ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం సాక్షిగా మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం వేలమంది ఉద్యోగుల జీవితాలకు ప్రగతి బాట అయ్యింది. ఈ నిర్ణయంతో ప్రతి ఉద్యోగి తన గుండెలపై చేయి వేసుకుని నిర్భయంగా జీవించడమే ఆయన లక్ష్యమని మరోసారి తేటతెల్లమైంది.
ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావాలనే కల ఏండ్ల తరబడి శిలగా మారింది. ఈ తరుణంలో ఉద్యమకారుడై వచ్చిన కేసీఆర్ నేనున్నానంటూ ఆర్టీసీ కార్మికులకు అభయమిచ్చారు. నాడే కార్మికుల గుండెల్లోని ఆవేదనను చూసి ఆర్టీసీని అన్నివిధాలా ఆదుకుంటానని ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే ఆర్టీసీని ఎలా రక్షించాలన్న దానిపైనే కేసీఆర్ దృష్టిసారించారు. నష్టాల బాట నుంచి ఆర్టీసీని గట్టెక్కించేందుకు అనేక చర్యలు చేపట్టారు. అంతేకాదు, ఉద్యమ సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకు ముందడుగు వేసే విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఎవరూ ఊహించనివిధంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు.
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. ప్రపంచం మొత్తం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్న సమయంలోఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఒక చరిత్ర. ప్రభుత్వం తీసుకువచ్చే టీఎస్ఆర్టీసీ విలీన చట్టం ద్వారా ఇప్పటివరకు ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉన్న ఆర్టీసీ.. పూర్తిగా ప్రభుత్వ సంస్థగా మారనున్నది. ఆర్టీసీ కార్మికులు సైతం రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.
తీవ్ర నష్టాలతో దివాలా దిశలో ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సం స్థకు ప్రభుత్వంలో విలీనం ద్వారా ఊపిరులూదినట్టయింది. ప్రభుత్వంలో విలీనం చేయడం ప్రభుత్వరంగ రవాణా సంస్థ చరిత్రలో ఒక మలుపుగా భావించవచ్చు. తాజాగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలమంది ఆర్టీసీ కార్మికుల తలరాతనే మార్చేసింది. ఇప్పటిదాకా ఉద్యోగ భద్రతపై భయం భయంగా కాలం వెళ్లదీసిన ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగానికి ఎలాం టి ఢోకా లేదనే భరోసాను కేసీఆర్ కల్పించారు. కష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు గొప్ప వరం అందించి, వారి కష్టాలన్నీ ఏకకాలంలో పోగొట్టిన కేసీఆర్ తనది గొప్ప మనసు అని మరోసారి రుజువు చేశారు.
లాభనష్టాల ప్రాతిపదికన చూడటం వల్ల ఆర్టీసీని వ్యాపార ధోరణితో పరిగణించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయినా గట్టెక్కడం లేదు. జీతాల పెంపు వంటి వాటివల్ల యాజమాన్యం, కార్మికుల మధ్య సయోధ్య కుదరడం లేదు. రోజురోజుకు అంతరాయం పెరుగుతున్నది. వ్యయం తగ్గించుకునేందుకు పోస్టులను భర్తీచేయకుండా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందితో నెట్టుకురావడం, కార్మికులను తగ్గించడం, కొత్త బస్సులను ప్రవేశపెట్టకపోవడం, కొన్ని ప్రాంతాలకు బస్సులను తిప్పడం వల్ల నష్టం వస్తుందని వాటిని ఆపివేయడం, కాలం తీరిన బస్సులతో నెట్టుకు రావడం వంటి ఇబ్బందులు ప్రస్తుతం ఉన్నాయి. విలీనమైతే ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైతే అద్దె బస్సులతో నెట్టుకురావాల్సిన పరిస్థితి తప్పుతుంది. కొత్త బస్సుల కోసం బడ్జెట్లో కేటాయింపులుంటాయి. లాభనష్టాల ప్రాతిపదికన చూసే అవకాశం ఉండదు. కాబట్టి ప్రయాణికుల అవసరాల మేరకు దాదాపు అన్ని ప్రాంతాలకు బస్సులు నడిపే పరిస్థితులు ఉంటాయి. డీజిల్ ధరలతో సంబంధం లేకుండా ప్రజలు చౌకగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.
ఆర్టీసీకి నష్టాలు వచ్చినా, లాభాలు వచ్చినా ప్రభుత్వమే భరిస్తుంది. బాధ్యత తీసుకుంటుంది. బస్సులు సామాన్యులకు అందుబాటులో ఉంటాయి. అయితే, ఇది నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ దవాఖానల గురించి నిత్యం మనం వింటూనే ఉంటాం. రేపటి గురించి ఈరోజు ఆలోచించేవాడే అసలైన నాయకుడు. ఎప్పటికప్పుడు భవిష్యత్తు సవాళ్లకు అనుగుణంగా తన శ్రేణులను సమాయత్తం చేస్తూ, ప్రత్యర్థులను చిత్తు చేయడంలో ఓ ఆకు ఎక్కువ చదివినవాడే అధినాయకుడు. తెలంగాణ ఉద్యమనేతగా, కొత్త రాష్ట్ర పాలకుడిగా తనకు తానే సాటి అనిపించుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆరితేరిన వ్యూహకర్త. లక్ష్యం ఉంటే నిర్దిష్టమైన మార్గం ఉంటుంది. సరైన మార్గాన్ని ఎంచుకుంటే లక్ష్యం అదే సాకారమవుతుంది.
బీఆర్ఎస్ పార్టీ అధినేతగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పంథా ఇదే. దశాబ్దాల కల సాకారానికి నిన్నటి ఉద్యమాన్ని ఎంత పటుత్వంగా నడిపించారో, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛలను నిజం చేసేందుకు అంతే పట్టుదలతో ఆయన తన మార్గాన్ని నిర్దేశించుకున్నారు. అందుకే సీం కేసీఆర్ను పట్టువదలని విక్రమార్కుడంటూ తెలంగాణ ప్రజానీకం కీర్తిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు భరోసానిచ్చి అండగా నిలిచిన కేసీఆర్కు కార్మికలోకం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. బంగారు బాతులాంటి ఆర్టీసీ పరిరక్షణలో ప్రభుత్వానికి సాయం అందించడమనేది కార్మికుల బాధ్యతగా గుర్తించాలి. అప్పుడే కేసీఆర్ లక్ష్యం నెరవేరుతుంది. ఆ దిశగా ఆర్టీసీ ఉద్యోగులు ప్రగతి బాటవైపు అడుగులు వేస్తారని ఆశిద్దాం.
(వ్యాసకర్త: రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్)
-కోలేటి దామోదర్
98491 44406