తెలంగాణ చరిత్ర సమస్తం పోరాటాలమయం.తెలంగాణ అంటేనే పోరుగడ్డ. ఇక్కడ ఏదీ అంత సులువుగా దొరకదు. తిండి కోసం పోరే. జాగ కోసం పోరే. అస్తిత్వం కోసం పోరే, ఆత్మాభిమానం కోసం పోరే. జలం కోసం పెద్ద యుద్ధమే జరిగింది. ఇప్పటికీ జరుగుతున్నది. కాకపోతే, ఆనాడు ఉమ్మడి వలస పాలనలో ప్రాంతీయేతరులపై పోరాటం జరుగగా.. నేడు స్వరాష్ట్రంలో సొంత ప్రజలనే మోసం చేస్తున్న మన ప్రాంతంవాళ్లపైనే పోరాటం చేస్తున్నాం.
తెలంగాణకు పోరాటం కొత్తకాదు. తెలంగాణ చరిత్రను ఒకసారి పరికించి చూస్తే.. అన్నీ పోరాటాలే, గాయాల గేయాలే కనిపిస్తాయి. సాయుధ పోరాటం నుంచి మొదలుపెడితే స్వరాష్ట్రం సాధించేంత వరకు నిర్విరామంగా పోరు సలిపింది తెలంగాణ.
అస్తిత్వం కోసం దశాబ్దాలుగా పోరుబాటలో నడిచిన తెలంగాణ.. గడిచిన పదేండ్లు స్వర్ణయుగాన్ని చూసింది. నాటి రాయలవారి స్వర్ణయుగం ఎలా ఉండేదో తెలియదు కానీ, కేసీఆర్ పాలన మాత్రం దాన్ని మించినదనే చెప్పవచ్చు. ‘ఈ సమస్య ఉంది’ అని చెప్పడానికి వీల్లేని విధంగా పాలించారు కేసీఆర్. అందుకే పల్లెల దీనావస్థపై పాడే పాటలు మాయమయ్యాయి. ఈ పదేండ్లలో ఏ ఒక్కరూ గొంతెత్తి అటువంటి పాట పాడలేదు. కాలికి గజ్జె కట్టి ఏ కళాకారుడు ఆడలేదు. అటువంటి పాట రాసేందుకు కథా వస్తువు దొరకడం లేదని జగిత్యాలకు చెందిన ఓ ప్రముఖ కవి స్వయంగా చెప్పారు.
‘అంత బాగా పాలిస్తే, మరి మూడోసారి అధికారంలోకి ఎందుకు రాలేదు?’ అని కొందరు కుహనా మేధావులు ప్రశ్నిస్తుంటారు. మళ్లీ అధికారంలోకి ఎందుకు రాలేదంటే, కొంతమంది గ్రామస్థాయి నాయకులు, ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతే దానికి కారణం. అంతేకానీ, కేసీఆర్ నాయకత్వంపై వ్యతిరేకత కాదది. శ్రీరాముడి అంతటివాడికే వనవాసం తప్పలేదు. సీతమ్మను అడవులపాలు చేశాడంటూ మాటలు తప్పలేదు. ధర్మాన్ని బోధించిన శ్రీకృష్ణుడికే నిందలు తప్పలేదు. అయినా తెలంగాణలో ఓడిపోయింది కేసీఆర్ కాదు, ప్రజలు. ఓడిపోయింది బీఆర్ఎస్ కాదు, తెలంగాణ. ఆ ఓటమి తాలూకు ఫలితాలనే నేడు మనం అనుభవిస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలైనా కాలేదు, అంతలోనే రెండున్నర దశాబ్దాలుగా భారాన్ని నెత్తిన మోస్తున్నట్టు అనిపిస్తున్నది.
తెలంగాణను సాధించుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. బీఆర్ఎస్, కేసీఆర్ సర్కార్ గుర్తులను చెరిపేస్తానంటూ విధ్వంసం దిశగా పాలన సాగిస్తున్న రేవంత్రెడ్డి.. ముందుగా వీటిని ప్రజలకు దూరం చేయాలని చూస్తున్నారు. మన నిధులు మనకే ఉన్నా, అవి చేరవలసిన వారికి చేరడం లేదు. గత రెండు నెలలుగా అవ్వలకు ఆసరా పింఛన్ అందలేదనే వాస్తవమే దీనికి నిదర్శనం. ఆంధ్రా వ్యక్తికి టీఎస్పీఎస్సీలో స్థానం కల్పించి తమ విధానం ఏమిటనేది రేవంత్రెడ్డి సర్కార్ చెప్పకనే చెప్పింది.
నిధులు, నియామకాల సంగతి ఎలా ఉన్నా, ఎటొచ్చి ఇప్పుడు మన నీళ్లకు ముప్పు ఏర్పడింది. బీఆర్ఎస్, కేసీఆర్పై అక్కసుతో గత ప్రభుత్వం విజయవంతం అవడంలో కీలక భూమిక పోషించిన నీళ్లను మనకు దూరం చేయాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నది. అందుకే ‘కాళేశ్వరం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు’ అనే భ్రమను ప్రజల్లో కల్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నది. దాంతోపాటు అనాలోచితంగా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు అంగీకరించింది. ఆ నిర్ణయంపై బీఆర్ఎస్ ఉద్యమాన్ని లేవనెత్తడంతో ఇప్పుడు కక్కలేక మింగలేక చస్తున్నది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడమంటే.. ఉమ్మడి ఏపీలో తెలంగాణ అనుభవించిన దీనస్థితిని మళ్లీ ఆహ్వానించడమే. మన చేలను చేతులారా బీళ్లుగా మార్చుకోవడమే.
ఇప్పటికే పల్లెల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే’ అని ఎండిపోయిన పైర్లు విలపిస్తున్నాయి. ‘పల్లె కన్నీరు పెడుతుందో’ అంటూ బీడు భూములు ఆక్రందనలు చేస్తున్నాయి. ‘ఓ కవులారా! మా దీనస్థితిపై పాట రాసేందుకు మీ కలం సహకరించడం లేదా?’ అని గ్రామాలు గొంతెత్తి ఘోషిస్తున్నాయి. ‘ఓ కళాకారులారా! మా దైన్యంపై ఆడి పాడేందుకు మీకు కాలి గజ్జె ఇంకా దొరకలేదా?’ అంటూ పల్లెలు ప్రశ్నిస్తున్నాయి.
ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఎక్కడ చూసినా బీడు భూములే కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం జలాలు అందుబాటులో ఉన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లివ్వడం లేదు. మరి ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తే ఎంతటి విపత్కర పరిస్థితులను చూడాల్సి వస్తుందో తెలంగాణ రైతాంగం ఒక్కసారి ఆలోచించుకోవాలి.
‘కోరి తెచ్చుకున్నప్పుడు కొట్టినా పడాలె.. తిట్టినా పడాలె’ అని కొందరు అంటున్నారు. అలా పడటం, పడి ఉండటం తెలంగాణ చరిత్రలో లేదు. తెలంగాణ బిడ్డల రక్తంలో అసలు లేనేలేదు. అన్యాయాన్ని ఎదిరించడమే తెలంగాణకు తెలుసు. నాడు 2001లో కేసీఆర్ సారథ్యంలో జల సాధన కోసం పోరు జరిగినట్టే.. కృష్ణా జలాల్లో మన హక్కులను కాపాడుకునేందుకు నేడు మరో ఉద్యమానికి తెరలేస్తున్నది. నల్లగొండ వేదికగా కేసీఆర్ నాయకత్వంలో మహా జలయజ్ఞం జరుగబోతున్నది. ఆ మహాయజ్ఞంలో పాల్గొని మనమూ కదం తొక్కుదాం. మన హక్కులను కాపాడుకుందాం. మనకు తెలియని పోరాటమా? మనం చూడని పోరా? ‘మా నీళ్లు మాకేనని’ మరోసారి మర్లబడుదాం. లే.. నడువ్.. నల్లగొండ పయనమవ్వు.
జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
-మాలోతు సురేష్
98856 79876