ్యక్ష పదవి స్వీకరించాడు.
తర్వాత నేతాజీ స్వతంత్ర భారత (తాత్కాలిక ) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు. ఈ ప్రభుత్వం అక్ష
రాజ్యాలతో పాటు, సియాం, బర్మా, ఫిలిప్పీన్ ప్రభుత్వాలచే గుర్తించబడింది. ఆ వెంటనే ఈ ప్రభుత్వం మిత్ర రాజ్యాల మీద యుద్ధం ప్రకటించింది.యుద్ధ కార్యాచరణ కోసం ఐ.ఎన్.ఏ వివిధ విభాగాలుగా విభజించబడింది.
ఇక ‘చలో ఢిలీ’ నినాదంతో కదనరంగంలోకి దూకిన ఐ.ఎన్.ఏ మొదటి విభాగం 1944 జనవరిలో బర్మా చేరుకున్నది. అప్పటికే సుభాష్ బ్రిగేడ్ అక్కడికి పంపబడింది. 1944 మార్చిలో రెండవ విభాగం కూడా అక్కడకి చేరుకున్నది. వీరితో పాటు లక్ష మందితో కూడిన జపాన్ సేన 1944 ఫిబ్రవరిలో బర్మాలో బ్రిటిష్ సేనల మీద దాడిచేసింది. అయితే అప్పటికే గట్టి పట్టు బిగించుకొన్న బ్రిటిష్ సేనల ముందు నిలువలేకపోయింది. ఇక జపాన్తో పాటు పోరాడుతున్న ఐ.ఎన్.ఏ సైనికులు జపాన్ సహకారం లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చివరికి 1944 మేలో జపాన్ సేన యుద్ధరంగం నుంచి నిష్క్రమించింది. అయినా ఐ.ఎన్.ఏ. సైనికులు బర్మాలో పోరాటం కొనసాగించారు.
ఇక రెండవ ప్రపంచయుద్ధంలో అక్ష రాజ్యాలు పరాజయం పాలయ్యాయి. 1945లో హిరోషిమా-నాగసాకీ మీద అణుబాంబు దాడితో జపాన్ మిత్ర దేశాలకు తలవంచక తప్పలేదు. జపాన్తో పాటే ఐ.ఎన్.ఏ. కూడా ఓటమిని అంగీకరించింది. అయితే నేతాజీ మాత్రం తన పోరాటాన్ని విరమించదలుచుకోలేదు. రష్యాను తన కార్యస్థలిగా చేసుకొని బ్రిటిష్ వారిపై పోరాటం కొనసాగించాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో రష్యా వెళ్లబోతూ ‘తైపె’ విమానాశ్రయం లో డెరియన్ వెళ్లనున్న విమానం ఎక్కాడు. అయితే ఆ విమానం గాల్లోకి లేవగానే సాంకేతిక కారణాల వల్ల నేల కూలింది.
ఆ సంఘటన తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి వెలువడ్డ వార్తలు వివాదాస్పదమయ్యాయి. ఆయన రష్యా వెళ్లాడ ని కొందరు, యోగిగా మారాడని మరికొందరు, విమాన ప్రమాదంలో మరణించాడని ఇంకొంద రు నేటికి నమ్ముతున్నారు. మన దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఇండియన్ నేషనల్ ఆర్మీ పోరాట వీరుల వీర గాథ ఇది.
(వ్యాసకర్త: బసవరాజు నరేందర్ రావు , 990 851 6549, న్యాయవాది)
ఫిబ్రవరి 23న నేతాజీ జయంతి