స్వతంత్ర మీడియాను వేధించడానికి, నోరు మూయడానికి లేదా శిక్షించడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడటం నిరంకుశ నాయకులు చేసే పనే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమనే గర్వదాయక గుర్తింపును చెరిపివేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీని ఇదేగాటన కట్టవచ్చు. 2014లో మోదీ అధికారానికి వచ్చిన నాటినుంచి ప్రభుత్వ అభిమతానికి భిన్నంగా వార్తలు రాసేందుకు పాత్రికేయులు తమ ఉద్యోగాలను, ప్రాణాలను పణంగా పెట్టవలసి వస్తున్నది. పాత్రికేయుల మృతి వెనుక వాస్తవాలు వెల్లడికానట్టి ఉదంతాల ఆధారంగా పాత్రికేయ పరిరక్షణ కమిటీ రూపొందించిన గ్లోబల్ ఇంప్యూనిటీ ఇండెక్స్లో భారత్ 11వ స్థానంలో ఉన్నది. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ప్రచురించిన వార్షిక పత్రికా స్వేచ్ఛ సూచిక ప్రకారం భారత్ 150వ స్థానంలో ఉన్నది. ఈ పట్టికలో మొత్తం 180 దేశాలున్నాయి. ఈ జాబితాలో అమెరికా 42వ స్థానంలో ఉంటే, రష్యా 155వ స్థానంలో, చైనా 175వ స్థానంలో ఉన్నాయి.
మోదీ విధానాల ఫలితంగా పత్రికా రంగంలో స్వీయ సెన్సార్షిప్ మొదలైంది. దీంతో పాటు ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా వార్తా కథనాలలో హిందు జాతీయవాద భావజాలం పెరిగింది. విమర్శలను సహించలేని మోదీ విధానానికి తాజా ఉదాహరణ- గత నెలలో బీబీసీ డాక్యుమెంటరీ ‘ది మోదీ క్వశ్చన్’ను అడ్డుకోవడానికి ఎమర్జెన్సీ చట్టాలను ప్రయోగించడం. గుజరాత్లో 2002లో సాగిన హింసాకాండలో వెయ్యి మందికి పైగా హతమయ్యారు. ఇందులో మోదీ పాత్రను చూపే ప్రశ్నలను ఈ డాక్యుమెంటరీ మరోసారి లేవనెత్తింది.
గుజరాత్ అల్లర్లకు సంబంధించిన ప్రధాన అంశాలన్నీ అందరికీ తెలిసినవే. అయితే బీబీసీ డాక్యుమెంటరీ ఓ కొత్త విషయాన్ని బయట పెట్టింది. అల్లర్లకు దారితీసిన ఉద్రిక్త వాతావరణానికి మోదీ నేరుగా బాధ్యుడని బ్రిటిష్ ప్రభుత్వం 2002 నాటి నివేదికలో పేర్కొన్నది. దాడులు జరిగినప్పుడు పోలీసులు జోక్యం చేసుకోకుండా చూసిందని గుజరాత్ ప్రభుత్వంపై ఈ నివేదిక అభియోగం మోపింది. తగిన ఆధారాలు లేకుండా అభియోగాలు మోపకూడదని 2012లో సుప్రీం కోర్టు నియమించిన దర్యాప్తు సూచించింది.
2019లో భారీ మెజారిటీతో ఎన్నికైన మోదీ అత్యంత ప్రాచుర్యంగల నాయకుడు. కానీ, రెం డు దశాబ్దాల కిందటి హింసాకాండలో తన పాత్ర గురించి, ప్రత్యేకించి తనదైన శైలి హిందు జాతీ యవాదంపై చర్చను తొక్కిపెట్టడం గురించి ఎదురవుతున్న ప్రశ్నలను విదిలించుకోలేకపోతున్నారు.
హిందు ఆధిపత్యం అనే బీజేపీ భావన న్యాయవ్యవస్థలో,మీడియాలో చొచ్చుకుపోయిందనీ, దీనివల్ల తమకు ఏమీ కాదనే ధైర్యంతో ఆ పార్టీ మద్దతుదారులు మత అల్పసంఖ్యాక వర్గాలను బెదిరించడం, వేధించడం, దాడులు చేయడం సాగిస్తున్నారనీ ఇటీవల హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక
పేర్కొన్నది.
బీబీసీ రెండు భాగాల డాక్యుమెంటరీ ఈ పరిస్థితిని సవాలు చేసింది. భారత్లో ప్రసారం చేసే ఆలోచన లేనప్పటికీ, కీలకమైన భాగాలు సోషల్ మీడియాలో ప్రసారం కావడం మొదలైంది. దీనికి ప్రభుత్వం ఆగ్రహం చెందింది. ఇది శత్రుపూరిత ప్రచారమనీ, భారత వ్యతిరేకమైన చెత్త చెదారమనీ, వలసవాద మనస్తత్వంతో కూడుకున్నదనీ విమర్శిస్తూ సమాచార ప్రసార శాఖ ఈ డాక్యుమెంటరీ లింకులను, వీడియోలను అడ్డుకున్నది. యూట్యూబ్, ట్విటర్ తమ ఆదేశాలకు తలొగ్గినట్టు వెల్లడించింది.
అత్యున్నత సంపాదక ప్రమాణాల ప్రకారం, కఠోరమైన పరిశోధన ద్వారా ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్టు బీబీసీ వెల్లడించింది. ఈ డాక్యుమెంటరీలోని కొన్ని భాగాలు కూడా బయట పడకుండా నిరోధించడంతో సహజంగానే ఆసక్తి ఇనుమడించింది. ప్రతిపక్ష నాయకుడు ఒకరు ఈ నిషేధాన్ని తీవ్రస్థాయి సెన్సార్షిప్గా పేర్కొన్నారు. ఈ నిషేధంపై హక్కుల సంఘాలు విరుచుకుపడ్డాయి. విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష బృందాలు ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించ యత్నిస్తుంటే, ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. న్యూఢిల్లీలోని జవహర్లాల్ విశ్వవిద్యాలయంలో ప్రదర్శనను అడ్డుకోవడానికి ప్రభుత్వం విద్యుత్ సరఫరాను, ఇంటర్నెట్ను నిలిపివేయించింది. కానీ విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా చూడనే చూశారు.
మోదీకి రాజకీయ ఇబ్బందిగా మొదలైన అంశం పత్రికా స్వేచ్ఛ విషయమై గగ్గోలు పుట్టి, ప్రపంచానికి పరీక్ష పెట్టింది. అంతర్జాతీయ వ్యవహారాలలో ప్రధాన పాత్ర పోషించాలని మోదీ భావిస్తున్నారు. ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నందున చైనాకు పోటీగా భారత్ను నిలబెట్టాలనో లేక ఉక్రేయిన్ విషయంలో భిన్నాభిప్రాయం కలిగి ఉన్న మోదీ మద్దతు పొందాలనో, ఆయనను అమెరికా, యూరప్ నాయకులు కలుపుక పోతున్నారు. భారత్లో ఐఫోన్ 14 ఉత్పత్తి ప్రారంభిస్తామని యాపిల్ కంపెనీ ప్రకటించింది. చైనా నుంచి భారత్ వైపు మొగ్గడానికి ఇది సూచిక అని విశ్లేషకులు భావిస్తున్నారు.
బ్రిటిష్ ప్రభుత్వం బీబీసీ స్వతంత్రతను దృఢంగా చెప్పింది, కానీ డాక్యుమెంటరీపై నిషేధాన్ని ఖండించలేదు. ఈ డాక్యుమెంటరీ గురించి, దాడులలో మోదీ బాధ్యత గురించి ఒక ప్రతిపక్ష నేత ప్రశ్నించినప్పుడు ప్రధాని సునక్ బదులిస్తూ- బ్రిటన్ సాధారణంగా విద్వేష దాడులకు వ్యతిరేక వైఖరి కలిగిఉంటుందనీ, అయితే ఒక గౌరవనీయమైన వ్యక్తిని చిత్రీకరించిన తీరుతో ఏకీభవిస్తానని చెప్పలేనని అన్నారు. ఈ ఏడాది చివరలో మోదీ అమెరికా సందర్శన విషయమై అధ్యక్ష భవనంలో చర్చలు సాగుతున్నట్టు రాయిటర్ వార్తా సంస్థ వెల్లడించింది. ఢిల్లీలో సెప్టెంబర్లో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది.
రష్యా, చైనా అంతర్జాతీయ రంగంలో బలాబలాల సమతౌల్యాన్ని మార్చడానికి యత్నిస్తున్న నేపథ్యంలో- భారత కీలకమైన దేశంగా మారింది. అయితే మోదీతో సంబంధాలు పటిష్ట పరచుకోవాలని చూస్తున్న అమెరికా, యూరప్ నాయకులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యం, పటిష్టమైన స్వేచ్ఛాయుతమైన పత్రికారంగం ఉన్నప్పుడే భారత్ ప్రపంచ స్థాయి పాత్ర పోషించగలదు. 1975- 77 మధ్యకాలంలో జనాకర్షణ గల నాయకత్వం ఎమర్జెన్సీ విధించి, అసమ్మతిని అణచివేసినప్పు డు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఆ చీకటి రోజులలో మోదీ పార్టీ అయిన బీజేపీ కూడా అణచివేతకు గురైంది, ఆ పార్టీ నాయకు లు జైలు పాలయ్యారు.
(మోదీ పాలనపై న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్ బోర్డ్ వ్యాఖ్య )
న్యూయార్క్ టైమ్స్ (2023, ఫిబ్రవరి 12 )