ప్రపంచస్థాయి సాంకేతిక విద్యకు చిరునామా మన ఐఐటీలు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ దిగ్గజాలను ఐఐటీలు తయారు చేస్తున్నాయి. మన ఐఐటీల్లో చదువుకున్నవారిలో ఎందరో అంతర్జాతీయ సంస్థలకు సీఈవోలుగా సేవలందిస్తున్నారు. దేశాన్ని ఏలే నేతలు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ తదితర బ్యూరోక్రాట్ల కాణాచి మన ఐఐటీలు. అయితే ఎంతో ఘన చరిత్ర కలిగిన విద్యాలయాలు పేదలు, బడుగు, బలహీనవర్గాలు, గ్రామీణ విద్యార్థులను అక్కున చేర్చుకోలేకపోతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మన ఐఐటీలు వారికి అందనంత దూరంలోనే నిలిచిపోతుండటం ఆందోళనకరం.
సుందర్ పిచాయ్, ఎన్ఆర్ నారాయణమూర్తి, సచిన్ బన్సాల్, పరాగ్ అగర్వాల్, అరవింద్ కృష్ణ, రాజా సుబ్రహ్మణ్యం, మనోహర్ పారికర్, జైరాం రమేష్, అలోక్ అగర్వాల్, జయంత్ సిన్హా, అరవింద్ కేజ్రీవాల్ తదితర హేమాహేమీలు ఐఐటీల నుంచి వచ్చినవారే. అయితే ఎందరో ప్రముఖులను అందించిన ఐఐటీలను ఏర్పాటు చేయాలనే ఆలోచన స్వాతంత్య్రానికి ముందే పురుడు పోసుకోవడం విశేషం. శాస్త్ర, సాంకేతిక రంగంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాలయాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 1945లో నలిని రంజన్ సర్కార్ అధ్యక్షతన 22 మంది నిపుణులతో కమిటీ ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా నాలుగు విద్యాసంస్థలను నెలకొల్పాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. అందుకు అనుగుణంగా పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్లో మొట్టమొదటి ఐఐటీని 1951 ఆగస్టు 18న అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రారంభించారు.
ప్రస్తుతం మన దేశంలో 23 ఐఐటీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యా శాఖ పరిధిలోని ఐఐటీ కౌన్సిల్ సారథ్యంలో ఇవి పని చేస్తాయి. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్లో వీటి నిర్వహణ కోసం రూ.9,661.50 కోట్లను కేటాయించారు. అత్యంత ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో 17,385 మంది విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసించే అవకాశం ఉన్నది. ఎంతో కఠినంగా ఉండే జేఈఈ పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించినవారికే వీటిలో అడ్మిషన్ లభిస్తుంది. గతేడాది ఐఐటీల్లో సీటు సాధించేందుకు 11,13,325 మంది విద్యార్థులు పోటీ పడ్డారు. ఐఐటీలో సీటు కోసం పోటీ ఏ స్థాయిలో ఉంటుందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. మన ఐఐటీల నాణ్యత దృష్ట్యా అంతర్జాతీయ సంస్థలు విద్యార్థులకు రూ.కోట్లలో ప్యాకేజీలు ఆఫర్ చేస్తుంటాయి. భారత్ వెలుపల కూడా మన ఐఐటీల క్యాంపస్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఐఐటీ మద్రాస్కు అనుబంధంగా క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు గతేడాది టాంజానియా ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది.
మన దేశంలో నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యను అందిస్తున్న విద్యా సంస్థల్లో ఐఐటీలు ముందు వరుసలో ఉంటాయి. 2023లో విడుదలైన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో మొదటి పది స్థానాల్లో 8 ఐఐటీలే దక్కించుకున్నాయి. సీట్లకున్న డిమాండ్కు అనుగుణంగా ఐఐటీల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉన్నది. అయితే ఏటా సీట్ల కోసం పోటీ పెరుగుతున్నదే తప్ప, ఐఐటీల సంఖ్య మాత్రం పెరగడం లేదు. గత దశాబ్ద కాలంలో 7 ఐఐటీలనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం శోచనీయం.
జేఈఈ పరీక్ష కఠినంగా ఉండటం వల్ల ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుంటున్న వారికే అడ్మిషన్లు వస్తున్నాయి. లక్షలు వెచ్చించినవారే ఐఐటీల్లో అడుగు పెడుతున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా పేదలు, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అందని ద్రాక్షగా మారింది. ఉన్నత వర్గాల పిల్లలకు మాత్రమే ఐఐటీలు నెలవుగా మారాయనే విమర్శ కూడా ఉన్నది. ఐఐటీ చదువులు పేద విద్యార్థులకు కూడా అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. అందుకు అవసరమైతే ప్రతిభ కలిగినవారికి ప్రత్యేకంగా కోచింగ్ ఇప్పించాలి. తద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుంది.
మన దేశం నుంచి మేధో వలసలు పెరగడం ఆందోళన కలిగించే అంశం. దేశంలో ఉపాధి అవకాశాలు సరిగ్గా లేకపోవడమే దీనికి కారణం. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రిసెర్చ్ -2023 నివేదిక ప్రకారం.. మొదటి 100 మంది ర్యాంకర్లలో 62 శాతం, 1,000 లోపు ర్యాంకర్లలో 36 శాతం మంది విదేశాలకు వలసపోతున్నారు. భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ అందిపుచ్చుకోవాలంటే ఈ మేధో వలసల్ని నివారించాలి.
-పాకాల శంకర్గౌడ్
98483 77734